ప్రధాని మోదీకి కోమటిరెడ్డి వెంకట్రెడ్డి లేఖ.!నూతన ఎన్.హెచ్కు నెంబర్, నిధులు కేటాయించాలని విజ్ఞప్తి.!
హైదరాబాద్ : ప్రధని నరేంద్ర మోదీకి భువనగిరి ఎంపీ కోమటిరెడ్డి వెంకట్రెడ్డి మరో లేఖాస్త్రం సంధించారు. ఔటర్ రింగ్ రోడ్డు జంక్షన్ గౌరెల్లి నుంచి కొత్తగూడెం ఎన్. హెచ్. 30వరకు నూతనంగా మంజూరైన జాతీయ రహదారికి ఎన్.హెచ్. నెంబర్ కేటాయించడంతో పాటు డీపీఆర్కు అనుమతి ఇవ్వాలంటూ ప్రధానమమంత్రి నరేంద్ర మోదీకి లేఖ రూపంలో విజ్ఞప్తి చేసారు. ఈ లేఖను ప్రధాన మంత్రి కార్యాలయంలో సమర్పించారు. ఈ సందర్భంగా కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి నూతనంగా మంజూరైన ఈ జాతీయ రహదారి వల్ల హైదరాబాద్ - వైజాగ్ పోర్టు, హైదరాబాద్ - చత్తీస్ఘడ్ మధ్య దాదాపు 100 కిలోమీటర్ల ప్రయాణ దూరం తగ్గుతుందని తెలిపారు.

ఈ ప్రాజెక్టుకు డీపీఆర్లను ఆహ్వానించగా ఇప్పటి వరకు ఈ డీపీఆర్లకు అనుమతి ఇవ్వలేదని వివరించారు. దాదాపు 100 కిలోమీటర్లకు పైగా భువనగిరి పార్లమెంట్ నియోజకవర్గం గుండా ఈరహదారి వెళుతుందన్నారు. ఈ రోడ్డు గిరిజన ప్రాంతాల నుంచి, రెండు జిల్లా కేంద్రాలు మహబూబాబాద్, కొత్తగూడెం గుండా వెళుతుందని వెల్లడించారు. ఈ రోడ్డు పూర్తయితే గిరిజన ప్రాంతం అభివృద్ది చెందుతుందని పేర్కొన్నారు. ఈ రహదారికి వెంటనే ఎన్. హెచ్. నెంబర్ కేటాయించి, డీపీఆర్లకు అనుమతులు మంజూరీ చేసి, నిధులు కేటాయించేలా సంబంధిత శాఖకు ఆదేశాలు జారీచేయాలని ప్రధాని నరేంద్రమోదీని లేఖలో కోరారు. కేంద్ర రోడ్డు, రవాణా శాఖ సెక్రెటరీ ఎ. గిరిధర్కు సైతం ఈ లేఖను ఎంపీ కోమటిరెడ్డి వెంకట్రెడ్డి అందజేశారు.