మమత భేటీకి కేసీఆర్ హాజరయ్యేనా : అటు కాంగ్రెస్- ఇటు బీజేపీ : నేడు తుది నిర్ణయం...!!
జాతీయ స్థాయిలో ఇప్పుడు అందరూ కేసీఆర్ అడుగులు వైపు ఆసక్తిగా చూస్తున్నారు. జాతీయ పార్టీ ప్రకటనకు సిద్దమైన కేసీఆర్ అందుకు ఈ నెల 19న ముహూర్తంగా ఖరారు చేసారు. ఇప్పటికే రాష్ట్రపతి ఎన్నిక .. ఇదే అంశం పైన బెంగాల్ సీఎం మమతా బెనర్జీ సమావేశం ఏర్పాటు చేసారు. ఈ సమావేశానికి హాజరు కావాలంటూ కేసీఆర్ కు స్వయంగా మమత ఫోన్ చేసిన ఆహ్వానించారు. గతంలో మమతతో బీజేపీ వ్యతిరేక పోరాటం పైన కలిసి చర్చించారు. మమత దాదాపు 22 మంది జాతీయ నాయకులకు లేఖలు రాసారు. ఈ సమావేశానికి రావాల్సిందిగా కాంగ్రెస్ ను ఆహ్వానించారు.
కాంగ్రెస్ సైతం వస్తుండటంతో
సోనియా ఆస్పత్రిలో ఉండటంతో ఆ పార్టీ నుంచి సీనియర్ నేతలు హాజరయ్యే అవకాశం ఉంది. ఇదే ఇప్పుడు కేసీఆర్ కు సమస్యగా మారుతోంది. అటు బీజేపీకి వ్యతిరేకంగా నిర్వహిస్తున్న సమావేశం కావటం..సమావేశానికి తాను ఈ మధ్య కాలంలో కలిసి.. మద్దతు కూడగట్టిన పార్టీల నేతలు ఉండటంతో హాజరు కావాలని భావించారు.
అయితే, కాంగ్రెస్ నేతలు సైతం వస్తుండటం...వారితో కలిసి చర్చల్లో పాల్గొనటం కేసీఆర్ కు ఇష్టం లేదని తెలుస్తోంది. తెలంగాణ రాజకీయాల్లో భాగంగా అటు బీజేపీ..ఇటు కాంగ్రెస్ పైన టీఆర్ఎస్ పోరాటం చేస్తోంది. జాతీయ స్థాయిలోనూ ఈ రెండు పార్టీలకతీతంగా ఇతర పార్టీలతో కలిసి ముందుకు కదులుతున్నారు.
బీజేపీ వ్యతిరేక పార్టీలు కలిసి
అయితే, బీజేపీకి వ్యతిరేకంగా..ఎన్డీఏ అభ్యర్దిని ఓడించటమే లక్ష్యంగా జరుగుతున్న సమావేశం కావటంతో..హాజరు కాకపోయినా..ప్రతికూల ప్రభావం పడుతుందనే వాదన వినిపిస్తోంది. దీంతో..ఇదే అంశం పైన తనను కలిసిన రాజకీయ వ్యూహకర్త పీకే...మాజీ ఎంపీ ఉండవల్లితోనూ కేసీఆర్ చర్చించినట్లుగా తెలుస్తోంది. దీంతో..దీని పైన అన్ని కోణాల్లోనూ ఆలోచన చేసి నిర్ణయం తీసుకొనే అవకాశం కనిపిస్తోంది.
15వ తేదీ మధ్నాహ్నం ఢిల్లీ లోని కానిస్టిట్యూషనల్ క్లబ్ లో ఈ సమావేశం జరగనుంది. కాంగ్రెస్ నేతలు హాజరైనా.. వారికి మద్దతు ఇచ్చే ఆలోచన.. అవకావం లేకపోవటంతో హాజరు అవ్వటం ద్వారా బీజేపీ పైన పోరాటం చేస్తున్న పార్టీలతో కలిసి కట్టుగా ఉన్న సంకేతాలు వెళ్తాయనే అభిప్రాయాలు వ్యక్తం అవుతున్నాయి. ఇదే సమావేశానికి శివసేన అధినేత హాజరు కావటం లేదు.
మంతనాలు - నిర్ణయం దిశగా
ఆ పార్టీ నుంచి సంజయ్ రౌత్ హాజరవుతున్నారు. ఆప్ అధ్యక్షుడు సైతం రావటం లేదని సమాచారం. ఇదే సమయంలో ఈ నెల 19న పార్టీ కార్యవర్గ సమావేశం జరగనుంది. అందులో జాతీయ పార్టీ లక్ష్యం..తన ప్రణాళికలను పార్టీ నేతలకు వివిరించి.. జెండా - అజెండాతో పాటుగా పార్టీ పేరును అధికారికంగా కేసీఆర్ ఫిక్స్ చేయనున్నారు.
అదే సమయంలో.. టీఆర్ఎస్ ను జాతీయ పార్టీగా రూపాంతరం చేసే విధంగా తీర్మానం చేయనున్నారు. దీంతో..ఢిల్లీ పర్యటనకు వెళ్తారా లేదా అనే దాని పైన నిర్ణయం తీసుకోవాల్సి ఉంది. సమావేశానికి ఏ పార్టీలు హాజరవుతున్నారనే పూర్తి సమాచారం సేకరించిన తరువాత.. కేసీఆర్ ఈ రాత్రికి లేదా రేపు తన ఢిల్లీ పర్యటన పైన నిర్ణయం తీసుకొనే అవకాశం ఉంది.