నేత్రపర్వంగా కొమురెల్లి మల్లన్న పెద్దపట్నం .. ఆద్యంతం మల్లన్న శరణు ఘోషలతో తన్మయత్వం
కోరిన వారి కోర్కెలు తీర్చే కోరమీసాల కొమురవెల్లి మల్లికార్జున స్వామి బ్రహ్మోత్సవాల్లో కీలక ఘట్టమైన పెద్ద పట్నం వేడుక అత్యంత ఘనంగా జరిగింది. మల్లన్న శరణు శరణు అంటూ జయజయధ్వానాలతో ఆలయ ప్రాంగణమంతా మార్మోగిపోయింది. కన్నుల పండువగా జరిగిన మల్లన్న కళ్యాణాన్ని తిలకించడానికి భక్తులు బారులుతీరారు. శివ శక్తులు శివాలెత్తి పోయారు. ఒగ్గు పూజారులు ఆధ్వర్యంలో సంప్రదాయబద్ధంగా మల్లన్న కల్యాణం అంగరంగ వైభవంగా జరిగింది.
ఇక అత్యంత కీలకంగా భావించే పెద్ద పట్నం వేసే ముందు ఒగ్గు పూజారులు ఆచారం ప్రకారం పట్టు వస్త్రాలను గర్భాలయంలోని స్వామివారికి సమర్పించి పరమ శివుడి తలపై కొలువైన గంగాదేవిని కొలిచినట్లుగా యాదవ పూజారులు స్వామివారిని పల్లకిలో ఊరేగింపుగా తీసుకువెళ్లి, కోనేట్లో స్నానం ఆచరింపజేసి, శుద్ధి చేసి గండదీపం పెట్టి గంగ తెప్ప వదిలారు. పట్నం వేసే ప్రదేశంలో సుంకు పట్టిన అనంతరం గొంగళిలో బియ్యం పోసి మైలపోలు తీసి స్వామివారు ధరించే త్రిశూలం, డమరుకం నెలకొల్పి పసుపు, కుంకుమ, తెల్ల పిండి, సునేరు ,పచ్చలను ప్రమథగణాలుగా సమ్మిళితం చేసి, నిమ్మకాయతో చిత్ర కన్ను నెలకొల్పి పట్నం వేసి సర్వాంగ సుందరంగా తీర్చిదిద్దారు.
ఇక అష్టదిక్కులలో నిమ్మకాయలు, గుమ్మడికాయలతో బలిహరణ చేసి పెద్ద పట్నం పైకి ఆవాహనం చేశారు. బొగ్గు పూజారులు బోనాలు తీసుకు వచ్చిన అనంతరం, తెల్లవారుజామున గర్భాలయంలో నుంచి వీర శివార్చనకు ఉత్సవ విగ్రహాలను తీసుకువచ్చి పట్నం చుట్టూ ప్రదక్షణలు చేసి పట్నం తొక్కటం ప్రారంభించారు.పెద్ద పట్నాన్ని తిలకించిన భక్తులు ఆనంద తన్మయత్వం తో ఊగిపోయారు. శివసత్తుల చిందులతో, పోతరాజుల వీరంగాలతో ఆలయ ప్రాంగణమంతా మల్లన్న శరణుఘోషతో మార్మోగింది.
ఈ వేడుకలలో దేవాలయ ఈవో టంకశాల వెంకటేష్ , ధర్మకర్తల మండలి చైర్మన్ సంపత్, ధర్మకర్తలుగా మల్లేష్ యాదవ్, ముత్యం నరసింహులు ,బండి తిరుపతిరెడ్డి తదితరులు పాల్గొన్నారు. సిద్దిపేట లా అండ్ ఆర్డర్ డి సి పి నరసింహారెడ్డి పర్యవేక్షణలో భక్తులకు ఇబ్బంది కలగకుండా శాంతిభద్రతలను పరిరక్షించేలా ఏర్పాట్లు చేశారు.