అమ్మ బాబోయ్.. కోకాపేటను మించి -ఖానామెట్ భూముల వేలం, ఎకరాకు రూ.55కోట్లు, ఖజానాకు రూ.729కోట్లు
తెలంగాణలో సర్కారు భూముల అమ్మకం జోరుగా సాగింది. విశ్వనగరం హైదరాబాద్ లోని కీలక ప్రాంతాల్లో గల ప్రభుత్వం భూమిని కొనేందుకు వేలందారులు విపరీతంగా పోటీ పడ్డారు. దీంతో కనీవినీ ఎరుగని ధర పలికింది. గురువారం కోకాపేటలో భూముల్ని తెగనమ్మిన ప్రభుత్వం.. శుక్రవారం నాడు ఖానామెట్ లోని ప్లాట్లను వేలం వేయగా వందల కోట్ల ఆదాయం సమకూరింది.
గ్రేటర్ హైదరాబాద్ పరిధిలోని ఖానామెట్ ప్రాంతంలో 15 ఎకరాలను ఎంఎస్టీసీ వెబ్సైట్ ద్వారా హైదరాబాద్ మహానగరాభివృద్ధి సంస్థ (హెచ్ఎండీఏ) వేలం నిర్వహించగా సర్కారుకు కాసుల పంట పండింది. సర్కారువాటి పాట ఎకరానికి రూ.25 కోట్లుకాగా, బిడ్డర్లు పోటీపడటంతో ధర రూ.55 కోట్ల దాకా వెళ్లింది. మొత్తంగా ఖానామెట్లో ఉన్న 14.91 ఎకరాలకుగాను రూ. 729.41 కోట్లు పలికాయి. ఒక్కో ఎకరాకు గరిష్ఠంగా రూ.55 కోట్లు పలికింది. ఇది కోకాపేట ధరల కంటే ఎక్కువ కావడం గమనార్హం.

హైటెక్స్, హెచ్ఐసీసీ, హైటెక్ సిటీ సమీప గ్రామం ఖానామెట్లోని సర్వే నంబర్ 41/14లోని 14.91 ఎకరాల భూమిని హెచ్ఎండీఏ ఐద ప్లాట్లుగా విభజించి వేలం వేసింది. 2.92 ఎకరాలను రూ.160.60 కోట్లకు మంజీరా కన్స్ట్రక్షన్స్ దక్కించుకుంది.3.15 ఎకరాలను రూ.153.09 కోట్లకు లింక్వెల్ టెలీ సిస్టమ్స్ కైవసం చేసుకుంది. ఎకరాకు రూ.48.60 కోట్ల చొప్పున లింక్వెల్ సిస్టమ్స్ కొనుగోలు చేసింది.

ఖానామెట్లో హెచ్ఎండీఏ అభివృద్ధి చేసిన వెంచర్లకు వేలంలో మంచి ధర లభించింది. పురపాలక శాఖ ముఖ్యకార్యదర్శి అర్వింద్కుమార్ దగ్గరుండి వేలం వ్యవహారాలను పర్యవేక్షించారు. కోకాపేట, ఖానామెట్ భూముల వేలం ఆపాలని పలువురు కోర్టులను ఆశ్రయించినా తీర్పు ప్రభుత్వానికి అనుకూలంగా రావడంతో వేలం నిరాటంకంగా పూర్తయింది.












Click it and Unblock the Notifications