రాష్ట్ర ప్రభుత్వ వాటా నిధులివ్వండి: సీఎం కేసీఆర్కు కేంద్రమంత్రి కిషన్ రెడ్డి లేఖ
హైదరాబాద్: పలు కీలక అంశాలను ప్రస్తావిస్తూ తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్కు కేంద్రమంత్రి కిషన్ రెడ్డి లేఖ రాశారు. ప్రధానమంత్రి స్వాస్థ్య సురక్షా యోజన పథకం (పీఎంఎస్ఎస్వై) క్రింద ఆధునీకరించిన RGIMS ఆదిలాబాద్, వరంగల్ కాకతీయ మెడికల్ కళాశాలల్లో తగిన సిబ్బందితో వెంటనే వైద్య సేవలను ప్రారంభించాలని కిషన్ రెడ్డి పేర్కొన్నారు. RGIMS ఆదిలాబాద్ విషయంలో బకాయి ఉన్న రాష్ట్ర ప్రభుత్వ వాటా నిధులను కూడా వెంటనే విడుదల చేయాలని సీఎం కేసీఆర్ను కోరారు.
దేశంలోని సామాన్య ప్రజలకు అతి తక్కువ ఖర్చుతో మెరుగైన వైద్య సదుపాయాలను అందుబాటులోకి తీసుకురావాలని వైద్య కళాశాలలలో సౌకర్యాలను పెంపొందించి, నాణ్యమైన వైద్య విద్యను అందించాలన్న లక్ష్యంతో పూర్వ ప్రధానమంత్రి అటల్ బిహారీ వాజ్ పేయి నేతృత్వంలోని భారత ప్రభుత్వం 2003లో ప్రధానమంత్రి స్వాస్థ్య సురక్షా యోజన పథకాన్ని (PMSSY) ప్రారంభించారని గుర్తు చేశారు.

నూతన AIIMS సంస్థలను ఏర్పాటు చేయడం, ప్రభుత్వ వైద్య కళాశాలలను/సంస్థలను ఆధునిక కాలానికి, అవసరాలకు అనుగుణంగా అభివృద్ధి పరచడం ప్రధానమంత్రి స్వాస్థ్య సురక్షా యోజన పథకం రెండు ముఖ్య లక్ష్యాలు అని పర్కొన్నారు. ప్రభుత్వ వైద్య కళాశాలలను అభివృద్ధి పరచడంలో భాగంగా 150 నుంచి 250 వరకు అదనపు పడకలను ఏర్పాటు చేయడం, కొత్త ఆపరేషన్ థియేటర్ల ఏర్పాటు, 8 నుండి 10 వరకు సూపర్ స్పెషాలిటీ విభాగాల ఏర్పాటు, దాదాపు 15 అదనపు పీజీ సీట్లను కేటాయించడం వంటి కార్యక్రమాలను చేపడుతున్నట్లు వెల్లడించారు.
ఈ పథకం మూడవ విడతలో భాగంగా ఆదిలాబాద్లో ఉన్న రాజీవ్ గాంధీ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ మరియు వరంగల్ లో ఉన్న కాకతీయ మెడికల్ కాలేజీలను గుర్తించి ఒక్కొక్క సంస్థకు అత్యధికంగా రూ.120 కోట్ల నిధులను భారత ప్రభుత్వం విడుదల చేసినట్లు తెలిపారు. అత్యంత వేగంగా అభివృద్ధి చెందుతున్న ఆదిలాబాద్, వరంగల్ పట్టణాలలో నాణ్యమైన వైద్య సేవలను ఎక్కువ మంది ప్రజలకు అందుబాటులోకి తీసుకురావాలన్న ఉద్దేశ్యంతో ఈ రెండు సంస్థలను ఎంచుకున్నట్లు తెలిపారు.
Recommended Video
కోవిడ్ సమయంలో ఎదురైన పరిస్థితుల కారణంగా రాష్ట్ర ప్రభుత్వ వాటా నిధుల విడుదలలో జరిగిన జాప్యం కారణంగా ఆదిలాబాద్, వరంగల్లోని ఈ రెండు సంస్థల అభివృద్ధి పనులు చాలా ఆలస్యంగా పూర్తయ్యాయని చెప్పారు. ఈ కారణాల మూలంగా కాకతీయ మెడికల్ కాలేజీ నిర్మాణాలు 2020 అక్టోబర్ నెలలో, RGIMS ఆదిలాబాద్ నిర్మాణాలు భారత ప్రభుత్వ సంస్థ HITES ఆధ్వర్యంలో పూర్తయ్యాయని తెలిపారు.
మునుపెన్నడూ లేని విధంగా ప్రజలకు పెద్ద ఎత్తున అవసరమవుతున్న వైద్య అవసరాలను దృష్టిలో ఉంచుకుని, తగిన సిబ్బందితో ఈ రెండు సంస్థలలో వెంటనే సేవలను ప్రారంభించాలని కోరారు. RGIMS ఆదిలాబాద్ విషయంలో బకాయి ఉన్న రాష్ట్ర ప్రభుత్వ వాటా నిధులను కూడా వెంటనే విడుదల చేయాలని కేంద్రమంత్రి కిషన్ రెడ్డి లేఖలో కోరారు.












Click it and Unblock the Notifications