కేసీఆర్ను కలుస్తానంటూ కోమటిరెడ్డి వెంకటరెడ్డి: ఆ జీవో రద్దుకు దీక్ష
హైదరాబాద్: ఎనిమిదేళ్లుగా టీఆర్ఎస్ ప్రభుత్వం తెలంగాణ రైతాంగానికి అన్యాయం చేస్తోందని భువనగిరి కాంగ్రెస్ ఎంపీ కోమటిరెడ్డి వెంకటరెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆగస్టు 18న జారీ చేసిన జీవో 246 నల్గొండ జిల్లాకు తీవ్ర అన్యాయం చేసేలా ఉందన్నారు.
Recommended Video
కృష్ణా జలాల కేటాయింపునకు సంబంధించి టీఆర్ఎస్ ప్రభుత్వం జారీచేసిన జీవో 246ను వ్యతిరేకిస్తూ కోమటిరెడ్డి వెంకటరెడ్డి ట్వీట్ చేశారు. నల్గొండ జిల్లాకు దక్కాల్సిన 45 టీఎంసీల నీటిని పాలమూరు-రంగారెడ్డి ప్రాజెక్టుకి కేటాయిస్తూ తప్పుడు నిర్ణయం తీసుకున్నారని మండిపడ్డారు.
రాష్ట్ర ప్రభుత్వం నల్గొండ-మహబూబ్నగర్ జిల్లాల మధ్య కొట్లాటలు పెట్టే ప్రయత్నం చేస్తోందని కోమటిరెడ్డి ఆరోపించారు. ఆంధ్రప్రదేశ్ రోజుకు 8 నుంచి 11 టీఎంసీల మేర కృష్ణా జలాలను తోడుకుపోతున్నా.. సీఎం కేసీఆర్ పట్టించుకోవడం లేదని ధ్వజమెత్తారు.
తెలంగాణా రాష్ట్ర ప్రభుత్వం 8 ఏండ్లుగా తెలంగాణా రైతాంగానికి అన్యాయం చేస్తుంది. జీవో నం 246 తో నల్గొండకు దక్కాల్సిన 45 టీఎంసీల నీటిని పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టుకి కేటాయిస్తూ తప్పుడు నిర్ణయం తీసుకున్నారు
— Komatireddy Venkat Reddy (@KomatireddyKVR) August 30, 2022
నల్గొండ - మహబూబ్ నగర్ మధ్య కొట్లాటలు పెట్టే ప్రయత్నం చేస్తున్నారు
1/2 pic.twitter.com/Ulm1aronw3
జీవో నెంబర్ 246ని రద్దు చేయకపోతే తాను దీక్షకు సిద్ధమవుతానని కోమటిరెడ్డి వెంకటరెడ్డి హెచ్చరించారు. అందుబాటులో ఉన్న 90 టీఎంసీల నీటిలో 30 టీఎంసీలు ఎస్ఎల్బీసీకి, 40 టీఎంసీలు పాలమూరు-రంగారెడ్డి, 20 టీఎంసీలు డిండి ఎత్తి పోతల పథకానికి కేటాయించాలని కోమటిరెడ్డి డిమాండ్ చేశారు. ఈ నీటి కేటాయింపు విషయంలో అవసరమైతే సీఎం కేసీఆర్ ను కలుస్తానని చెప్పారు.