షాకింగ్: స్మశానాన్ని అమ్మేసిన కేసీఆర్ సర్కార్ -వేలాన్ని ఆపాలని హైకోర్టు ఆదేశం -ఖానామెట్ భూమిలో కిరికిరి
భూముల అమ్మకం ద్వారానే రూ.50వేల కోట్ల ఆదాయాన్ని సమకూర్చుకుని, దాంతో రాష్ట్రాన్ని సర్వతోముఖంగా అభివృద్ది చేస్తామన్న కేసీఆర్ సర్కారు ఆదిశగా తన ప్రయత్నాలను సాగిస్తుండగా తెలంగాణ హైకోర్టు అడ్డంపడింది. హైదరాబాద్ మెట్రోపాలిటన్ డెవలప్మెంట్ అథారిటీ(హెచ్ఎండీఏ) ఆధ్వర్యంలో ఇటీవలే సిటీలోని కోకాపేట, ఖానామెట్ ప్రాంతాల్లోని భూముల్ని సర్కారు వేలం ద్వారా తెగనమ్మడం తెలిసిందే. అయితే, ఖానామెట్ లో ప్రభుత్వం అమ్మేసిన భూమిలో స్మశానం ఉండటం వివాదాస్పదమైంది. స్థానికులు పిటిషన్లు వేయడంతో సదరు భూవేలాన్ని నిలిపేయాల్సిందిగా హైకోర్టు శనివారం ఆదేశాలిచ్చింది..

ఖానామెట్ భూమిలో కిరికిరి
కోకాపేటలోని 50 ఎకరాల భూమిని ఎనిమిది ఫ్లాట్లుగా విభజించి గురువారం నాడు ఈ-వేలం ద్వారా అమ్మేసిన ప్రభుత్వానికి రూ.2వేల కోట్ల ఆదాయం సమకూరింది. ఆ మరుసటిరోజైన శుక్రవారం ఖనామెట్లో గొల్డెన్ మైల్లోని 15 ఎకరాలను కూడా వేలం వేశారు. దాని ద్వారా మరో రూ.729కోట్లు ఖజానాకు చేరాయి. అయితే, ఖానామెట్ లో ప్రభఉత్వం అమ్మేసిన 15 ఎకరాల్లో.. 3 ఎకరాలు స్మశానం స్థలం కావడం గమనార్హం. ఆ స్మశాన స్థలాన్ని కూడా కేసీఆర్ సర్కారు అమ్మేయడంతో దాన్ని ఆపాలంటూ స్థానికులు హైకోర్టును ఆశ్రయించారు..

వేలం ఆపాలన్న హైకోర్టు..
కేసీఆర్ సర్కారు స్మశానాన్ని కూడా అమ్మేయడంపై స్థానికులు కలతచెంది, హైకోర్టును ఆశ్రయించారు. అక్కడ తమ పూర్వికుల సమాధులున్నాయని కోర్టుకు తెలిపిన స్థానికులు.. తాము సెంటిమెంట్గా భావించే సమాధులను పరిరక్షించాలంటూ విన్నవించారు. ఈ పిటిషన్ ను విచారించిన హైకోర్టు తాత్కలికంగా స్మశాన వేలాన్ని నిలిపివేస్తూ శనివారం నాడు ఉత్తర్వులు జారీ చేసింది. ఇప్పటికే వేలం ప్రక్రియ ముగిసిన నేపథ్యంలో కోర్టు తీర్పుపై సర్కారు ఎలాంటి చర్యలు తీసుకుంటుంది? ఎలాంటి కౌంటర్ దాఖలు చేస్తుందనేది ఉత్కంఠగా మారింది.

అక్కడ ఎకరానికి రూ.55కోట్ల ధర
హైటెక్ సిటీ, హెచ్ఐసీసీకి అత్యంత సమీపంలోని ఖానామెట్ లో 14.91 ఎకరాల ప్రభుత్వ భూమిని వేలం వేయగా కోకాపేటను మించి రికార్డుస్థాయి ధరలు పలికాయి. సర్కారువాటి పాట రూ.25గా నిర్వహించిన వేలంపాటలో 46 మంది బిడ్డర్లు పోటీపడి, ఒక ఎకరాకు గరిష్టంగా రూ.55 కోట్లు, కనిష్టంగా రూ.43.6కోట్లకు కొనుక్కున్నారు. యావరేజిగా ఎకరాకు రూ.48.92 కోట్ల చొప్పున మొత్తం 14.91ఎకరాలకు గాను ప్రభుత్వానికి రూ.729 కోట్లకు పైగా రాబడి సమకూరింది. లింక్ వెల్ టెలిసిస్టమ్స్, అప్ టౌన్ ప్రాజెక్ట్స్, జీవీపీఆర్ ఇంజనీర్స్, మంజీరా కన్ స్ట్రక్షన్స్ సంస్థలు ఖానామెట్ భూముల్ని వేలం ద్వారా దక్కించుకున్నాయి.












Click it and Unblock the Notifications