కేసీఆర్ క్లారిటీ .. జగన్ తో దోస్తీ ... అవసరమైతే మోడీతో కుస్తీ
Recommended Video
టీఆర్ ఎస్ అధినేత తెలంగాణ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖరరావు కేబినెట్ భేటీ తర్వాత మీడియాతో మాట్లాడారు. ఈసందర్భంగా కేసీఆర్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. పొరుగు రాష్ట్రాలతో స్నేహ పూర్వక సంబంధాలు కొనసాగిస్తామని చెప్పారు. పక్క రాష్ట్రాలతో వివాదాలు కొనసాగించేందుకు సిద్ధంగా లేమని చెప్పిన కేసీఆర్ ఏపీతో ఇకపై సత్సంబంధాలు కొనసాగిస్తామని వెల్లడించారు.. ఈ మేరకు కేటినెట్ లో నిర్ణయం తీసుకున్నామని చెప్పిన ఆయన ఇది తెలుగు ప్రజలకు శుభవార్తగా భావిస్తున్నట్టు పేర్కొన్నారు.
బీజేపీలో చేరికలు స్టార్ట్ ... అమిత్ షా సమక్షంలో పార్టీలో చేరిన మాజీ ఎంపీ కొత్తపల్లి గీత
ఏపీ స్నేహ హస్తం చాచింది .. కొనసాగిస్తామన్న కేసీఆర్
హైదరాబాద్ లో ఉన్న తెలంగాణ భవనాలను తెలంగాణకు అప్పగించడం ద్వారా ఏపీ ప్రభుత్వం స్నేహ హస్తం చాచిందని చెప్పిన కేసీఆర్ దాన్ని తాము కొనసాగించాలని కోరుకుంటున్నామని స్పష్టం చేశారు. గతంలో పొరుగు రాష్ట్రాలతో అనేక వివాదాలు ఉండేవని దాంతో ప్రతి రోజూ వివిధ వివాదాలతో ఇబ్బందికర పరిస్థితులు ఉండేవని ఇది అందరికీ తెలిసిన విషయమేనని అన్నారు. ఇక తెలంగాణ ప్రత్యేక రాష్ట్రంగా ఏర్పడ్డాక ఆ పరిస్థితి మారిందని తెలిపారు. కర్ణాటకతో సమస్యలు ఇప్పుడు లేవని ఇటీవల మూడుసార్లు పరస్పరం నీళ్లు ఇచ్చిపుచ్చుకోవడం జరిగిందని కేసీఆర్ పేర్కొన్నారు.
జగన్ ను ప్రశంసించిన కేసీఆర్ .. జగన్ కు సహకరిస్తామని ప్రకటన
ఏపీ సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి గురించి ప్రస్తావించారు తెలంగాణా సీఎం కేసీఆర్ . యువకుడు, ఉత్సాహవంతుడు అయిన జగన్ ఏపీలో సీఎం అయ్యారని పేర్కొన్న కేసీఆర్ ఆయన తన రాష్ట్రంలోని ప్రతి ప్రాంతానికి నీటిని అందించాలని దృడ సంకల్పంతో ఉన్నారని తెలిపారు. ముఖ్యంగా ఉత్తరాంధ్ర, రాయలసీమ, కోస్తా ప్రాంతాల్లోని మెట్టభూములకు నీళ్లు తీసుకెళ్లాలని జగన్ చాలా పట్టుదలగా ఉన్నారని వివరించారు. తెలంగాణలో కాళేశ్వరం తరహాలో , ఏపీలో కూడా అలాగే కొన్ని ప్రాజక్టులు పూర్తిచేసుకోవాలని జగన్ చెప్పారని , భేషజాలు పనికిరావన్న అభిప్రాయం జగన్ వైఖరి ద్వారా అర్థమవుతోందని కేసీఆర్ తెలిపారు .
జల వివాదాలు లేకుండా పరిష్కరించుకుంటామని వెల్లడి
ఏపీ నీటిపారుదల మంత్రిత్వ శాఖ నుంచి ఈ నెల 27, 28 తేదీల్లో ఓ బృందం హైదరాబాద్ వస్తోందని చెప్పిన కేసీఆర్ తాము కూడా విజయవాడ వెళ్లి జలాల విషయంలో చర్చలు జరుపుతామని వెల్లడించారు. అవసరమైతే పరిశీలన బృందాలు క్షేత్రస్థాయికి వెళ్లి నివేదికలు రూపొందిస్తాయని తెలిపారు. ఇరు రాష్ట్రాలు నీటి విషయంలో వివాదాలు లేకుండా చూసుకోటానికి ప్రయత్నం చేస్తాయని పేర్కొన్నారు. కృష్ణా ,గోదావరికి సంబంధించి 4800 టీఎంసీల నీళ్లు రెండు తెలుగు రాష్ట్రాలు పుష్కలంగా వాడుకోవడానికి అవకాశం ఉందని , ఇకమీదట తెలుగు రాష్ట్రాల వివాదాల్లో కేంద్రం జోక్యం చేసుకునే దుస్థితి పట్టకూడదని తానూ, ఏపీ సీఎం జగన్ నిశ్చయించుకున్నామని కేసీఆర్ వెల్లడించారు. గతంలో అపార్థాలు, కయ్యాలు , కీచులాటల ద్వారా అంతిమంగా తెలుగు ప్రజలు నష్టపోయారని తెలిపారు. ఇకమీదట ఆ సమస్య ఉండబోదని పేర్కొన్నారు
ఎన్డీయే భాగస్వామ్య పార్టీ కాదు .. ఫెడరల్ ఫ్రంట్ కే కట్టుబడి ఉన్నాం
ఏపీతో స్నేహాన్నే కొనసాగిస్తామని చెప్పిన కేసీఆర్ కేంద్రంలోని నరేంద్ర మోదీ సర్కారుతో మాత్రం కాదని ఆయన తేల్చి చెప్పారు . ఫెడరల్ ఫ్రంట్ కే కట్టుబడి ఉన్నానని ప్రకటించారు కేసీఆర్ .టీఆర్ఎస్ పార్టీ ఎన్డీఏ భాగస్వామ్య పార్టీ కాదని స్పష్టం చేశారు తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్. సార్వత్రిక ఎన్నికల్లో తాను ఫెడరల్ ఫ్రంట్ ఏర్పాటు కోసం ప్రయత్నించానని దానికే ఇప్పటికీ కట్టుబడి ఉన్నానని స్పష్టం చేశారు. ఇక నరేంద్రమోదీ ప్రధాని అయిన తర్వాత ఆయనను వ్యతిరేకించిన వ్యక్తిని తానేనని కేసీఆర్ చెప్పుకొచ్చారు. మోదీని ఫాసిస్ట్ ప్రధాని అంటూ విమర్శించింది తానేనని చెప్పుకొచ్చారు. తెలంగాణకు కేంద్రం సాయం చేసిందంటూ బీజేపీ జాతీయ అధ్యక్షుడు అమిత్ షా చేసిన వ్యాఖ్యలను తీవ్రంగా ఖండించానని గుర్తు చేశారు. నచ్చని అంశాలతో విబేధిస్తామని తేల్చి చెప్పారు. ప్రజోపయోగమైన అంశాలపై మోదీ సర్కారు నిర్ణయాలు తీసుకుంటే హర్షిస్తామని , అలా కాకుండా ప్రజా వ్యతిరేక నిర్ణయాలు తీసుకుంటే మాత్రం మోదీ సర్కారును వ్యతిరేకిస్తామని కూడా కేసీఆర్ క్లారిటీగానే చెప్పేశారు. మొత్తంగా మోదీ తో కుస్తీ కి, జగన్ తో దోస్తీకి కేసీఆర్ సై అంటున్నారని ఆయన వ్యాఖ్యలతో అర్ధం అవుతుంది.