బదులిస్తాం: బైసన్ గ్రౌండ్స్పై కేసీఆర్ కన్ను, హామీ
హైదరాబాద్: సచివాలయం నిర్మాణానికి రక్షణ శాఖ భూమిని ఇవ్వాలని తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర రావు గరువారం నాడు రక్షణ శాఖ మంత్రి మనోహర్ పారికర్ను కలిసి విజ్ఞప్తి చేశారు. అలాగే, పోలీసు వ్యవస్థ ఆధునికీకరణకు నిధులు ఇవ్వాలని కేంద్ర హోంమంత్రి రాజ్నాథ్ సింగ్కు కలిశారు.
సచివాలయ నిర్మాణం కోసం సికింద్రాబాద్లో రక్షణ శాఖకు చెందిన 60 ఎకరాల భూమి (బైసన్ పోలో గ్రౌండ్, జింఖానా మైదానాలను) ఇవ్వాలని రక్షణ శాఖ మంత్రి మనోహర్ పారికర్ను కేసీఆర్ కోరారు. ఆ భూమికి ప్రతిగా 60 ఎకరాల భూమిని రాష్ట్ర భూమి బ్యాంకు నుంచి ఇస్తామన్నారు. ఈ అంశంపై రాష్ట్రాధికారులతో చర్చించేందుకు రక్షణ శాఖ అధికారుల్ని పంపించాలని కేసీఆర్ కోరగా పారికర్ సానుకూలంగా స్పందించారు.
మూడు రోజుల పర్యటన నిమిత్తం బుధవారం రాత్రి ఢిల్లీకి చేరుకున్న కేసీఆర్ గురువారం మధ్యాహ్నం కేంద్ర మంత్రులు మనోహర్ పర్రీకర్, రాజ్నాథ్ సింగ్లను కలిశారు. ఎంపీలు చెప్పిన సమాచారం మేరకు.. సికింద్రాబాద్లోని రక్షణ శాఖ ఆధ్వర్యంలో ఉన్న 60 ఎకరాల బైసన్ గ్రౌండ్ను ఇస్తే, ప్రతిగా 60 ఎకరాల భూమిని గోల్కొండ సమీపంలో కానీ, కంటోన్మెంట్ సమీపంలో కానీ ఇస్తామని ప్రతిపాదించారు.

అలాగే, తెలంగాణ రాష్ట్రానికి ఒక సైనిక్ పాఠశాలను ఇవ్వాలని కోరగా, రెండు సైనిక్ పాఠశాలల్ని ఇస్తామని, త్వరలోనే ఈ మేరకు మంజూరు ఉత్తర్వులు జారీ చేస్తామని పారికర్ హామీ ఇచ్చారు. ప్రజల ఇబ్బందుల్ని దృష్టిలో ఉంచుకుని కంటోన్మెంట్ రోడ్లను వెడల్పు చేయాలని, పలు రహదాహులను వెడల్పు చేయాలని కోరగా, పారికర్ అంగీకరించారు.
అలాగే వాటర్ గ్రిడ్ ద్వారా ప్రతి ఇంటికీ నల్లా ద్వారా తాగునీటిని అందిస్తున్నామని, కంటోన్మెంట్లో కూడా ఈ మేరకు పథకాన్ని అమలు చేసేందుకు సహకరించాలని, గోదావరి నుంచి హైదరాబాద్కు వచ్చే తాగునీటి పైపులైన్కు కంటోన్మెంట్ వద్ద తగిన అనుమతులు ఇవ్వాలని కోరారు. ఆదిభట్లలో టాటా సంస్థ హెలికాప్టర్ల తయారు చేస్తోందని, దీంతో పాటు రక్షణ శాఖ ఉత్పత్తుల తయారీ కోసం మేకిన్ ఇండియాలో భాగంగా ఏ సంస్థలు పెట్టాలనుకున్నా భూములు ఇచ్చేందుకు సిద్ధంగా ఉన్నామని పారికర్కు హామీ ఇచ్చారు.

రాజ్నాథ్ సింగ్తో మెగాసిటీ పోలీసింగ్కు నిధులు, పోలీసు సిబ్బంది ఆధునీకరణ పథకం కింద నిధుల మంజూరీపై కేసీఆర్ చర్చించారు. విభజన చట్టంలో ఇచ్చిన హామీలను సత్వరం అమలు చేసేలా చర్యలు తీసుకోవాలని కోరారు. జూన్ 2తో తెలంగాణ ఏర్పాటై సంవత్సరం గడుస్తున్న నేపథ్యంలో ఈ లోపుగా జరగాల్సిన ఆస్తుల పంపకాలు, ఉద్యోగుల పంపకాల గురించి కూడా ప్రస్తావించారు.
అదేవిధంగా వికారాబాద్లో ప్రిజనర్స్ అకాడమీ, తెలంగాణలో ఉగ్రవాదుల ఉనికి నేపథ్యంలో పోలీసులకు మెరుగైన సదుపాయాలు కల్పించాలని విజ్ఞప్తి చేశారు. ముఖ్యమంత్రితో పాటు డీజీపీ అనురాగ్ శర్మ, సీఎస్ రాజీవ్ శర్మ, పార్టీ ఎంపీలు కేంద్ర మంత్రుల్ని కలిసిన బృందంలో ఉన్నారు.












Click it and Unblock the Notifications