బీఆర్ఎస్ రజతోత్సవ సభ.. కోర్టు నోటీసుల తర్వాత కీలక పరిణామం!
ఏప్రిల్ 27వ తేదీన వరంగల్లో నిర్వహించాలని భావించిన బీఆర్ఎస్ రజతోత్సవ సభకు ఎట్టకేలకు పోలీసులు గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. బి ఆర్ ఎస్ పార్టీ రజతోత్సవ సభకు అనుమతినిస్తూ అధికారికంగా ప్రకటనను వెలువరించారు. ఇంతకు ముందు బీఆర్ఎస్ రజతోత్సవ సభకు పోలీసులు అనుమతి నిరాకరించడంతో బీఆర్ఎస్ నేతలు హైకోర్టును ఆశ్రయించారు.
కోర్టు పరిధిలో బీఆర్ఎస్ సభ అనుమతి పిటీషన్
ఈ క్రమంలో దీనిపై విచారణ జరిపిన హైకోర్టు రాష్ట్ర ప్రభుత్వంతో పాటు వరంగల్ పోలీస్ కమీషనర్ కు నోటీసులు జారీ చేసింది. సభకు అనుమతిని ఎందుకు నిరాకరించారో పూర్తి వివరాలు సమర్పించాలని కోర్టు ఆదేశించింది. అంతేకాదు ఈ పిటీషన్ పై విచారణను ఈ నెల 17వ తేదీకి వాయిదా వేసింది. ఇంకా ఈ కేసు కోర్టు పరిధిలోనే ఉంది.

బీఆర్ఎస్ రజతోత్సవ సభకు పోలీసుల అనుమతి
ఇక ఈ సమయంలో పోలీసులు సభ నిర్వహించుకోవటానికి అనుమతి ఇవ్వటంతో, బీఆర్ఎస్ నేతలు కూడా తమ పిటీషన్ ను విత్ డ్రా చేసుకున్నట్టు సమాచారం. అత్యంత ఘనంగా లక్షలాది మందితో సభ నిర్వహించి మళ్లీ ప్రజాక్షేత్రంలో దూకుడుగా వెళ్లాలని భావిస్తున్న బీఆర్ఎస్ పార్టీ హనుమకొండ జిల్లా ఎల్కతుర్తి వద్ద సభను నిర్వహించడానికి పోలీసులు అనుమతి ఇవ్వటంతో సభకు మార్గం సుగమం అయ్యింది.
రజతోత్సవ సభను ప్రతిష్టాత్మకంగా భావిస్తున్న బీఆర్ఎస్
ఇక ఈ సభను బీఆర్ఎస్ చాలా ప్రతిష్టాత్మకంగా భావిస్తుంది. ఇప్పటికే మార్చి 28వ తేదీ తో పాటు, ఏప్రిల్ 4వ తేదీన రెండుసార్లు సభ అనుమతి కోసం పోలీసులకు వినతిపత్రాలు ఇచ్చి, పోలీసులు అనుమతి ఇవ్వకపోవటంతో కోర్టును ఆశ్రయించారు. ఇక కోర్టులో ఇరు పక్షాల వాదనలు విన్న ధర్మాసనం, ప్రభుత్వానికి, వరంగల్ పోలీస్ కమీషనర్ కు పూర్తి వివరాలు సమర్పించాలని నోటీసులు ఇచ్చింది.
సభకు అనుమతి ఇచ్చిన వరంగల్ సీపీ
ఇక ఈ పరిణామాల అనంతరం సభకు అనుమతి ఇస్తూ వరంగల్ సీపీ ప్రకటించారు. ఈ సభ ద్వారా గులాబీ బాస్ కేసీఆర్ మళ్ళీ ప్రజా క్షేత్రంలో అడుగు పెట్టనున్నారు. గత పార్లమెంట్ ఎన్నికల తర్వాత నుండి మళ్ళీ ఇప్పటివరకు ప్రజల్లోకి రాని కేసీఆర్ ఇప్పుడు ఈ సభ ద్వారా ప్రజల మద్దతు కోసం రంగంలోకి దిగనున్నారు.












Click it and Unblock the Notifications