మునుగోడు ఉపఎన్నిక అయ్యేవరకు రోజూ దసరానే; అది కోమటిరెడ్డి రాజీనామా వల్లే: ఈటల రాజేందర్
మునుగోడు నియోజకవర్గంలో రాజకీయం రసవత్తరంగా సాగుతోంది. ఒకరిని మించి ఒకరు వ్యూహాలతో రాజకీయాన్ని రసవత్తరంగా మారుస్తున్నారు. ప్రజాక్షేత్రంలో ప్రజల మద్దతు కూడగట్టడానికి మాటల తూటాలను సంధిస్తున్నారు. ఇప్పటికే ఎన్నికల ప్రచారంలో దూకుడుగా ముందుకు వెళ్తున్న బిజెపి నాయకులు ప్రజలను ఆకట్టుకోవడానికి తమదైన శైలిలో రాష్ట్రంలో పరిస్థితులను వివరిస్తున్నారు. ముఖ్యంగా మునుగోడు నియోజకవర్గంలో చేరికలపై ఫోకస్ చేసిన ఈటల రాజేందర్, చేరికలతో పాటు ఎన్నికల ప్రచారంలో జోరుగా పాల్గొంటున్నారు.

కెసీఆర్ కు ప్రజల మీద కక్ష
మునుగోడు నియోజకవర్గం మర్రి గూడెం మండలం తమ్మడపల్లిలో బీజేపీ ఎన్నికల ప్రచారంలో పాల్గొన్న ఈటల రాజేందర్, కొండా విశ్వేశ్వర్ రెడ్డి సీఎం కేసీఆర్ సర్కార్ పై తీవ్ర విమర్శలు చేశారు. తమ్మడపల్లి లో పలువురు బిజెపిలో చేరిన సందర్భంగా అక్కడ నిర్వహించిన సభలో మాట్లాడిన ఈటల రాజేందర్ 2018 లో మునుగోడులో రాజగోపాల్ రెడ్డిని గెలిపించినందుకు కెసిఆర్ మీమీద కక్ష కట్టారు. మీకు నిధులు ఇవ్వలేదు. కనీసం కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి కి ఎమ్మెల్యే అన్న గౌరవం కూడా ఇవ్వలేదు. అది తనకు ఓటేయని ప్రజల మీద కెసిఆర్ కు ఉన్న కక్ష అని పేర్కొన్నారు.

హుజురాబాద్ లానే.. కోమటి రెడ్డి రాజీనామాతో మీ ఋణం తీరుతుంది
నేను రాజీనామా చెయ్యగానే దెబ్బకి సీఎం స్వయంగా దిగివచ్చాడు. 13 మంది మంత్రులు వచ్చారు.నా రాజీనామాతో హుజురాబాద్ ప్రజల రుణం తీర్చుకున్నా . ఇప్పుడు కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి రాజీనామాతో మీ రుణం తీర్చుకుంటున్నారు అంటూ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. తాను రాజీనామా చేయడం వల్ల దళిత బంధు పెట్టి ఒక్కో కుటుంబానికి 10 లక్షలు ఇచ్చారు. గొల్ల కురుమలకు లక్ష 75 వేలు ఇచ్చారు. రోజు జనాలకు విందులు ఏర్పాటు చేశారు అని ఈటల రాజేందర్ చెప్పుకొచ్చారు. అందుకే మీవాళ్ళ రుణం తీర్చుకోడానికి రాజీనామా చెయ్యమని రాజగోపాల్ రెడ్డికి చెప్పానని పేర్కొన్న ఆయన, ఇప్పుడు కచ్చితంగా మీ రుణం తీరుతుంది అంటూ వ్యాఖ్యలు చేశారు.

దసరా ఒకటేరోజు... ఇప్పుడు మునుగోడులో దసరా ప్రతీరోజు
సహజంగా దసరా పండుగ ఒకరోజు చేసుకుంటాం కానీ, మునుగోడు లో కెసిఆర్ ఉప ఎన్నిక పూర్తయ్యేవరకూ దసరా పండుగ చేస్తారు ఇక్కడ అంటూ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ప్రతిరోజు విందులు, వినోదాలతో మునుగోడులో పండుగ వాతావరణం వస్తుందని చెప్పారు. అందుకు కారణం తామేనని మరోమారు స్పష్టం చేశారు. మునుగోడు ఎన్నికల వల్ల 57 ఏళ్లకు పెన్షన్ వచ్చిందని పేర్కొన్నారు. కెసిఆర్ ఓటుకు 20 వేల నుండి 50 వేల రూపాయలు ఇస్తారని ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. గొల్ల కురుమలకు లక్షా 50 వేల రూపాయలు ఇస్తారు.41,750 రూపాయలు మనం కట్టాల్సిన డబ్బు కూడా వారే కడతారట.అన్నీ తీసుకోండి. కానీ ఓటు విషయంలో మీకు ఇలాంటి అవకాశాన్ని కల్పించిన నాయకుడికి మాత్రమే ఓటేయండి. ధర్మం తప్పకండి అంటూ వ్యాఖ్యలు చేశారు .

పేదలు అన్ని కులాల్లో... ప్రతీ పేద కుటుంబానికి 10 లక్షలు ఇవ్వండి
అదే సమయంలో పేదలు అన్ని కులాల్లో ఉంటారు.. ప్రతి పేద కుటుంబంకు 10 లక్షల రూపాయలు ఇవ్వాలని డిమాండ్ చేశారు. పెన్షన్ కి, కళ్యాణ లక్ష్మి, రైతుబంధుకి కెసిఆర్ ఇచ్చేది 26 వేల కోట్లు అయితే.. లిక్కర్ ద్వారా జనాల నుండి కెసిఆర్ లాక్కొంటున్న డబ్బులు 47 వేల కోట్లని ఈటల రాజేందర్ పేర్కొన్నారు. వస్తున్న పెన్షన్ గురించి ఆలోచిస్తున్నాం తప్ప తెగిపడుతున్న ఆడపిల్లల తాళిబొట్ల గురించి ఆలోచించడం లేదని అన్నారు. మునుగోడు నియోజకవర్గంలో దావత్ లు, గొర్రెలు, బర్రెలు, రోడ్లు అన్నీ రాజగోపాల్ రెడ్డి రాజీనామా చేయడం వల్లే వచ్చాయని, ఈ విషయాన్ని ఎవరూ మర్చిపోకూడదని ఈటల రాజేందర్ తెలిపారు

ప్రజల ఉసురు తగిలి ఈ ప్రభుత్వం ఆరు నెలల్లో పోతుందన్న ఈటల రాజేందర్
ఉద్యోగాలురాక, నిరుద్యోగులుగా బ్రతకలేక బాధతో యువకులు ఆత్మహత్య చేసుకున్నారు. అయినా కెసిఆర్ కు పట్టడం లేదని మండిపడ్డారు. మీరు రాజగోపాల్ రెడ్డి కి మళ్లీ పట్టం కడితే, హుజురాబాద్ ప్రజలకు ఏ విధంగా అయితే మంచి పేరు వచ్చిందో మీకు కూడా అదే విధంగా మంచి పేరు వస్తుందని ఈటల రాజేందర్ స్పష్టం చేశారు. ప్రజల ఉసురు తగిలి ఈ ప్రభుత్వం ఆరు నెలల్లో పోతుందని పేర్కొన్న ఈటల రాజేందర్, మునుగోడు నియోజకవర్గ ప్రజలు కెసిఆర్ కు తగిన గుణపాఠం చెప్పాలని విజ్ఞప్తి చేశారు.












Click it and Unblock the Notifications