కెసిఆర్ భోజనం, ఎవరీ బోర్ల రామిరెడ్డి? (ఫొటో)
హైదరాబాద్: ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర రావు ఓ సామాన్య రైతు బోర్ల రామిరెడ్డితో కలిసి భోజనం చేశారు. ఆయనతో కలిసి ముఖ్యమంత్రి కెసిఆర్ భోజనం చేయడమే కాకుండా, అతన్ని తన వెంట కారులో కూర్చొపెట్టుకొని సచివాలయానికి వచ్చారు. ఒక సాధారణ వ్యక్తికి బుధవారం ముఖ్యమంత్రి నుంచి ఆసాధారణ గౌరవ మర్యాదలు దక్కాయి. తెలంగాణ ఉద్యమ సమయంలో బోర్ల రాంరెడ్డి గురించి కెసిఆర్ అనేక సభలలో ప్రస్తావించేవారు.
తెలంగాణలో సాగునీటి సదుపాయం లేకపోవడంతో బోర్లపైన ఆధారపడిన రైతులు ఎన్ని బాధలు పడుతున్నారో రాంరెడ్డి ఉదంతాన్ని వివరిస్తూ రామిరెడ్డి గురించి చెబుతూ వచ్చారు. భూగర్భ జలాల కోసం ఏకంగా 60 బోర్లు వేయాల్సి రావడంతో ఆయనకు బోర్ల రాంరెడ్డి అనే పేరు వచ్చింది. సదరు రాంరెడ్డి బుధవారం హైదరాబాద్కు వచ్చి ముఖ్యమంత్రిని కలడానికి ముఖ్యమంత్రి కార్యాలయ అధికారులను అపాయింట్ కోరారు. రాంరెడ్డి తన గురించి అధికారులకు వివరిస్తూ ‘బోర్ల రాంరెడ్డి' అని చెప్పండి ముఖ్యమంత్రి తనకు తప్పకుండా అపాయింట్మెంట్ ఇస్తారని చెప్పారు.

ఆ విషయాన్ని అధికారులు ముఖ్యమంత్రి దృష్టికి తీసుకవచ్చారు. వెంటనే స్పందించి రాంరెడ్డిని తన క్యాంపు కార్యాలయానికి రావాల్సిందిగా ముఖ్యమంత్రి సాదరంగా ఆహ్వానించారు. రాంరెడ్డి తన గ్రామస్తులతో కలిసి క్యాంపు కార్యాలయానికి రాగానే, ముఖ్యమంత్రి అతని యోగక్షేమాలపై వాకబు చేసి, ఆయనతో కలిసి భోజనం చేశారు. ఆ తర్వాత రాంరెడ్డిని తన కారులో కూర్చొబెట్టుకొని నేరుగా ముఖ్యమంత్రి సచివాలయానికి వచ్చారు. తన చాంబర్లోకి తీసుకెళ్లి ఉన్నతాధికారులకు పరిచయం చేసారు. నల్లగొండ జిల్లా మోశంపల్లికి చెందిన బైరెడ్డి రాంరెడ్డి, సాగునీటి వసతి లేకపోవడంతో తన పొలంలో 67 సార్లు బోర్లు వేసినప్పటికీ అడుగంటిన భూగర్భ జలాల వల్ల చితికిపోయిన ఆయన గురించి అధికారులకు ముఖ్యమంత్రి వివరించారు.
తెలంగాణ రాష్ట్రం ఎందుకు కావాలో ఢిల్లీలో జాతీయ పార్టీల నేతలకు వివరించడానికి రాంరెడ్డి ఉదంతంపై ‘స్టిల్ సీకింగ్ జస్టిస్' పేరుతో ఒక డాక్యుమెంటరీ తయారు చేయించి ప్రదర్శించిన విషయాన్ని కూడా ఈ సందర్భంగా ముఖ్యమంత్రి గుర్తు చేశారు. ‘మీరు కోరుకున్నట్టుగానే తెలంగాణ రాష్ట్రం వచ్చింది, ఏం కావాలో చెప్పండి' అని రాంరెడ్డిని ముఖ్యమంత్రి అడిగారు. తమ గ్రామానికి రోడ్డు కావాలని, చెరువుల పునరుద్ధరణలో తమ ఊరి చెరువును చేర్చాలని, నల్లగొండలో ప్రస్తుతం ఉన్న వ్యవసాయ మార్కెట్ యార్డు రైతుల అవసరాలు తీర్చడం లేదని వివరించారు.

ముఖ్యమంత్రి వెంటనే స్పందించి రోడ్లు భవనాలశాఖ మంత్రి తుమ్మల నాగేశ్వర్రావును తన చాంబర్కు పిలిపించి రాంరెడ్డి గ్రామానికి రోడ్లు వేయమని ఆదేశించారు. ఆ తర్వాత చెరువుల, మార్కెట్ యార్డులకు సంబంధించిన శాఖలు మంత్రి హరీశ్రావు పరిధిలో ఉండటంతో ముఖ్యమంత్రి ఆయనకు ఫోన్ చేసి రాంరెడ్డి చెప్పే సమస్యలను నోట్ చేసుకొని సత్వరమే పరిష్కరించాలని ఆదేశించారు.
ఒక అధికారిని రాంరెడ్డి వెంట ఇచ్చి ‘డి' బ్లాక్లో హరీశ్రావు చాంబర్కు పంపించారు. ఏకంగా ముఖ్యమంత్రి పంపించిన అతిథి కావడంతో ఆయన్ను మంత్రి హరీశ్రావు కూడా సాదారంగా ఆహ్వానించి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. తెలంగాణ ఉద్యమ సమయంలో పరిచయమైన తనను ముఖ్యమంత్రి గుర్తించుకొని, ఆసాధారణ రీతిలో ఆదరించిన ముఖ్యమంత్రికి రాంరెడ్డి ఈ సందర్భంగా కృతజ్ఞతలు తెలియజేశారు.












Click it and Unblock the Notifications