నీతిఆయోగ్ భేటీకి కేసీఆర్ గైర్హాజరు .. రీజన్ ఇదేనా
ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అధ్యక్షతన శనివారం సాయంత్రం నీతి ఆయోగ్ సమావేశం జరుగుతుంది . అయితే ఈ నీతి ఆయోగ్ సమావేశానికి తెలంగాణా సీఎం కేసీఆర్ హాజరు కాలేదు . ఎన్నికల ఫలితాల తర్వాత తిరిగి ఎన్డీయే సర్కార్ పాలనా పగ్గాలు చేపట్టిన తర్వాత జరుగుతున్న తొలి సమావేశం కావడంతో దీనికి చాలా ప్రాధాన్యత ఉంది .

నీతి ఆయోగ్ సమావేశానికి గైర్హాజరైన తెలంగాణా సీఎం కేసీఆర్
ఈ సమావేశంలో ఏపీ ముఖ్యమంత్రి జగన్తోపాటు పలు రాష్ట్రాల సీఎంలు పాల్గొననున్నారు. ఆయా రాష్ట్రాల ముఖ్యమంత్రులు తమ డిమాండ్లను, సూచనలను ప్రధాని ముందు ఉంచనున్నారు. ముఖ్యంగా ఏపీ ముఖ్యమంత్రి ఏపీ ప్రత్యేక హోదా డిమాండ్ ను ప్రధాని ముందు పెట్టే అవకాశం వుంది . గ్రామీణ ప్రాంతాలల్లో మౌలిక సదుపాయాలు, రహదారుల నిర్మాణం, తాగునీటీ సరఫరా తదితర అంశాలపై ఈ సమావేశంలో చర్చించనున్నారు. మరోవైపు, పశ్చిమ్ బెంగాల్ సీఎం మమతా బెనర్జీతో సహా కొన్ని రాష్ట్రాల సీఎంలు నీతి ఆయోగ్ ను వ్యతిరేకిస్తుండడంతో దీనిపై మోదీ వివరణ ఇవ్వనున్నారు. మరోవైపు, తాను ఈ సమావేశానికి హాజరుకాబోనని పశ్చిమ్ బెంగాల్ సీఎం మమతా బెనర్జీ ప్రకటించారు. ఇక తెలంగాణా సీఎం కూడా గైర్హాజరయ్యారు.

సీఎం కేసీఆర్ కు కేంద్ర సర్కార్ కు గ్యాప్ పెరిగిందా ? కారణం తెలంగాణాపై బీజేపీ దృష్టి పెట్టటమేనా
నీతిఆయోగ్ సమావేశానికి తెలంగాణ సీఎం కే చంద్రశేఖర్ రావు ఎందుకు హాజరుకావడం లేదు అన్న అంశం ఇప్పుడు చర్చనీయాంశం అవుతుంది. సీఎం కేసీఆర్ కు, ప్రధాని నరేంద్ర మోడీకి మధ్య గ్యాప్ పెరుగుతుందా. తెలంగాణలో ఎంపీ ఎన్నికల తర్వాత నాలుగు స్థానాలు కైవసం చేసుకున్న బీజేపీ తెలంగాణలో ప్రత్యామ్నాయ రాజకీయ శక్తిగా ఎదిగే ప్రయత్నం చేస్తుంది. అందులో భాగంగా పార్టీని బలోపేతం చెయ్యటానికి రాం మాధవ్ కు బాధ్యతలు అప్పగించింది. ఇక ఈ నేపధ్యంలో సీఎం కేసీఆర్ కు కేంద్ర సర్కార్ తో గ్యాప్ పెరిగిందా.. అందులో భాగంగానే నీతిఆయోగ్ సమావేశానికి కేసీఆర్ హాజరు కాలేదా అన్న చర్చ రాష్ట్రంలో జోరుగా జరుగుతుంది.

కాళేశ్వరం ప్రాజెక్ట్ ప్రారంభోత్సవ ఏర్పాట్ల బిజీ సీఎం నీతిఆయోగ్ భేటీకి వెళ్ళకపోవటానికి కారణమా
అయితే కేసీఆర్ నీతి ఆయోగ్ సమావేశానికి హాజరు కాకపోవటంపై టీఆర్ఎస్ వర్గాలు మాత్రం కాళేశ్వరం ప్రాజెక్ట్ కారణం అని చెప్తున్నాయి. తొలుత ఈ సమావేశానికి కేసీఆర్ వెళ్లాలని భావించారు. కానీ ఈ నెల 21న కాళేశ్వరం ప్రాజెక్టు ప్రారంభోత్సవానికి ముహూర్తం నిర్ణయించడంతో ఈ పనుల బిజీలో కేసీఆర్ తీరికలేకుండా ఉన్నారు. మహారాష్ట్ర సీఎంను ఆహ్వానించడానికి శుక్రవారం అక్కడకు వెళ్లిన కేసీఆర్, ప్రాజెక్టు ప్రారంభోత్సవానికి ఏర్పాట్లపై సమీక్షిస్తున్నారు. ఇక ఈ నేపథ్యంలో తెలంగాణా రాష్ట్రం తరఫున అధికారులు నీతి ఆయోగ్ సమావేశానికి హాజరవుతున్నారు. ఇక రాజస్థాన్, మధ్యప్రదేశ్, చత్తీస్ గఢ్, ఆంధ్రప్రదేశ్, సిక్కిం రాష్ట్రాల సీఎంలు తొలిసారి నీతి ఆయోగ్ సమావేశానికి హాజరుకాబోతున్నారు. రెండోసారి ప్రధానిగా మోడీ పాలనా పగ్గాలు చేపట్టటంతో ఈసారి రాష్ట్రాలకు కేటాయించే నిధుల విషయంలో ఏ ప్రాతిపదిక అవలంభిస్తారనేది చర్చనీయాంశంగా మారింది.

జగన్ ప్రత్యేక హోదా వాదన వినిపించేందుకు నీతిఆయోగ్ సమావేశానికి హాజరు
ఇక చాలా మాట్లాడాలని ఏపీ వాయిస్ ను గట్టిగా వినిపించాలని నీతిఆయోగ్ సమావేశానికి వెళ్ళారు సీఎం జగన్ . ఏపీకి ప్రత్యేక హోదా అంశం నీతి ఆయోగ్తో ముడిపడి ఉన్నందున ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి తన వాదనలను బలంగా వినిపించనున్నారు. విభజన వల్ల ఏపీకి జరిగిన నష్టాన్ని పూడ్చాలంటే తప్పనిసరిగా ప్రత్యేక హోదా ఇవ్వాలని ఆయన డిమాండ్ చేస్తున్నారు. ఇదే విషయమై కేంద్ర హోం మంత్రి అమిత్ షాను కలిసిన జగన్, తమ డిమాండ్లను ఆయన ముందుంచారు. మరోసారి నీతి ఆయోగ్లోనూ చర్చించనున్నారు.












Click it and Unblock the Notifications