ఇంట గెలిచి రచ్చ గెలవాలని.. తెలంగాణ ప్రజలను ట్యూన్ చేస్తున్న కేసీఆర్!!
తెలంగాణ సీఎం కేసీఆర్ ఇంట గెలిచి రచ్చ గెలవాలని భావిస్తున్నారా? అందులో భాగంగానే తెలంగాణ ప్రజలను ట్యూన్ చేసే పనిలో పడ్డారా? దేశ రాజకీయాల్లో రాణించడం కోసం ముందు తెలంగాణ ప్రజల పూర్తి మద్దతు కావాలని సీఎం కేసీఆర్ శతవిధాల ప్రయత్నం చేస్తున్నారా? అంటే అవుననే సమాధానమే వస్తోంది.

తెలంగాణా ప్రజలు హామీ ఇస్తేనే, అండగా నిలిస్తేనే దేశ రాజకీయాల్లో రాణిస్తా: సీఎం కేసీఆర్
తెలంగాణ సీఎం కేసీఆర్ దేశ రాజకీయాల్లో బీజేపీకి ప్రత్యామ్నాయంగా బీఆర్ఎస్ పార్టీని ఏర్పాటు చేసి వచ్చే ఎన్నికల్లో బిజెపికి చెక్ పెట్టాలని భావిస్తున్నారు. దేశవ్యాప్తంగా ఇతర రాష్ట్రాలలో ఉన్న తనతో కలిసి వచ్చే పార్టీలను కలుపుకొని ముందుకు సాగడం కంటే ముందు, రాష్ట్ర ప్రజలు సంపూర్ణ మద్దతు తనకే ఉండాలని ప్రయత్నిస్తున్నారు. తెలంగాణ రాష్ట్రంలో తాజా పరిణామాలతో ప్రతిపక్ష పార్టీలు బలం పుంజుకునే ప్రయత్నం చేస్తుండగా, కెసిఆర్ వారి ఎత్తుగడలకు చెక్ పెట్టే పనిలో ఉన్నారు. తెలంగాణ ప్రజలు హామీ ఇస్తేనే, తెలంగాణ ప్రజలు తన వెంట ఉంటేనే తన దేశ రాజకీయాలలో సైతం రాణించగలుగుతారు అని సీఎం కేసీఆర్ తెలంగాణ ప్రజల మద్దతు కూడగట్టే పనిలో పడ్డారు.

నాతో రండి.. నేను మీ వెంట ఉంటా: దేశ రాజకీయాలను మార్చేద్దాం
తాజాగా మహబూబ్ నగర్ జిల్లా సమీకృత కలెక్టరేట్ భవనాన్ని ప్రారంభించిన కేసీఆర్ తెలంగాణ రాష్ట్ర ప్రజలు హామీ ఇస్తేనే దేశ రాజకీయాల్లోకి వెళ్దామని ప్రకటించారు. సమీకృత కలెక్టరేట్ ప్రారంభం తర్వాత ఆయన బహిరంగ సభలో మాట్లాడుతూ ప్రశ్నించినందుకు తమ ప్రభుత్వాన్ని కూల్చేస్తామని మోడీ అన్నారని, మీరు నాతో రండి.. నేను మీతో ఉంటా అని కెసిఆర్ తెలిపారు. అందరం కలిసి దేశ రాజకీయాల్ని మార్చేద్దాం అని కేసీఆర్ పిలుపునిచ్చారు. బి ఆర్ ఎస్ ద్వారా దేశం మొత్తాన్ని తెలంగాణ తరహాలో అభివృద్ధి చేసుకుందామని కేసీఆర్ తనకు ప్రజల సంపూర్ణ మద్దతు కావాలని అడుగుతున్నారు.

తెలంగాణా ప్రజల సంపూర్ణ మద్దతు కోసమే కేసీఆర్ యత్నం
తెలంగాణ ప్రజలు తనకు అండగా ఉంటేనే దేశ రాజకీయాలలో ప్రభావం చూపడానికి అవకాశం ఉంటుందని భావిస్తున్న కేసీఆర్, ఈ క్రమంలోనే వరుసగా ఏ జిల్లాలో పర్యటనకు వెళ్లినా ఇదే తరహాలో ప్రజలకు పిలుపునిచ్చారు. ప్రజలంతా టిఆర్ఎస్ పార్టీ వైపు బలంగా నిలబడాలని ఆయన కోరుతున్నారు. ఇంట గెలిచి రచ్చ గెలవాలన్న భావనతోనే కేసీఆర్ ముందు తెలంగాణ రాష్ట్రంలో ప్రజల మద్దతు కూడగట్టేందుకు ప్రయత్నం చేస్తున్నారని, ఇది వచ్చే ఎన్నికల్లో కెసిఆర్ పార్టీని గెలిపించాలన్న ఆయన భావన ప్రస్ఫుటంగా అర్థమయ్యేలా చేస్తుందని చెబుతున్నారు. తెలంగాణ రాష్ట్రంలో అధికారం మళ్లీ కట్టబెడితేనే దేశ రాజకీయాల్లో కీలక భూమిక పోషించే అవకాశం ఉంటుందని కేసీఆర్ భావిస్తున్నట్టుగా ఆయన ఇటీవలే చేస్తున్న వ్యాఖ్యల ఆధారంగా అర్థమవుతుంది.

బీఆర్ఎస్ జాతీయ రాజకీయాలకు తెలంగాణా ప్రజలను ట్యూన్ చేస్తున్న కేసీఆర్
ప్రజలకు ఒకవైపున తెలంగాణ సెంటిమెంట్ ను గుర్తు చేస్తూనే, మరోవైపు తెలంగాణలో ప్రతిపక్ష పార్టీల తీరును ఎండగడుతున్నారు. బీజేపీ రాష్ట్రానికి ఏమీ చేయదని, తెలంగాణ ప్రభుత్వం ప్రజల కోసం ఏ పని చేస్తున్నా కాళ్లల్లో కట్టెలు పెట్టి అడ్డు పడుతుందని సీఎం కేసీఆర్ మండిపడ్డారు. ఇక కృష్ణా జలాల్లో వాటా తేల్చడానికి బిజెపికి ఎనిమిదేళ్ల సమయం ఇంకా సరిపోలేదని, ఇక అనుమతులు ఎప్పుడు ఇస్తారు అంటూ కేంద్రాన్ని ప్రశ్నించారు. ఏది ఏమైనా ప్రత్యర్థి పార్టీలను టార్గెట్ చేస్తున్న కేసీఆర్, బీఆర్ఎస్ పార్టీని ఏర్పాటు చేసి దేశ రాజకీయాల్లో కీలకంగా వెళ్లేముందు తెలంగాణ ప్రజలు సంపూర్ణ మద్దతు కోసం చేస్తున్న ప్రయత్నాలు ఏ మేరకు ఫలిస్తాయో వేచి చూడాలి.












Click it and Unblock the Notifications