తెలంగాణా శాసనసభా పర్వం.. వ్యూహ ప్రతివ్యూహాలతో కాంగ్రెస్, బీఆర్ఎస్; కేసీఆర్ స్ట్రాటజీ ఇదే!
తెలంగాణ అసెంబ్లీ వర్షాకాల సమావేశాలకు అధికార ప్రతిపక్ష పార్టీలు రెడీ అవుతున్నాయి. తెలంగాణా శాసన సభ సమావేశాలు రేపు ప్రారంభమవుతాయి. ఈ సమావేశాల్లో ప్రభుత్వం సభలో పలు కీలక బిల్లులను ప్రవేశ పెట్టనుంది. 21 ఏళ్లకే చట్ట సభలకు పోటీ చేసే అవకాశం కల్పించాలన్న ప్రతిపాదనతో పాటు.. క్యూర్, ల్యాండ్ పూలింగ్, 22ఏ భూములు, భూసేకరణ అంశాలు చర్చకు వచ్చే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.
శాసనసభ, మండలి వర్షాకాల సమావేశాలు సజావుగా సాగేలా ప్లాన్
మరోవైపు శాసనసభ, మండలి వర్షాకాల సమావేశాలు సజావుగా సాగేందుకు అధికారులు సహకరించాలని, సమన్వయంతో పనిచేయాలని శాసనమండలి ఛైర్మన్ గుత్తా సుఖేందర్రెడ్డి, శాసనసభాపతి గడ్డం ప్రసాద్కుమార్లు సూచించారు. ధర్నాలు, రాస్తారోకోలు జరగకుండా ప్రశాంతంగా సమావేశాలు జరిగేలా చూడాలని, సమావేశాలు జరిగే సమయంలో అన్ని శాఖల అధికారులు అందుబాటులో ఉండి మంత్రులకు, సభ్యులకు సహకరించాలని సూచించారు. ఈ మేరకు ప్రభుత్వం తరఫున సహకారముంటుందని మంత్రి శ్రీధర్బాబు తెలిపారు.

వ్యూహ ప్రతివ్యూహాలతో అధికార ప్రతిపక్ష పార్టీలు
శాసన సభ సమావేశాలు సజావుగా జరిగేలా, ప్రతిపక్షాలను నిలువరించేందుకు ముఖ్యమంత్రి, మంత్రులు, అధికార పక్ష సభ్యులు కూడా అన్ని విధాలా సన్నద్ధమవుతున్నారు. సభలో ప్రభుత్వాన్ని పలు అంశాలపై నిలదీసేందుకు బీఆర్ఎస్, బీజేపీ పార్టీలు కూడా వ్యూహాలతో సిద్ధమవుతున్నాయి. ఈ క్రమంలో సిద్దిపేట జిల్లా ఎర్రవల్లిలో బీఆర్ఎస్ శాసనసభా పక్ష సమావేశం జరిగింది. పార్టీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ అధ్యక్షతన ఈ కీలక భేటీ నిర్వహించబడింది.
ఎమ్మెల్యేలకు, ఎమ్మెల్సీలకు కేసీఆర్ కీలక ఆదేశం
సమావేశానికి బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్, మాజీ మంత్రి హరీశ్ రావుతో పాటు పార్టీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు హాజరయ్యారు.రేపటి నుండి ప్రారంభం అవుతున్న అసెంబ్లీ సమావేశాల్లో అనుసరించాల్సిన వ్యూహాలపై కేసీఆర్ నేతలతో విస్తృతంగా చర్చించారు. ప్రభుత్వ విధానాలపై, ప్రజా సమస్యలపై ఎలా స్పందించాలనే అంశాలపై ఎమ్మెల్యేలకు స్పష్టమైన దిశానిర్దేశం చేశారు.
ప్రజల సమస్యలను ప్రభావవంతంగా లేవనెత్తాలని కేసీఆర్ ఆదేశం
పార్టీ కార్యాచరణను మరింత బలోపేతం చేసుకునేందుకు తీసుకోవాల్సిన చర్యలపై కూడా ఆయన సలహాలు అందించారు. ఈ సమావేశం ద్వారా బీఆర్ఎస్ శాసనసభా పక్షం ఐక్యంగా ముందుకు సాగాలని, ప్రజల సమస్యలను ప్రభావవంతంగా లేవనెత్తాలని కేసీఆర్ సూచించినట్లు తెలిసింది. సమావేశం అనంతరం పార్టీ నాయకులు తమ తమ నియోజకవర్గాల్లో కార్యాచరణను ముమ్మరం చేయనున్నారు.












Click it and Unblock the Notifications