కేసీఆర్ మరో ఉద్ధవ్ థాక్రే కానున్నారా ? బీఆర్ఎస్ రాకతో తెలంగాణ పులి కాస్తా.. జరిగేదిదే !
కొన్ని నెలల క్రితం మహారాష్ట్రలో మహావికాస్ అఘాడీ ప్రభుత్వాన్ని విజయవంతంగా నడుపుతున్న ఉద్ధవ్ థాక్రే అనూహ్యంగా పదవీచ్యుతుడయ్యారు. కరోనాలో సైతం మహారాష్ట్రలో ఎలాంటి ఇబ్బందుల్లేకుండా ప్రభుత్వాన్ని నడిపిన ఈ తొలిసారి సీఎం.. సొంత పార్టీ శివసేనలో తిరుగుబాటుతో హతాశుడయ్యారు. తిరుగుబాటునేత ఏక్ నాథ్ షిండే వద్దకు పలు ప్రతిపాదనలు పంపినా, కాంగ్రెస్-ఎన్సీపీని వదిలి వస్తేనే మద్దతిస్తామని తేల్చిచెప్పేయడంతో వారిని వదులుకోలేక ఏకంగా అధికారాన్ని వదులుకున్నారు. ఇంత జరిగినా ఉద్ధవ్ కు సానుభూతి రాలేదు. ఇప్పుడు తెలంగాణలోనూ అదే జరగబోతోందా అంటే కాకలుతీరిన రాజకీయ విశ్లేషకులు అవునంటున్నారు.
కేసీఆర్ ప్రస్ధానం
ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రత్యేక తెలంగాణ కోసం ఉద్యమించిన నేతగా ఆరంభంలో పెద్దగా సానుభూతి సంపాదించుకోలేకపోయిన కేసీఆర్ .. వైఎస్ మరణం తర్వాత మాత్రం సీరియస్ గా ఉద్యమంపై దృష్టిపెట్టారు. ఏపీకి సంబంధించిన ప్రతీ అంశంపై తెలంగాణ పల్లెల్లో సైతం చర్చ జరిగేలా చేశారు. ఏపీతో కలిసి ఉండటం వల్ల తెలంగాణ కోల్పోతోందేంటో ఈ ప్రాంతంలోని ప్రతీ ఒక్కరికీ విస్పష్టంగా చెప్పగలిగారు.
ఇందుకోసం ఆయన మొదలుపెట్టిన ప్రయత్నాన్ని తెలంగాణ ప్రజానీకం కూడా నిజాయితీగా అర్ధం చేసుకున్నారు. ప్రత్యర్ధి రాజకీయ పార్టీలు సైతం కేసీఆర్ వాదనకు గులాం అయ్యాయి. ఏదో ఓ కారణంగా వారిలో ఎంతో మంది కేసీఆర్ కు జై కొట్టేశారు. తెలంగాణ ఏర్పాటు తర్వాత సైతం ఇతర పార్టీల్లో ఉన్న కాకలు తిరిగిన నేతలు సైతం గులాబీ గూటికి చేరిపోయారు.
కేసీఆర్ బీఆర్ఎస్ ఎంట్రీ
రెండేళ్లుగా తెలంగాణలో మారుతున్న పరిణామాల నేపథ్యంలో నాయకత్వ లేమితో ఇబ్బందులు ఎదుర్కొంటున్న కాంగ్రెస్ స్ధానాన్ని బీజేపీ ఆక్రమించడం మొదలుపెట్టింది. దీంతో కేసీఆర్ కు మొదట్లో దాని తీవ్రత అర్ధం కాలేదు. దుబ్బాక, హుజురాబాద్ ఉపఎన్నికల్లో బీజేపీ వరుస విజయాలు కేసీఆర్ ను కలవర పెట్టడం మొదలుపెట్టాయి. చివరికి బీజేపీని ఇలాగే వదిలేస్తే ప్రమాదమని గ్రహించి ఏకంగా బీజేపీని జాతీయ స్దాయిలోనే టార్గెట్ చేయడం మొదలుపెట్టారు.
అసెంబ్లీలో తెలంగాణ అజెండా కంటే జాతీయ అజెండాపైనే ఎక్కువగా కేసీఆర్ చర్చలు పెట్టడం మొదలుపెట్టారు. దీంతో అప్పటివరకూ కేసీఆర్ ను కరడుగట్టిన తెలంగాణ వాదిగానే చూసిన జనానికి జాతీయ నేతగా చూడాల్సిన పరిస్ధితి వచ్చింది. ఇదే అదనుగా కేసీఆర్ బీజేపీకి వ్యతిరేకంగా తన టీఆర్ఎస్ ను బీఆర్ఎస్ మార్చేశారు.
తెలంగాణ వాది నుంచి జాతీయ వాదిగా
ఇప్పుడు కేసీఆర్ తెలంగాణ వాదిగా కంటే జాతీయ వాదిగానే ఫోకస్ అయ్యేందుకు తెగ ప్రయత్నిస్తున్నారు. అంతే కాదు ఒకప్పుడు తెలంగాణ సెంటిమెంట్ ను ప్రయోగించి ఓట్లు అడిగిన పరిస్ధితి నుంచి జాతీయ వాదిగా తనకు ఓట్లు వేయాలని తెలంగాణ సహా ఇతర రాష్ట్రాల్లో ఓటర్లను అర్ధించేందుకు సిద్దమవుతున్నారు. కేసీఆర్ జాతీయ వాదిగా ఉండటంపై ఎవరికీ ఎలాంటి అభ్యంతరాలు లేకపోయినా ప్రాంతీయ వాదిగా కరడుగట్టిన ముద్ర వేసుకున్న కేసీఆర్ ఇప్పుడు దాన్ని వదిలిపెట్టి అప్పట్లో వ్యక్తం చేసిన అభిప్రాయాలు, చేసిన విమర్శలు, తెచ్చిన పోలికలకు జవాబు చెప్పుకోవాల్సిన దైన్యంలోకి జారిపోతున్నారు.
దీన్నుంచి కేసీఆర్ తప్పించుకోవడం అసాధ్యంగానే కనిపిస్తోంది. ఇంకా చెప్పాలంటే జాతీయ వాది అయ్యే ప్రయత్నంలో తన ప్రాంతీయ అనవాళ్లను కొంతైనా చెరుపుకోవాల్సిన పరిస్దితి కేసీఆర్ కు ఎదురవుతోంది.
మరో ఉద్ధవ్ థాక్రే గా కేసీఆర్?
మహారాష్ట్రలో ఒకప్పుడు శివసేన పార్టీ ఉనికిలో ఉన్నప్పటికీ తమ ఎమ్మెల్యేలను గెలిపించి అసెంబ్లీకి, ఎంపీలను పార్లమెంటుకు పంపడానికే బాల్ థాక్రే పరిమితమయ్యారు. బీజేపీతో కలిసి కరడుగట్టిన హిందూత్వ అజెండాను అమలు చేయడం ద్వారా ప్రత్యర్ధుల్ని నిద్రలేకుండా చేశారు. అలాంటి చరిత్ర కలిగిన వీర హిందూత్వ వాది బాల్ థాక్రే వారసుడు ఉద్ధవ్ థాక్రే మాత్రం బీజేపీతో తెగదెంపులు చేసుకుని కాంగ్రెస్-ఎన్సీపీతో కలిసి మహావికాస్ అఘాడీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడమే కాకుండా సీఎం కూడా అయ్యారు. తద్వారా థాక్రేల కుటుంబం తొలిసారి అధికారం రుచిచూసినట్లయింది.
అంతవరకూ బాగానే ఉన్నా ఈ పరిణామం మహారాష్ట్రలో చాలా మందికి రుచించలేదు. శివసేన ఓటర్లకే కాదు నేతలకు, ప్రజాప్రతినిధులకు సైతం ఇబ్బందికరంగా మారిపోయింది. పులి కాస్తా పిల్లిగా మారిపోవడం వారికి సుతరామూ ఇష్టం లేదు. దీంతో వారంతా కలిసి ఉద్ధవ్ ను బీజేపీతో కలిసి తిరుగుబాటు చేసి గద్దె దింపేశారు. ఇప్పుడు కరడుగట్టిన తెలంగాణ వాది కేసీఆర్ కూడా తన సహజ సిద్ధమైన రూపాన్ని వదిలి జాతీయ వాదిగా మారడాన్ని తెలంగాణ ప్రజలు, టీఆర్ఎస్ నేతలు జీర్ణించుకోలేకపోతే మాత్రం ఉద్ధవ్ థాక్రే పరిస్ధితులు ఎదురవడం ఖాయం. బీఆర్ఎస్ ఎంట్రీతో ఏపీ వంటి రాష్ట్రాల్లో సమైక్య పార్టీలతో పొత్తులు పెట్టుకుంటే, తెలంగాణ ఎన్నికల్లో వారిని లైట్ తీసుకుంటే ఈ పరిస్ధితి తప్పేలా లేదు.