రెవెన్యూ శాఖకు షాక్ .. తెలంగాణా సీఎం కేసీఆర్ వీఆర్వో వ్యవస్థను రద్దు చేసే నిర్ణయం ?
Recommended Video
రెవెన్యూ శాఖలో కీలక మార్పులు జరగబోతున్నాయి. సీఎం కేసీఆర్ రెవెన్యూ శాఖను పూర్తిగా ప్రక్షాళన చెయ్యాలన్న నిర్ణయం మేరకు అడుగులు పడుతున్నాయి. రెవెన్యూ శాఖలో కీలక మార్పులకు సీఎం గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు . గ్రామ రెవెన్యూ అధికారుల వ్యవస్థ రద్దు చేసి వీరిని పంచాయతీరాజ్ లేదా వ్యవసాయశాఖలో విలీనం చేయాలని ప్రభుత్వం యోచిస్తోందనే సంకేతాలు కనబడుతున్నాయి. త్వరలోనే దీనికి సంబంధించి అధికారిక ప్రకటన వెలువడొచ్చని సమాచారం . రెవెన్యూ శాఖలో పనిచేస్తోన్న కిందిస్థాయి ఉద్యో గుల్లో పేరుకుపోయిన అవినీతి రెవెన్యూ వ్యవస్థకే ప్రమాదమని సీఎం కేసీఆర్ బహిరంగంగానే వ్యాఖ్యానించారు. ఇక ఈ నేపథ్యంలోనే వీఆర్వో వ్యవస్థను రద్దు చేసే అంశాన్ని కేసీఆర్ తీవ్రంగా పరిశీలిస్తున్నట్లు వస్తున్న వార్తలు రెవెన్యూ ఉద్యోగులకు షాక్ అనే చెప్పాలి.
రెవెన్యూలో అవినీతిని అరికట్టటానికి వీఆర్వో వ్యవస్థను రద్దు చెయ్యాలని నిర్ణయించిన కేసీఆర్
అవినీతిని అరికట్టడానికి తెలంగాణ సిఎం కె చంద్రశేఖర్ రావు గ్రామ స్థాయి నుండే రెవెన్యూ శాఖను పునరుద్ధరించాలని చూస్తున్నారు . వీఆర్ఓ (విలేజ్ రెవెన్యూ ఆఫీసర్) వ్యవస్థను రద్దు చేసి, ఉద్యోగులను పంచాయతీ రాజ్ లేదా వ్యవసాయ శాఖలో విలీనం చేసే ఆలోచనలో ఉన్నారు . ఈ విషయంలో త్వరలో అధికారిక ప్రకటన రావచ్చు.అసెంబ్లీ సమావేశాల్లో ముఖ్యమంత్రి కెసిఆర్ ముఖ్య కార్యదర్శి మరియు ల్యాండ్ అడ్మినిస్ట్రేషన్ చీఫ్ కమిషనర్ కంటే విఆర్ఓలకు ఎక్కువ అధికారాలు ఉన్నాయని వ్యాఖ్యానించారు. రెవెన్యూ శాఖను పునరుద్ధరించకపోతే వ్యవస్థ ముప్పు పొంచి ఉంటుందనే భావన ఆయనకు ఉన్న నేపధ్యంలోనే ఆయన ఈ తరహా వ్యాఖ్యలు చేశారు . ఇక 2019 లోక్సభ ఎన్నికల సమయంలో కూడా ఓ రైతుతో మాట్లాడిన కేసీఆర్ స్థానిక సంస్థల ఎన్నికల తర్వాత రెవెన్యూ శాఖ పని పడదామని పేర్కొన్నారు.
టెన్షన్ పుట్టిస్తున్న కొత్త భూ చట్టం .. వీఆర్వో లలో ఆందోళన
రెవెన్యూ శాఖలో విప్లవాత్మక మార్పులను తీసుకువచ్చే సూచనలను చేశారు కెసిఆర్. ఇక దీంతో ఇప్పటికే, ప్రవేశపెట్టబోయే కొత్త భూ చట్టంపై కసరత్తు జరుగుతోంది. భూ వివాదాలను నివారించడానికి టైటిల్ గ్యారెంటీ చట్టం తీసుకువచ్చే అవకాశం ఉంది. వీఆర్వో వ్యవస్థ యొక్క రద్దు కూడా చెయ్యాలని నిర్ణయం తీసుకున్నారు. వీఆర్ఓలు గ్రామాల్లో ప్రభుత్వ ప్రతినిధులుగా వ్యవహరిస్తారు. భూమి ఖర్చులు పెరగడం వల్ల, రిజిస్ట్రేషన్లపై వివాదాలు, పేర్లు , సరిహద్దుల్లో లోపాలు కూడా పెరిగాయి. చట్టాలపై వీఆర్ఓలలో అవగాహన లేకపోవడం కూడా ఎక్కువ పొరపాట్లు జరుగుతున్నాయి . అయితే అందరూ తప్పు చెయ్యకున్నా కొందరి వల్ల అందరికీ శిక్ష పడనుంది.
వీఆర్ఓల భవితవ్యంపై వీఆర్వో వ్యవస్థ రద్దు ప్రతిపాదనలతో నీలినీడలు
రాష్ట్రవ్యాప్తంగా పనిచేస్తోన్న 4,700 మంది వీఆర్ఓల భవితవ్యంపై వీఆర్వో వ్యవస్థ రద్దు ప్రతిపాదనలతో నీలినీడలు కమ్ముకున్నాయి. రెవెన్యూశాఖ గురించి ప్రస్తావించిన సందర్భాలలో వీఆర్ఓలను కేసీఆర్ వేలెత్తి చూపుతుండడంతో తమ పోస్టులకు ముప్పు వాటిలినట్లుగానే భావిస్తున్నారు . ఇదిలావుండగా, గతంలో భూ రికార్డుల ప్రక్షాళనకు ముందుకు సీనియర్ ఐఏఎస్ అధికారి రఘునందన్రావు, సిద్దిపేట, రంగారెడ్డి జిల్లా కలెక్టర్లు వెంకట్రాంరెడ్డి, లోకేశ్ కుమార్లతో కూడిన కమిటీ.. గ్రామస్థాయిలో కీలకంగా వ్యవహరించే వీఆర్ఓల వ్యవస్థను రద్దు చేయకూడదని సిఫార్సు చేసింది. అయితే, సీఎం మాత్రం రోజుకో హెచ్చరికతో టెన్షన్ పుట్టిస్తున్నారు. కొత్త రెవెన్యూ చట్టం ఎలా ఉంటుంది? వీఆర్ఓలు ఉంటారా? లేకా ఇతర శాఖల్లో విలీనం అవుతారా? అనే ఉత్కంఠ ఉద్యోగవర్గాల్లో నెలకొంది.
రెవెన్యూ శాఖ ప్రక్షాళన , వీఆర్వో వ్యవస్థరద్దు కన్ఫార్మ్ ?
ముఖ్యమంత్రి కేసీఆర్ సూచనలకు అనుగుణంగా రెవెన్యూ చటానికి సంబంధించి ఏర్పాటు చేసిన కమిటీ రెవెన్యూశాఖకు సంబంధించి కీలక సిఫార్సులు చేసినట్లు తెలుస్తోంది. రెవెన్యూశాఖకు సంబంధించిన పలు విధులను పంచాయతీరాజ్, వ్యవసాయశాఖలకు బదిలీ చేయాలని నిర్దేశించారు. రెవెన్యూశాఖ పేరు మార్పిడితో పాటు ఆ శాఖకు గల పలు అధికారాలను ఇతర శాఖలకు బదలాయించాలనే ప్రతిపాదన కూడా ప్రభుత్వానికి వచ్చింది. ధ్రువీకరణపత్రాల జారీ వంటివి పంచాయతీరాజ్ శాఖకు అప్పగించాలని, భూరికార్డుల నిర్వహణ వంటివి వ్యవసాయ శాఖకు ఇవ్వాలనే సూచనలు చేసినట్లు తెలిసింది. ఇక వీఆర్వోల వ్యవస్థ రద్దు చెయ్యాలనే సీఎం ఆలోచన , వారిపై చేస్తున్న వ్యాఖ్యలు ఇప్పుడు వీఆర్వో వ్యవస్థ రద్దు కన్ఫార్మ్ అనే సంకేతాలిస్తున్నాయి.