మహారాష్ట్రపై కేసీఆర్ మాస్టర్ ప్లాన్: బీఆర్ఎస్ సింగిల్ గానే.. ఇకపై అన్ని ఎన్నికల్లో పోటీ!!
మహారాష్ట్రపై కేసీఆర్ మాస్టర్ ప్లాన్ వేశారు. రేపు నాందేడ్ లో భారీ చేరికల సభలో పాల్గొననున్నారు. ఇకపై బీఆర్ఎస్ సింగిల్ గానే పోటీ చెయ్యాలని నిర్ణయం తీసుకున్నట్టు మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి స్పష్టం చేశారు.
జాతీయ రాజకీయాలలో చక్రం తిప్పడానికి కేసీఆర్ ప్రారంభించిన బీఆర్ఎస్ పార్టీ తెలంగాణ సరిహద్దు రాష్ట్రాలలో దూకుడుగా ముందుకు వెళ్లాలని ప్రయత్నం చేస్తోంది. రేపు నాందేడ్ లో బిఆర్ఎస్ పార్టీ బహిరంగ సభ నిర్వహించనున్న వేళ, మహారాష్ట్ర రాజకీయాలపై బీఆర్ఎస్ పార్టీ మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి కీలక విషయాలను వెల్లడించారు. మహారాష్ట్రలో జరిగే ప్రతి ఎన్నికలలో బీఆర్ఎస్ పోటీ చేస్తుందని, మహారాష్ట్ర పై ఫుల్ గా ఫోకస్ పెట్టామని మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి తాజాగా వెల్లడించారు.
మహారాష్ట్రలో జరగనున్న అన్ని ఎన్నికలలో బిఆర్ఎస్ పార్టీ పోటీ
ముఖ్యమంత్రి కేసీఆర్ హయాంలో 9 ఏళ్లలో తెలంగాణ రాష్ట్రం అభివృద్ధి సాధించిందని, తెలంగాణ అభివృద్ధి మోడల్ తో దేశంలోని వివిధ రాష్ట్రాలలో బి ఆర్ ఎస్ పార్టీ దూసుకుపోతుందని ఆయన అభిప్రాయం వ్యక్తం చేశారు. ఇకపై మహారాష్ట్రలో జరగనున్న అన్ని ఎన్నికలలో బిఆర్ఎస్ పార్టీ పోటీ చేస్తుందని తెలంగాణ అటవీ మరియు పర్యావరణ శాఖ మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి స్పష్టం చేశారు.
ఫిబ్రవరి 5న నాందేడ్లో భారీ బహిరంగ సభ..
ఫిబ్రవరి 5వ తేదీన నాందేడులో నిర్వహించనున్న భారీ బహిరంగ సభలో మహారాష్ట్ర నుండి నాయకుల చేరికలు ఉంటాయని పేర్కొన్న ఇంద్రకరణ్ రెడ్డి సీఎం కేసీఆర్ నాందేడ్ పర్యటనలో భాగంగా అక్కడ సచ్ఖండ్ గురుద్వారా ను సందర్శిస్తారని, ఆపై చేరికల సభలో మాట్లాడతారని, అనంతరం మీడియాతో మాట్లాడతారని పేర్కొన్నారు. తెలంగాణ రాష్ట్రం మహారాష్ట్రతో 974 కిలోమీటర్ల సరిహద్దును పంచుకుంటుందని, గత తొమ్మిదేళ్లలో తెలంగాణ రాష్ట్రం అభివృద్ధి చెందగా, మహారాష్ట్రలోని సరిహద్దు గ్రామాల పరిస్థితులు మహారాష్ట్ర దారుణ పరిస్థితికి అద్దం పడుతున్నాయని ఆయన పేర్కొన్నారు.
మహారాష్ట్రలో ఎందుకు అభివృద్ధి జరగలేదు? మంత్రి ప్రశ్న
మహారాష్ట్ర అభివృద్ధి శూన్యంగా మారిందని, తెలంగాణ రాష్ట్రంలో జరిగిన అభివృద్ధి మహారాష్ట్రలో ఎందుకు లేదని మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి ప్రశ్నించారు. దేశ ఆర్థిక రాజధాని ముంబై మహారాష్ట్రలో ఉందని పేర్కొన్న ఆయన ముంబై వంటి నగరాలు ఉన్నా మహారాష్ట్రలో రాజకీయం అభివృద్ధి కేంద్రంగా జరగడం లేదని వ్యాఖ్యానించారు. తెలంగాణ రాష్ట్రంలోని తమ గ్రామాలలో 24 గంటల విద్యుత్తు, నీరు లభిస్తున్నాయని, కానీ మహారాష్ట్రలో అటువంటి పరిస్థితులు లేవని మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి అభిప్రాయం వ్యక్తం చేశారు.
మహారాష్ట్రలో ఎవరితో పొత్తుల్లేవ్.. సింగిల్ గానే పోటీ
అబ్ కీ బార్ కిసాన్ సర్కార్ పేరుతో బీఆర్ఎస్ తెలంగాణ అభివృద్ధిని ప్రదర్శిస్తూ అన్ని ఎన్నికల్లో పోరాడుతుంది అన్నారు. మహారాష్ట్రలో తాము ఏ పార్టీతోనూ పొత్తు పెట్టుకోవడం లేదని పేర్కొన్న ఆయన, సింగిల్ గానే పోటీ చేస్తామన్నారు. మహా రాజకీయాలలో బీఆర్ఎస్ పార్టీ తనకంటూ ఒక ప్రత్యేక స్థానాన్ని ఏర్పరచుకుంటుందని ఆశాభావం వ్యక్తం చేశారు. రేపు జరగనున్న నాందేడ్ భారీ బహిరంగ సభ ఏర్పాట్లను స్వయంగా పర్యవేక్షిస్తున్న ఆయన కచ్చితంగా మహారాష్ట్ర ప్రజలు సీఎం కేసీఆర్ బీఆర్ఎస్ పార్టీని ఆదరిస్తారని స్పష్టం చేశారు.