కేసీఆర్కు సర్వేల భయం పట్టుకుంది! ఫ్యామిలీ సర్కారుకు పాతరేనంటూ కేంద్రమంత్రులు
హైదరాబాద్: నిజామాబాద్ బీజేపీ ఎంపీ ధర్మపురి అరవింద్ నివాసంపై టీఆర్ఎస్ శ్రేణులు చేసిన దాడిని కేంద్రమంత్రులు కిషన్ రెడ్డి, ప్రహ్లాద్ జోషీ తీవ్రంగా ఖండించారు. హైదరాబాద్లోని ఎంపీ నివాసానికి వెళ్లిన మంత్రి కిషన్ రెడ్డి.. దాడి జరిగిన తీరును పరిశీలించారు. అరవింద్ తల్లి విజయలక్ష్మిని పరామర్శించారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడారు.

కేసీఆర్ పార్టీ గూండాయిజం అంటూ కిషన్ రెడ్డి ఫైర్
అరవింద్ నివాసంపై అధికార పార్టీ గూండాలు దాడి చేయడం హేయమైన చర్య అని కిషన్ రెడ్డి అన్నారు. ఎంపీ ఇంటిపై దాడి జరుగుతుంటే అక్కడేవున్న పోలీసులు ఏం చేస్తున్నారు? అని ప్రశ్నించారు. రాజధాని నడిబొడ్డున ప్రముఖులు, రాజకీయ నాయకులు నివసించే ఎమ్మెల్యే కాలనీలోనే ఇలాంటి ఘటన జరిగిందంటే.. తెలంగాణ రాష్ట్రం ఎటుపోతుందో అర్థం చేసుకోవచ్చన్నారు. అధికార పార్టీ గూండాయిజానికి, రౌడీయిజానికి, అహంకారపూరితమైన పరిపాలనకు ఇదే నిదర్శనమన్నారు.

సర్వేలు ఆపాలంటూ కేసీఆర్కు కిషన్ రెడ్డి హితవు
నిరాశ, నిస్పృహలో, అభద్రతా భావంలో టీఆర్ఎస్ దాడులకు పాల్పడుతోందని కిషన్ రెడ్డి ధ్వజమెత్తారు. వచ్చే ఏడాది అక్టోబర్ వరకు సర్వేలు ఆపాలని సీఎం కేసీఆర్ను కోరుతున్నానని అన్నారు. సర్వేలు చేసి అభద్రతా భావంతో, ఓడిపోతామనే భయంతో ఇలాంటి దాడులు చేయిస్తున్నారని మండిపడ్డారు. పోలీసులు, మజ్లిస్ను అడ్డుపెట్టుకుని దాడులు చేస్తున్నారన్నారు. టీఆర్ఎస్ దాడులకు తెలంగాణ ప్రజలు సమాధానమిస్తారన్నారు.

కేసీఆర్పైనే మొదటి కేసు పెట్టాలన్న కిషన్ రెడ్డి
ఇతర పార్టీల నుంచి నేతలను తీసుకోవాలని కోరిక తమకు లేదని, భయపెట్టి, బతిమిలాడి పార్టీలో చేర్చుకునే అవసరం తమకు లేదన్నారు కిషన్ రెడ్డి. ఊరికొక ఎమ్మెల్యే, మంత్రి కూర్చుంటేనే మునుగోడులో గెలిచారని ఎద్దేవా చేశారు. పార్టీ ఫిరాయింపుల కేసు పెట్టాలంటే మొదట కేసీఆర్ మీదే పెట్టాలన్నారు. ఆయన ఇప్పటికే ఎన్ని పార్టీల గొంతు నొక్కారో అందరికీ తెలుసన్నారు. దేశంలో ఇతర పార్టీల మెప్పు కోసమే కేసీఆర్ ప్రయత్నాలన్నారు. మోడీని ఢీకొంటున్నట్లు ఇతరులు అనుకోవాలని ఈ చర్యలకు పాల్పడుతున్నారని మండిపడ్డారు. కేసీఆర్ కుటుంబపాలనకుపాతరేసే రోజులొచ్చాయని కిషన్ రెడ్డి అన్నారు. అధికారం ప్రజలిస్తారు.. ఇతర పార్టీల వారు కాదని వ్యాఖ్యానించారు కిషన్ రెడ్డి. ప్రచార ఆర్భాటం కోసమే సిట్ అంటూ రాద్ధాంతం చేస్తున్నారని మండిపడ్డారు. కేసీఆర్ సర్కార్ ను కూల్చే ఆలోచన తమకు లేదని స్పష్టం చేశారు. రాష్ట్రాన్ని నిజాం రాజ్యంగా మార్చారని కిషన్ రెడ్డి విమర్శించారు.

కేటీఆర్, కవిత వస్తామంటే వద్దంటామా? అంటూ ప్రహ్లాద్ జోషి
మరో కేంద్రమంత్రి ప్రహ్లాద్ జోషీ మాట్లాడుతూ.. కల్వకుంట్ల కవితను బీజేపీలోకి రమ్మని బెదరించారని సీఎం కేసీఆర్ చెప్పడాన్ని ఖండించారు.
కేసీఆర్ వ్యాఖ్యలు బోగస్ అని.. నలుగురు ఎమ్మెల్యేలను కొనుగోలు చేయాల్సిన అవసరం బీజేపీకి లేదన్నారు. తెలంగాణలో బీజేపీ బలపడుతుండటం తట్టుకోలేకే.. ఎంపీ అరవింద్ ఇంటిపై టీఆర్ఎస్ నేతలు దాడి చేశారన్నారు. రాష్ట్రంలో ముగ్గురు ఎమ్మెల్యేలు మాత్రమే ఉన్న బీజేపీ.. టీఆర్ఎస్ ఎమ్మెల్యేలను కొనుగోలు చేసేందుకు ప్రయత్నించిందని ఆరోపించడం హాస్యాస్పదమన్నారు. బీజేపీలోకి కేటీఆర్, కవిత ఎవరు వచ్చినా ఆహ్వానిస్తామన్నారు ప్రహ్లాద్ జోషి.
ప్రధాని మోడీ తెలంగాణకు వస్తే కేసీఆర్ ఎందుకు ముఖం చాటేస్తున్నారని ప్రహ్లాద్ జోషి ప్రశ్నించారు. తాను చేసిన తప్పుల నుంచి తప్పించుకోవడానికి కేసీఆర్ అలా చేస్తున్నారా? అని విమర్శించారు. మిగులు బడ్జెట్ ఉన్న రాష్ట్రాన్ని అప్పులపాలు చేసిన ఘనత కేసీఆర్దేనని అన్నారు. పీఎం ఆవాస్ యోజన పథకాన్ని కూడా కేసీఆర్ సర్కారు సద్వినియోగం చేసుకోలేకపోతుందని మండిపడ్డారు. ఎంపీ అరవింద్ ఇంటిపై దాడి ప్రజాస్వామ్య విలువలను కాలరాయడమేనని అన్నారు. కేసీఆర్ సర్కారుకు ప్రజలు బుద్ధి చెబుతారన్నారు.












Click it and Unblock the Notifications