కేసీఆర్కు ఊరట, కవిత కోసమని షబ్బీర్ నిలదీత
హైదరాబాద్: రాజకీయ వివాదానికి దారితీసిన ఛాతి ఆసుపత్రి తరలింపు పైన తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వానికి హైకోర్టులో ఊరట లభించింది. ఛాతి ఆసుపత్రి తరలింపును తప్పుపడుతూ భారతీయ జనతా పార్టీ నేత నాగం జనార్ధన్ రెడ్డి హైకోర్టును ఆశ్రయించారు.
ఆయన పిటిషన్ను న్యాయస్థానం తిరస్కరించింది. టీబీ వంటి అంటు ఆసుపత్రులు ప్రజలకు దూరంగా ఉండటమే మంచిదని న్యాయస్థానం పేర్కొంది.
చెస్ట్ ఆసుపత్రిని వికారాబాద్ తరలించడంలో కలిగే నష్టమేమిటో చెప్పాలని ప్రశ్నించింది. ఆసుపత్రిని ఎక్కడకు, ఎలా తరలించాలనే దాని పైన ప్రభుత్వానికి సలహా ఇవ్వాలన్నారు. ప్రభుత్వం తీసుకున్న నిర్ణయానికి కారణాలు అడగలేమని న్యాయస్థానం పేర్కొంది.
ఛాతి ఆసుపత్రిని తరలించడం రాజ్యాంగవ్యతిరేకం కాదన్న హైకోర్టు నిర్ణయంపై నాగం స్పందించారు. ఛాతి ఆసుపత్రిని తరలిస్తే ప్రజలు ఇబ్బందులకు గురవుతారని చెప్పారు. హైకోర్టులో విచారణ ముగిసినందున దీని పైన సుప్రీం కోర్టుకు వెళ్తామని చెప్పారు.
మరో పిటిషన్
ఛాతి ఆసుపత్రి తరలింపు పైన మరో పిటిషన్ న్యాయస్థానంలో దాఖలైంది. చారిత్రక కట్టడమని ఆ పిటిషన్లో అభ్యంతరం వ్యక్తం చేశారు. దీనిపై పూర్తి వివరాలతో వారంలోగా మరో పిటిషన్ దాఖలు చేయాలని న్యాయస్థానం ఆదేశించింది. ఛాతి ఆసుపత్రిని తొలగించి.. ఆ స్థానంలో బహుళ అంతస్తుల భవనంతులు కట్టనున్నారని, అయితే, అది చారిత్రక కట్టడమని దానిని తొలగించడం సరికాదని పిటిషనర్ ప్రభాకర్ పేర్కొన్నారు. దీనిపై పూర్తి వివరాలు ఇవ్వాలని కోర్టు కోరింది.
కేసీఆర్ను ఏకేసిన షబ్బీర్ అలీ
తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర రావు పైన కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత షబ్బీర్ అలీ సోమవారం మండిపడ్డారు. కేసీఆర్ ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్నారని ధ్వజమెత్తారు. ఆంధ్రప్రదేశ్ నుండి రావాల్సిన నీరు, విద్యుత్ రాబట్టడంలో కేసీఆర్ విఫలమయ్యారన్నారు. పెద్దపెద్ద మాటలు, రెచ్చగొట్టే మాటలు చెబుతూనే ఏపీ సీఎం చంద్రబాబుతో కాంప్రమైజ్ అవుతున్నారని ఆరోపించారు.
కేసీఆర్ ప్రధాని మోడీని ఎందుకు పొగుడుతున్నారని ప్రశ్నించారు. కూతురు కల్వకుంట్ల కవితకు మంత్రి పదవి కోసమే పొగుడుతున్నారని ఆరోపించారు. స్వార్థం కోసం చంద్రబాబు, కేసీఆర్లు సెంటిమెంట్ రెచ్చగొడుతున్నారని ఆరోపించారు.