ఆ ఇద్దరు రాజీనామా చేస్తేనే కాంగ్రెస్కు భవిష్యత్: రాజగోపాల్ రెడ్డి, బీజేపీపై ఆసక్తికర వ్యాఖ్యలు
హైదరాబాద్: పార్టీ మారుతారనే ప్రచారం జరుగుతున్న నేపథ్యంలో మునుగోడు కాంగ్రెస్ ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి మరో సారి తన పార్టీ, ఆ పార్టీ ముఖ్య నేతలపై తీవ్రస్థాయిలో విమర్శలు చేశారు.
హరీష్ రావు పని అడకత్తెరలో పోకచెక్కేనా? సీఎం కేసీఆర్ బడ్జెట్ మర్మం ఇదేనా ?
వాళ్లిద్దరూ రాజీనామా చేస్తేనే..
తెలంగాణ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు ఉత్తమ్ కుమార్ రెడ్డి, ఆ పార్టీ రాష్ట్ర వ్యవహారాల ఇంఛార్జ్ ఆర్సీ కుంతియాలు తమ పదవులకు రాజీనామా చేస్తేనే తెలంగాణలో కాంగ్రెస్ పార్టీకి భవిష్యత్ ఉంటుందని అన్నారు. ఆ ఇద్దరి నేతల వల్లే కాంగ్రెస్ తెలంగాణలో బలహీనపడిందన్నారు.
రాహులే రాజీనామా చేశారు..
తెలంగాణ బడ్జెట్ సమావేశాల అనంతరం సోమవారం అసెంబ్లీలో లాబీల్లో మీడియాతో మాట్లాడారు కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి. రాష్ట్రస్థాయిలోనే కాదు.. జాతీయ స్థాయిలో కూడా కాంగ్రెస్ పార్టీకి సరైన నాయకత్వం లేదని వ్యాఖ్యానించారు. కాంగ్రెస్ పార్టీ అధ్యక్ష పదవికి రాహుల్ గాంధీ రాజీనామా చేసిన తర్వాత ఎవరుండి ఏం చేస్తారని అన్నారు.
తెలంగాణలోనూ బీజేపీనే...
తెలంగాణలో టీఆర్ఎస్ పార్టీకి ఎప్పటికైనా ప్రత్యామ్నాయం భారతీయ జనతా పార్టీనేని రాజగోపాల్ రెడ్డి వ్యాఖ్యానించారు. రాష్ట్రంలో గత కొంత కాలం నుంచి బీజేపీ పుంజుకుంటోందని చెప్పుకొచ్చారు. కాంగ్రెస్ పార్టీని వీడి బీజేపీలో చేరతారంటూ ప్రచారం జరుగుతున్న నేపథ్యంలో కోమటిరెడ్డి ఇలాంటి వ్యాఖ్యలు చేయడం గమనార్హం.
మోకాళ్లపై యాత్ర చేసినా..
కాంగ్రెస్ పార్టీ నేతలు తెలంగాణలో పాదయాత్ర కాదు.. మోకాళ్ల యాత్ర చేసిన సీఎం కేసీఆర్ పట్టించుకునే పరిస్థితి లేదని ఎద్దేవా చేశారు రాజగోపాల్ రెడ్డి. తన సోదరుడు, భువనగిరి ఎంపీ కోమటిరెడ్డి వెంకటరెడ్డి రైతుల కోసం పాదయాత్ర చేస్తే చేయనివ్వండని ఆయన వ్యాఖ్యానించారు. కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి బీజేపీలో చేరే ఆలోచనలో ఉండగా.. వెంకటరెడ్డి మాత్రం కాంగ్రెస్లో కొనసాగాలని అనుకుంటున్నట్లు సమాచారం.