ఏ ముఖం పెట్టుకుని వస్తారు?: కేసీఆర్పై విరుచుకుపడ్డ కోమటిరెడ్డి బ్రదర్స్
బీఆర్ఎస్ అధినేత కేసీఆర్పై కోమటిరెడ్డి సోదరులు తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. కేసీఆర్ ఏ ముఖం పెట్టుకుని నల్గొండకు వస్తున్నారని మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి ప్రశ్నించారు. రాష్ట్రానికి అన్యాయం చేసిందే కేసీఆర్ అని విమర్శించారు. ఫిబ్రవరి 13న బీఆర్ఎస్ సభకు వ్యతిరేకంగా నిరసన తెలుపుతామని ఆయన ప్రకటించారు. మరోవైపు, రాజకీయాలకు అతీతంగా అందరూ కేసీఆర్ నిర్వహించే సభను బహిష్కరించాలని పిలుపునిచ్చారు మునుగోడు కాంగ్రెస్ ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి.
కేసీఆర్ ప్రభుత్వం అప్పులు మిగిల్చి వెళితే.. బడ్జెట్లో 13 శాతం అప్పుల చెల్లింపులకే పోతుందని రోడ్లు భవనాల శాఖ, సినిమాటోగ్రఫీ మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి తెలిపారు. గత ప్రభుత్వం అంకెలు, మాటల గారడీతో కాలం వెల్లదీసిందన్నారు. తాము ప్రవేశపెట్టిన బడ్జెట్ గొప్పగా ఉందన్నారు. రీజినల్ రింగ్ రోడ్డు సూపర్ గేమ్ ఛేంజర్గా మారబోతోందన్నారు. తెలంగాణకు తలమానికంగా మారుతుందన్నారు. మాజీ సీఎస్ సోమేశ్ కుమార్ వల్లే ఆర్ఆర్ఆర్ ఆలస్యమైందన్నారు.

ఎస్ఎల్బీసీని నిర్లక్ష్యం చేసి.. నల్గొండ జిల్లాను ఎండబెట్టింది కేసీఆర్ అని విమర్శించారు కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి. జగన్తో కుమ్మక్కై కృష్ణా జలాల వాటాలో తెలంగాణకు అన్యాయం చేశారన్నారు. కేఆర్ఎంబీ గురించి మాట్లాడే నైతిక హక్కు కేసీఆర్, హరీశ్ రావుకు లేదన్నారు. కేసీఆర్ ఏ ముఖం పెట్టుకుని నల్గొండ వస్తారు? ముక్కు నేలకు రాసి నల్గొండలో అడుగుపెట్టాలి అంటూ మండిపడ్డారు కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి.
మరోవైపు, కృష్ణా ప్రాజెక్టులను కేంద్రానికి అప్పగించేందుకు కేసీఆర్ సంతకం చేశారని.. ఇప్పుడు కావాలనే కాంగ్రెస్ ప్రభుత్వంపై ఆరోపణలు చేస్తున్నారని మండిపడ్డారు కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి. తెలంగాణకు ఇంతకంటే ద్రోహం మరొకటి ఉంటుందా? అని ప్రశ్నించారు. దక్షిణ తెలంగాణను ఎడారిగా మార్చి.. ఇప్పుడు మళ్లీ సెంటిమెంట్ రెచ్చగొట్టేందుకు కేసీఆర్.. నల్గొండలో సభ పెడుతున్నారన్నారు. కేసీఆర్ నల్గొండ సభను పార్టీలకు అతీతంగా ప్రజలంతా బహిష్కరించాలని రాజగోపాల్ రెడ్డి పిలుపునిచ్చారు. ప్రాజెక్టులు పూర్తి చేయకుండా పది సంవత్సరాల తర్వాత ఏ ముఖం పెట్టుకుని నల్డొండకు వస్తున్నాడో చెప్పాలన్నారు.












Click it and Unblock the Notifications