గెలిచే పార్టీ పేరు చెప్పలేదేం?: తెలంగాణ ఎన్నికలపై లగడపాటి సర్వే, కిషన్రెడ్డి ఆగ్రహం
హైదరాబాద్/తిరుపతి: విజయవాడ లోకసభ మాజీ పార్లమెంటు సభ్యులు లగడపాటి రాజగోపాల్ తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల జోస్యంపై భారతీయ జనతా పార్టీ సీనియర్ నేత, ఆ పార్టీ అంబర్పేట అభ్యర్థి కిషన్ రెడ్డి శుక్రవారం కౌంటర్ ఇచ్చారు. లగడపాటి తన భవిష్యత్తును తేల్చుకోలేకనే అజ్ఞాతంలో ఉన్నాడని చెప్పారు. ఇక అలాంటి లగడపాటి తమ భవిష్యత్తు చెప్పేదేమిటని ఎద్దేవా చేశారు.
నందమూరి సుహాసినికి వైసీపీ భారీ దెబ్బ?: ఓడితే ఏపీ సీఎంగా.. ఇదీ జగన్ లెక్క!
తెలుగు రాష్ట్రాలలో లగడపాటి రాజగోపాల్ సర్వేకు ఓ క్రేజ్ ఉంది. పలు చోట్ల జరిగిన ఎన్నికల్లో ఆయన తన సంస్థలతో సర్వేలు చేయించారు. అందులో చాలా వరకు ఎక్కువ శాతం నిజం అయ్యాయి. దీంతో ఆయన సర్వేలు తెలుగు రాష్ట్రాల్లో మరింత ఆసక్తిని రేపుతుంటాయి. కొద్ది రోజుల క్రితం లగడపాటి సర్వే వచ్చినట్లుగా ప్రచారం జరిగినా, దానిని ఆయన కొట్టి పారేశారు. సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది తన సర్వే కాదని, తాను మీడియా ముందుకు వచ్చి చెబుతానని స్పష్టం చేశారు.
లగడపాటి ఆసక్తికర సర్వే
లగడపాటి శుక్రవారం మీడియా ముందుకు వచ్చి తన సర్వే అంశంపై పొడిపొడిగా మాట్లాడారు. తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలపై ఆసక్తికర జోస్యం వెల్లడించిన విషయం తెలిసిందే. ఎన్నికలలో పలు స్థానాల్లో ప్రధాన పార్టీల అభ్యర్థులను ప్రజలు తిరస్కరించబోతున్నారని చెప్పారు. ప్రధాన పార్టీల ప్రలోభాలకు ఓటర్లు లోనవడం లేదని చెప్పారు. పలుచోట్ల స్వతంత్ర అభ్యర్థుల వైపు ఓటర్లు మొగ్గు చూపుతున్నారని చెప్పారు.
ఆశ్చర్యపోయిన లగడపాటి
ఈ ఎన్నికల్లో ఎనిమిది నుంచి పదిమంది స్వతంత్ర అభ్యర్థులు గెలుస్తారని లగడపాటి చెప్పారు. ఇంతమంది ఇండిపెండెంట్లు గెలవస్తారనే సమాచారం తనకు ఆశ్చర్యం వేసిందని చెప్పారు. స్వతంత్రుల వైపు ఓటర్లు మొగ్గు చూపాక ఇక మార్పు ఉండదని చెప్పారు. నారాయణపేట నియోజకవర్గంలో స్వతంత్ర అభ్యర్థి శివకుమార్ రెడ్డి, బోథ్లో స్వతంత్ర అభ్యర్థి అనిల్ జాదవ్ గెలుస్తారన్నారు. గెలిచే స్వతంత్ర అభ్యర్థులను రోజుకు ఇద్దరు చొప్పున ప్రకటిస్తానని చెప్పారు. అన్ని వివరాలు డిసెంబర్ 7వ తేదీ తర్వాత చెబుతానన్నారు. తనకు రాజకీయా పార్టీలు, నాయకులు, రాజకీయాలతో ఎలాంటి సంబంధం లేదని తేల్చి చెప్పారు.
గెలిచే పార్టీల పేర్లు ఎందుకు చెప్పలేదు?
లగడపాటి రోజుకు ఇద్దరు గెలిచే స్వతంత్ర అభ్యర్థుల పేర్లు చెబుతానని అన్నారు. ఎనిమిది తొమ్మిది మంది గెలుస్తారని చెప్పారు. ఎన్నికలకు మరో వారం రోజుల సమయం కూడా లేదు. ఆయన రోజుకు ఇద్దరు పేర్లు వెల్లడిస్తే.. ఈ సమయమంతా స్వతంత్రుల పేర్లు వెల్లడించడానికే సరిపోతుంది. ముఖ్యంగా ఆయన ఏ పార్టీ గెలుస్తుందని చెప్పకపోవడం చర్చనీయాంశంగా మారింది. తెరాసకు అనుకూలంగా ఉంటుందనో లేక మహాకూటమికి ప్రజలు పట్టం గడతారనో లేక బీజేపీ, మజ్లిస్ పార్టీల బలం తగ్గుతుందనో... పెరుగుతుందనో చెప్పాల్సిందని, కేవలం ఇద్దరి పేరు చెప్పి చేతులు దులిపేసుకున్నారని అంటున్నారు. ఆయన బిజినెస్లు ఎక్కువగా హైదరాబాదులో ఉండటంతో మిన్నకుండిపోయారా అనే చర్చ సాగుతోంది. ఆయన వ్యూహాత్మకంగా వ్యవహరిస్తున్నారా అనే చర్చ సాగుతోంది.
ఎవరికి వారే ధీమా
తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ నేతృత్వంలోని మహాకూటమి, తెరాసలు ఎవరికి వారే గెలుపుపై ధీమాగా ఉన్నారు. సర్వేలన్నీ తమ వైపే ఉన్నాయని, తాము ప్రవేశ పెట్టిన సంక్షేమ పథకాలు గెలిపిస్తాయని తెరాస వర్గాలు చెబుతున్నాయి. మరోవైపు కాంగ్రెస్ కూడా కూటమి గెలుపు ఖాయమని చెబుతోంది. బీజేపీ వంటి పార్టీలు డబుల్ డిజిట్ సాధించి ప్రభుత్వంలో కీలకపాత్ర పోషిస్తామని చెబుతోంది.