బిడ్డ సుస్మిత రాజకీయ భవితవ్యం కోసం తమ రాజకీయ జీవితాన్ని పణంగా పెట్టిన కొండా కపుల్
తెలంగాణ రాజకీయాల్లో ప్రస్తుతం కొండా సురేఖ రాజీనామా వ్యవహారం హాట్ టాపిక్ గా మారింది. కొండా సురేఖ మంత్రి పదవికి రాజీనామా చెయ్యాలని, లేదంటే పార్టీ నుండి బర్తరఫ్ చేస్తామని పార్టీ అధిష్టానం ఆదేశాలు జారీ చేయటంతో కొండా కపుల్ రాజకీయ భవితవ్యం గందరగోళంలో పడింది. కూతురు చేసిన వ్యాఖ్యలు కొండా సురేఖ రాజకీయ జీవితాన్ని మార్చేస్తుంది అన్న చర్చ స్థానికంగా జోరుగా సాగుతోంది.
కూతురు పొలిటికల్ గ్రోత్ కోసం ప్రయత్నం చేసిన కొండా కపుల్
చాలా కాలంగా కొండా కపుల్ తమ కుమార్తె పొలిటికల్ ఎంట్రీ కోసం ప్రయత్నం చేస్తున్నారు. గతంలోనూ బీఆర్ఎస్ లో ఉన్న సమయంలో కూడా కొండా సుస్మితకు టికెట్ కావాలని అధిష్టానం మీద ఒత్తిడి తెచ్చారు. కొండా సుస్మిత తన తల్లిదండ్రుల రాజకీయ వారసత్వాన్ని కొనసాగించాలనే ఆలోచనతో పరకాల నియోజకవర్గంపై గంపెడు ఆశలు పెట్టుకుంది.

పరకాల టికెట్ ప్రకటన వివాదం.. కొండా సుస్మిత తీవ్ర వ్యాఖ్యలు
అయితే ఇటీవల సీఎం రేవంత్ పరకాలలో మళ్ళీ టికెట్ రేవూరి ప్రకాష్ రెడ్డికే అని ప్రకటన చేయటంతో సుస్మిత ఆశలమీద నీళ్ళు చల్లినట్టు అయ్యింది. దీంతో పొలిటికల్ ఫ్యూచర్ పైన ఆందోళనలో ఉన్న కొండా సుస్మిత సీఎం రేవంత్ రెడ్డిని తీవ్రస్థాయిలో టార్గెట్ చేశారు. సీఎంపై సుస్మిత చేసిన విమర్శలు పార్టీలో తీవ్ర అలజడి సృష్టించాయి. దీనితో కొండా సురేఖపై షోకాజ్ నోటీసు, పదవి నుంచి తొలగించాలనే డిమాండ్లు వచ్చాయి.
కూతురు వ్యాఖ్యలను ఖండించని కొండా కపుల్
అయితే కొండా దంపతులు తమ కుమార్తె చేసిన వ్యాఖ్యలకు తాము బాధ్యులు కాదని, ఆమె స్వతంత్ర వ్యక్తి అని స్పష్టం చేశారు. వారు కొండా సుస్మిత వ్యాఖ్యలను ఖండించి ఉంటే పరిస్థితి మరోలా ఉండేది. కానీ కొండా సుస్మిత వ్యాఖ్యలను ఖండించలేదు. ఒకవేళ అదే చేస్తే కూతురికి రాజకీయంగా అనవసరపు ఇబ్బంది వస్తుందని, కూతురి కోసం పోరాటమే చెయ్యాలని నిర్ణయం తీసుకున్నారు.
కూతురి రాజకీయ భవితవ్యం కోసం తమ రాజకీయ జీవితం పణంగా పెట్టిన కొండా
కూతురి రాజకీయ భవిష్యత్తును రక్షించుకునేందుకు చివరకు వారి రాజకీయ జీవితాన్నే పణంగా పెట్టారు. సీఎం రేవంత్ తో పాటు, రేవంత్ క్యాబినెట్ లో బలమైన ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క, పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి వంటి వారిపై ఆరోపణలు చేసి అధిష్టానం వద్దే ధిక్కార స్వరం వినిపించారు. ఫలితంగా పార్టీ నుండి బయటకు వచ్చే పరిస్థితి తెచ్చుకున్నారు. ఇదంతా కూతురి రాజకీయ భవితవ్యం కోసమే చేసినట్టు భావిస్తున్నారు.
కూతురికి స్వతంత్ర రాజకీయ వేదికను సిద్ధం చేయాలని కొత్త ఆలోచన
కొండా దంపతులు తమ సుదీర్ఘ రాజకీయ అనుభవం, బీసీ వర్గాల్లోని బలం, ప్రజా మద్దతును ఉపయోగించి కూతురికి స్వతంత్ర రాజకీయ వేదికను సిద్ధం చేయాలని భావిస్తున్నట్టుగా కూడా చర్చ జరుగుతోంది. కొత్త వేదిక ద్వారా ఆమెకు అవకాశం కల్పించాలనే ఆలోచన ఉందని వారి సన్నిహితులు చెబుతున్నారు. బీసీల ఆత్మగౌరవం, ప్రాతినిధ్యం అజెండాగా కొత్త రాజకీయ శక్తిని నిర్మించే ప్రయత్నం కూడా ఈ కోణంలోనే చూడవచ్చు.
బిడ్డ కోసం ఎవరూ చేయని రిస్క్ చేసిన కొండా దంపతులు
తల్లిదండ్రులు తమ బిడ్డ రాజకీయ భవిష్యత్తు కోసం తమ పదవి, పార్టీలోని స్థానం, దశాబ్దాలుగా నిర్మించుకున్న రాజకీయ జీవితాన్ని రిస్క్ చేయటం మామూలు విషయం కాదు. కానీ కొండా దంపతులు ఈ రిస్క్ చేశారు. మరి వీరి పొలిటికల్ ఫ్యూచర్ ఎలా ఉంటుందో కాలమే నిర్ణయిస్తుంది.












Click it and Unblock the Notifications