బాబు మంచి పని చేశాడు, కానీ ఓ సలహా: జగన్కు కెసిఆర్ షాక్
హైదరాబాద్: తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర రావు ప్రాజెక్టుల రీడిజైనింగ్ పైన తెలంగాణ శాసన సభలో గురువారం నాడు పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇచ్చారు. ఈ సందర్భంగా ఏపీ సీఎం నారా చంద్రబాబు నాయుడుకు ఓ సూచన చేశారు.
కెసిఆర్ మాట్లాడుతూ... తాను నిర్వహించిన యాగానికి చంద్రబాబును ఆహ్వానించేందుకు విజయవాడ వెళ్లానని చెప్పారు. అప్పుడు ఆయన నాకు భోజనం పెట్టారని, ఆయన కూడా తనకు మిత్రుడే అన్నారు. ఏపీలోని ప్రజలు కూడా తెలుగు వాళ్లే అన్నారు.
తెలంగాణలోని ప్రజలు, రైతులు ఎలా బాగా బతకాలో, ఏపీలోని వారు కూడా అలాగే బతకాలనుకుంటున్నానని చెప్పారు. తెలంగాణ అంటే ఒకరి నోరు కొట్టే వాళ్లు కాదన్నారు. నేను ఈ పెన్ డ్రైవ్ను చంద్రబాబుకు పంపిస్తానని చెప్పారు. తెలంగాణ వాడి నైజం.. బతుకు బతకనివ్వు అన్నారు.
ఒకరిని కొట్టే బతుకు మాకు అవసరం లేదన్నారు. మహారాష్ట్రతో ఎంత సామరస్యంగా ఉంటున్నామో, ఏపీతోను అదే సామరస్యం కోరుకుంటున్నామని చెప్పారు. మనం ఆలంపూర్ నుంచి భద్రాచలం వరకు ఏపీ, తెలంగాణ మధ్య సరిహద్దు ఉందన్నారు. ఇది జరిపితే జరిపోయేది కాదన్నారు.
కాబట్టి, రెండు రాష్ట్రాల ప్రజలు, రైతులు బాగా బతకాలన్నారు. తుమ్మిడిహెట్టి కడితే రీజనరేట్ అయ్యే నీళ్లు ప్రకాశం బ్యారేజీ రైతులకు వెళ్తాయన్నారు. కాళేశ్వరం వద్ద 2600 టీఎంసీలలో మనం మహా అయితే వెయ్యి టీఎంసీలు వాడుతామని, కాబట్టి 1600 టీఎంసీలు ఏపీకి ఉంటాయని చెప్పారు.
దుమ్ముగూడెం దాటితే మనం నీళ్లు తీసుకోలేమని, కాబట్టి ఆ నీటిని మన తెలుగు ప్రజలే (ఏపీలోని వారు) వాడుతారని చెప్పారు. ఈ నీటితో వారు ఎన్నో చిన్న చిన్న ప్రాజెక్టులు కట్టుకోవచ్చునని చెప్పారు. పట్టిసీమ ప్రాజెక్టు చాలా మంచి పని అన్నారు. ఆ రాష్ట్రానికి అది అవసరమన్నారు.
రాజకీయంగా వారి వారి మధ్య ఏముందో కానీ పట్టిసీమ చాలా మంచిదన్నారు. (పట్టిసీమపై జగన్ మండిపడుతున్న విషయం తెలిసిందే) గోదావరి, కృష్ణా నీటి పైన గొడవ పడకుండా మనం మనం కలిసి ముందుకు సాగుదామన్నారు. మనకు చీటికిమాటికి చిల్లర పంచాయతీ వద్దని తాను ఏపీ సీఎం చంద్రబాబుకు అప్పీల్ చేస్తున్నానని చెప్పారు.
మనం ఊరికే కిరికిరి పెట్టుకోవద్దని, రైతులు, ప్రజలు బతకడమే ప్రభుత్వాల ఉద్దేశ్యమన్నారు. ప్రాజెక్టుల రీ డిజైనింగ్కు సంబంధించిన పెన్ డ్రైవ్ను తాను ఏపీ సీఎం చంద్రబాబు పంపిస్తానని చెప్పారు. కాగా, ఇందుకు సంబంధించిన పెన్ డ్రైవ్లను సభ్యులందరికీ ఇచ్చారు. పవర్ పాయింట్ ప్రజెండేషన్ సమయంలో లేనందుకు కెసిఆర్ కాంగ్రెస్ పార్టీ పైన మండిపడ్డారు.