ఆ రెండు పదవులలో ఏదైనా నాకు ఓకే .. దిగ్విజయ్ సింగ్కు కొండా సురేఖ లేఖ
తెలంగాణ ప్రాంత కాంగ్రెస్ పార్టీలో పంచాయతీ తీర్చడం కోసం వచ్చిన దిగ్విజయ్ సింగ్ ఇక్కడ సీనియర్ నాయకులతో మాట్లాడి, సయోధ్య కుదిర్చే ప్రయత్నం చేసి, తన వంతుగా చెప్పవలసింది చెప్పి వెళ్లిపోయారు. అయినప్పటికీ తెలంగాణ ప్రాంతంలో ఉన్న కాంగ్రెస్ పార్టీ నాయకులలో పదవుల పంచాయతీ నివురుగప్పిన నిప్పులా ఉన్న విషయం తెలిసిందే. ఇక ఇదే సమయంలో ఇటీవల తెలంగాణకు వచ్చి వెళ్లిన దిగ్విజయ్ సింగ్ కు కాంగ్రెస్ పార్టీ ఫైర్ బ్రాండ్ కొండా సురేఖ తాజాగా ఓ లేఖ రాశారు. ఆ లేఖలో తనకు కాంగ్రెస్ పార్టీలో రెండు పదవులను ప్రస్తావిస్తూ, ఏ పదవి తనకిచ్చినా న్యాయం చేస్తా అంటూ పేర్కొన్నారు.

దిగ్విజయ్ సింగ్ కు కొండా సురేఖ లేఖ
దిగ్విజయ్ సింగ్ కు కొండా సురేఖ తను రాసిన లేఖలో తెలంగాణ రాష్ట్రంలో పనిచేసిన మాజీ మంత్రి గా తన అభిప్రాయాలను తెలియజేస్తూ, తనకు తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ లో స్థానం కల్పించాలని పేర్కొన్నారు. ఈ లేఖలో ఆమె దిగ్విజయ్ సింగ్ తెలంగాణ రాష్ట్రానికి వచ్చిన సమయంలో తాను కలవలేకపోయాను అని, వ్యక్తిగతంగా వచ్చి తాను మాట్లాడాలని భావించినప్పటికీ తాను అనారోగ్య కారణాలతో కలవలేకపోయాను అని పేర్కొన్నారు. అంతేకాదు 1995 లో రాజకీయాలను ప్రారంభించిన తాను నాలుగుసార్లు ఎమ్మెల్యేగా పని చేశానని, ఒకసారి మంత్రిగా పని చేశానని, 27 సంవత్సరాల రాజకీయ జీవితంలో ఎన్నో మంచి పనులు చేశానని పేర్కొన్నారు.

తనకు ఆ రెండు పదవుల్లో ఏదో ఒకటి ఇవ్వండి
తన భర్త కొండా మురళీధర్ రావు రెండుసార్లు ఎమ్మెల్సీగా సేవలందించారని, ఆయన చేసిన మంచి పనుల వల్ల ఒకసారి ఆయన ఏకగ్రీవంగా ఎన్నికయ్యారని పేర్కొన్నారు. తాను పద్మశాలి కుటుంబం నుంచి వచ్చారని, తన భర్త మున్నూరు కాపు కులానికి చెందిన వారని, బిసి కులాలకు చెందిన తమకు బిసి ఓటర్ల మద్దతు ఉందని పేర్కొన్నారు. కొండా దంపతులుగా అందరితో పిలిపించుకునే తాము అటు ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రెండు రాష్ట్రాలలోనూ మంచి పేరు సంపాదించామని కొండా సురేఖ తన లేఖలో పేర్కొన్నారు. తనకు పొలిటికల్ అఫైర్స్ కమిటీ లో సభ్యురాలిగా అవకాశం కల్పించినందుకు ధన్యవాదాలు అని పేర్కొన్న ఆమె, తనకు ఉన్న రాజకీయ అనుభవాన్ని దృష్టిలో పెట్టుకొని తనకు ఏఐసిసి సెక్రటరీగా కానీ, వర్కింగ్ ప్రెసిడెంట్ గా కానీ అవకాశం ఇవ్వాలని విజ్ఞప్తి చేశారు.

తనకు అవకాశం కల్పిస్తే వంద శాతం పని చేస్తా
పొలిటికల్ అఫైర్స్ కమిటీకి రాజీనామా చేసిన సమయంలో తాను ఈ విషయాన్ని రేవంత్ రెడ్డి దృష్టికి కూడా తీసుకు వెళ్లానని కొండా సురేఖ ఈ లేఖలో పేర్కొన్నారు. దాదాపు మూడు దశాబ్దాల రాజకీయ అనుభవం ఉన్న తనకు అవకాశం కల్పిస్తే మహిళా సాధికారత కోసం కృషి చేస్తానని, కాంగ్రెస్ పార్టీలో ఉన్న మహిళా నాయకులు మాత్రమే కాకుండా అందరు గర్వపడేలా పని చేస్తానని పేర్కొన్నారు. తనకు ఉన్న నెట్వర్క్ ను దృష్టిలో పెట్టుకొని, ప్రజాక్షేత్రంలో తనకున్న ప్రజా మద్దతును దృష్టిలో పెట్టుకొని తనకు ఏఐసిసి సెక్రటరీగా కానీ, పీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ గా కానీ అవకాశం ఇస్తే, తాను వంద శాతం ఇచ్చిన బాధ్యతను సక్రమంగా నిర్వహిస్తామని పేర్కొన్నారు.

ముందస్తు ఎన్నికల వేళ కాంగ్రెస్ గెలుపే లక్ష్యంగా పని చేస్తా
తాను కేసీఆర్ ముందస్తు ఎన్నికలకు వెళతారనే విషయాన్ని విన్నానని, కాంగ్రెస్ పార్టీని గెలిపించడానికి తనకు అవకాశం ఇవ్వాలని విజ్ఞప్తి చేస్తున్నానని కొండా సురేఖ దిగ్విజయ్ సింగ్ కు లేఖ రాసిన లేఖలో పేర్కొన్నారు. సోషల్ మీడియాలో ఈ లేఖను పోస్ట్ చేసిన కొండా సురేఖ , ఇక ఈ లేఖను రాహుల్ గాంధీ, ప్రియాంకా గాంధీ, ఏఐసిసి లకు కూడా కొండా సురేఖ ట్యాగ్ చేశారు.












Click it and Unblock the Notifications