వికలాంగుల ఆర్థిక ఎదుగుదలను కేసీఆర్ అణగదొక్కాడు.!మండిపడ్డ కాంగ్రెస్ వికలాంగ విభాగం.!
హైదరాబాద్ : గత ఏడున్నర సంవత్సరాల తెలంగాణ రాష్ట్ర పాలనలో, వికలాంగుల సంక్షేమ శాఖను స్త్రీ శిశు సంక్షేమ శాఖలో విలీనం చేసి వికలాంగుల హక్కుల చట్టం 2016 లోని 102సెక్షన్ ల క్రింద జరగవలసిన సంక్షేమాన్ని, సామాజిక న్యాయాన్ని, ఆర్థిక ఎదుగుదలను అణగదొక్కి, వికలాంగుల జీవితాలను సర్వనాశనం చేశాడని ముఖ్యమంత్రి చంద్రశేఖర్ రావు పై కాంగ్రెస్ పార్టీ వికలాంగ విభాగం విరుచుకు పడింది. చంద్రశేఖర్ రావు భారత పార్లమెంట్ రూపొందించిన చట్టాలను అమలు చేయకుండా వికలాంగులకు అన్యాయం చేస్తున్నారని మండిపడ్డారు. వికాలాంగుల కోసం రూపొందించిన చట్టాలను అమలు చేయడం లేదంటే రాజ్యాంగాన్ని ఉల్లంఘించినట్టేనని వికలాంగ విభాగం నేత దేశగాని సతీశ్ గౌడ్ మండిపడుతున్నారు. ముఖ్యంగా తెలంగాణ దళిత వికలాంగులను ఈ మధ్య కాలంలో తెలంగాణ ముఖ్యమంత్రి మోసం చేసినట్టు మరే ఇతర ముఖ్యమంత్రి మోసం చేయలేదని మండి పడ్డారు.
తెలంగాణ రాష్ట్రంలో దళితులకు 10లక్షల రూపాయలు అందించే దళిత బంధు పథకాన్ని ప్రవేశపెట్టారు, కానీ దళిత వికలాంగులకు వికలాంగుల చట్టం 2016 సెక్షన్ 37-బి ప్రకారము అన్ని రకాల సంక్షేమ పథకాలలో 5% రిజర్వేషన్ తో పాటు సెక్షన్ 24-1 ప్రకారము సాధారణంగా ఇచ్చే లబ్ధి లో 25%పెంచి అధికంగా అంటే దళిత వికలాంగులకు 1250000రూపాయలు ఇవ్వాలని స్పష్టం చేసారు. గతంలో 2016 చట్టం ఆమోదించి 25% అధికంగా ఇవ్వాలని ప్రత్యేక ప్రభుత్వ ఉత్తర్వులను కూడా తెలంగాణ ప్రభుత్వమే జారీ చేసిందని గుర్తు చేసారు. వికలాంగులకు రావాల్సిన రాయితీలను విడుదల చేయకుండా దళిత వికలాంగులకు తెలంగాణ ప్రభుత్వం తీవ్ర అన్యాయం చేసిందని మండిపడ్డారు.ఈ అంశంపై ముఖ్యమంత్రి చంద్రశేకర్ రావుతో బహిరంగ చర్చకు సిద్దమని సవాల్ విసిరారు. గత ఏడు సంవత్సరాలుగా ఒక్క ఏడాదైనా వికలాంగుల దినోత్సవానికి ముఖ్యమంత్రి హోదాలో హాజరయ్యారా అని దేశగాని సతీశ్ గౌడ్ ప్రశ్నించారు.