Huzurabad by-poll : పోటీ చేసి కొండా సురేఖ .. రిస్క్ చెయ్యరేమో, కారణాలివే !!
హుజూరాబాద్ నియోజకవర్గంలో ఈటల రాజేందర్ రాజీనామాతో అనివార్యంగా మారిన హుజురాబాద్ నియోజకవర్గ ఉప ఎన్నిక అధికార ప్రతిపక్ష పార్టీలకు ఇప్పుడు సవాల్ గా మారింది. ఒకపక్క హుజూరాబాద్ నియోజకవర్గంలో టిఆర్ఎస్ పార్టీ మంత్రులు, నేతలు మకాం వేసి మరీ టిఆర్ఎస్ పార్టీ అభ్యర్థిని గెలిపించాలని ఇప్పటి నుంచే ప్రచార పర్వానికి తెర తీస్తే, బిజెపి నుంచి ఎన్నికల బరిలోకి దిగుతున్న ఈటల రాజేందర్ తిరిగి తన స్థానాన్ని దక్కించుకోవడానికి పెద్ద పోరాటమే చేస్తున్నారు. కానీ కాంగ్రెస్ పార్టీ మాత్రం ఇప్పటివరకు హుజూరాబాద్ నియోజకవర్గం నుంచి బరిలోకి దిగే అభ్యర్థిని ప్రకటించకపోవడంపై రాజకీయ శ్రేణుల్లో ఆసక్తికర చర్చ జరుగుతోంది.

హుజురాబాద్ లో పాగా వేసి ఎన్నికల ప్రచారం చేస్తున్న మంత్రులు
హుజూరాబాద్ నియోజకవర్గంలో ఎన్నికల రాజకీయాలు రసవత్తరంగా సాగుతున్నాయి. హుజురాబాద్ నియోజకవర్గాన్ని ఎలాగైనా తమ ఖాతాలో వేసుకోవాలని భావిస్తున్న సీఎం కేసీఆర్ ఆగస్టు 16వ తేదీన బహిరంగ సభ నిర్వహించి స్వయంగా రంగంలోకి దిగనున్నారు. ఇప్పటికే ట్రబుల్ షూటర్ హరీష్ రావు హుజూరాబాద్ నియోజకవర్గంలో పెద్ద ఎత్తున పర్యటిస్తూ ఈటలకు చెక్ పెట్టే ప్లాన్ చేస్తున్నారు. మంత్రులు గంగుల కమలాకర్, కొప్పుల ఈశ్వర్, ఎర్రబెల్లి దయాకర్ రావు, ఎంపీలు, ఎమ్మెల్యేలు ఇలా ప్రతి ఒక్కరు హుజురాబాద్ నియోజకవర్గాన్ని చుట్టేస్తున్నారు. ఈటల రాజేందర్ ను ఓడించడానికి పెద్ద ఎత్తున పనిచేస్తున్నారు.

టీఆర్ఎస్ నేతల విమర్శలను తిప్పికొడుతున్న ఈటల
ఇప్పటికే బీజేపీ అభ్యర్థిగా తాను రాజీనామా చేసిన స్థానానికి ఎన్నికల బరిలో నిలిచిన ఈటల రాజేందర్ కూడా, టిఆర్ఎస్ పార్టీ నేతల విమర్శలను తిప్పికొడుతూ ప్రజల మద్దతు కోసం శాయశక్తులా కృషి చేస్తున్నారు. బిజెపి తెలంగాణ రథసారథి బండి సంజయ్, బిజెపి అగ్రనాయకులు ఈటల రాజేందర్ కు మద్దతుగా నియోజకవర్గంలో ప్రజల మద్దతును కూడగట్టడానికి కృషి చేస్తున్నారు. ఇక ఇదే సమయంలో కాంగ్రెస్ పార్టీ మాత్రం అభ్యర్థిని కూడా ప్రకటించకుండా మీనమేషాలు లెక్కిస్తోంది.ఈ పరిణామాలు కాంగ్రెస్ పార్టీ శ్రేణులకు మింగుడు పడడం లేదు.

హుజురాబాద్ ఉప ఎన్నిక బరిలో కొండా సురేఖ కష్టమే .. ఎందుకంటే
కాంగ్రెస్ పార్టీ నుండి హుజురాబాద్ ఉప ఎన్నికల బరిలో కొండా సురేఖను దింపుతున్నారు అన్న వార్తల నేపథ్యంలో ఆసక్తికర చర్చ జరుగుతోంది. ఇప్పటికే కొండా సురేఖ గత ఎన్నికలకు ముందు టిఆర్ఎస్ పార్టీని వీడి తిరిగి కాంగ్రెస్ గూటికి చేరారు. కాంగ్రెస్ పార్టీ నుండి పరకాల నియోజకవర్గంలో ఎన్నికల బరిలోకి దిగిన ఆమె చల్లా ధర్మారెడ్డి మీద పోటీ చేసి ఓడిపోయారు. ఆ సమయంలోనే చల్లా ధర్మారెడ్డి ని, టిఆర్ఎస్ ను ఎదుర్కోవడానికి కొండా సురేఖ పడరాని పాట్లు పడ్డారు. అంతకు ముందు వరంగల్ తూర్పు నియోజకవర్గం నుండి ఎమ్మెల్యేగా గెలిచిన సురేఖ, తూర్పు నియోజకవర్గం నుంచి పోటీ చేయకుండా పరకాల నియోజక వర్గం నుండి పోటీ చేయడం, పరకాలలో ఆమెకు పట్టు తగ్గడంతో ఓటమి పాలయ్యారు. టీఆర్ఎస్ అధికార పార్టీ కావటంతో, కాంగ్రెస్ మొన్నటివరకు అంపశయ్య మీద ఉండటంతో స్థానికంగా పట్టు పెంపొందించుకోవడానికి కూడా వీలు కాని పరిస్థితి నెలకొంది.

రేవంత్ రెడ్డికి టీపీసీసీ రావటంతో రాజకీయంగా పుంజుకునే యత్నం చేసిన సురేఖ
రేవంత్ రెడ్డికి కాంగ్రెస్ పార్టీ తెలంగాణ రథసారథి గా పగ్గాలు అప్పజెప్పక ముందు పార్టీ పరిస్థితి రాష్ట్రంలో దయనీయంగా తయారైంది. ఇదే సమయంలో కాంగ్రెస్ పార్టీ పెట్టిన కొండా సురేఖ కూడా స్థానికంగా కొంత వీక్ అయినట్లుగా తెలుస్తుంది. ఇక ఇప్పుడు రేవంత్ రెడ్డి రాకతో తిరిగి వరంగల్ జిల్లా రాజకీయాలలో పుంజుకోవాలని ప్రయత్నం చేస్తున్న కొండా సురేఖ రేవంత్ రెడ్డికి తన మద్దతు ప్రకటించి, రేవంత్ నాయకత్వంలో పని చేయడానికి రెడీ అయ్యారు. అయితే ఈ క్రమంలోనే హుజురాబాద్ ఉప ఎన్నికల బరిలోకి కొండా సురేఖ దిగుతారనే వార్త జిల్లాలో హాట్ టాపిక్ గా మారింది.

హుజురాబాద్ లో కొండా సురేఖ రిస్క్ చెయ్యరని టాక్
ఇప్పటికే చావు తప్పి కన్ను లొట్ట పోయినట్లు రాజకీయంగా బలహీనమైన కొండా సురేఖ హుజురాబాద్ నియోజకవర్గంలో పోటీ చెయ్యరు అని స్థానికంగా చర్చ జరుగుతోంది. వరంగల్ రాజకీయాల్లోనే బలమైన పాత్ర పోషించాలని, స్థానికంగా బలోపేతం కావడం పైనే దృష్టి సారించే ఆమె హుజూరాబాద్ నియోజకవర్గం లో పోటీపై ఆసక్తి చూపించే అవకాశం లేదని భావిస్తున్నారు. ఇదే సమయంలో అటు టిఆర్ఎస్, ఇటు బిజెపి హుజురాబాద్ ఉప ఎన్నిక పోరును కీలకంగా తీసుకుంటూ పోరాటానికి దిగిన సమయంలో కాంగ్రెస్ పార్టీ నుండి ఎన్నికల బరిలోకి దిగడం ఒకింత ఖర్చుతో కూడుకున్న వ్యవహారమే కాకుండా, రిస్క్ తో కూడుకున్న వ్యవహారం కూడా కావడంతో, కొండా సురేఖ పోటీ చేసే అవకాశం లేదని స్థానికంగా భావిస్తున్నారు.

కాంగ్రెస్ నుండి పోటీకి ఆలోచిస్తున్న నేతలు .. కొండా పోటీ చేస్తే సాహసమే !!
ఒక కొండా సురేఖ మాత్రమే కాదు కాంగ్రెస్ పార్టీ నుండి ఎవరు ఎన్నికల బరిలోకి దిగాలన్నా ఆలోచిస్తున్న పరిస్థితి ఉంది. హుజరాబాద్ నియోజకవర్గం లో వార్ ఈటల వర్సెస్ కెసిఆర్ అన్నట్టుగా ఉన్న సమయంలో పోటీ చేస్తే దెబ్బతింటామనే భావన కాంగ్రెస్ పార్టీ నేతలలో ఉన్నట్లుగా సమాచారం. కాంగ్రెస్ పార్టీలో కీలకంగా ఉన్న నేతలు కూడా వెనుకడుగు వేయడానికి ఇదే కారణమని చెప్తున్నారు. ఒకవేళ పోటీ చేసి, ఎన్నికల్లో దెబ్బతింటే తిరిగి ఆమె కోలుకోవడం కష్టమవుతుంది అంటూ చర్చిస్తున్నారు. కొండా దంపతులు ఎప్పుడూ తాము పోటీ చేసే నియోజకవర్గంపైనే ప్రధానంగా దృష్టిపెట్టి పనిచేస్తారని, ప్రస్తుతం వారు ఉన్న పరిస్థితులలో హుజురాబాద్ నుంచి ఎన్నికల బరిలోకి దిగే సాహసం చెయ్యరని రాజకీయ విశ్లేషకుల అంచనా.
-
అన్నా - చెల్లి కాస్తా.. భార్యాభర్తలు అయ్యారుగా ??? -
ఏపీలో ఇంటర్ ఫలితాల విడుదలపై బోర్డు తాజా నిర్ణయం, మార్కుల్లో ఈ సారి కొత్తగా..!! -
IPL 2026: కొంపముంచిన బుడ్డోడు.. రాజస్థాన్ను చిత్తు చేసిన SRH! -
రాజ్యసభకు టీడీపీ, బీజేపీ నుంచి ఊహించని అభ్యర్దులు- జనసేన నుంచి ఆయనే..!! -
అండగా నిలిచిన భారత్ కు థ్యాంక్స్: ఇరాన్ సంచలన ప్రకటన -
మూడేళ్లకోసారి వచ్చినా.. పెట్టిన 150 రూపాయలకు న్యాయం చేస్తావ్ అన్నా.. -
ఒంటి పూట బడుల వేళల్లో మార్పు, ఇక నుంచి..!? -
నిర్మాతలకు స్టార్ హీరోయిన్ బంపరాఫర్! -
10th Class Results అప్పుడే..! పది ఫలితాలపై కీలక ప్రకటన -
West Bengal Survey: బీజేపీ అంతర్గత సర్వేలో షాకింగ్- ఎన్ని సీట్లో తెలుసా ? -
రేషన్ సరఫరా లో కీలక మార్పులు, తాజా మార్గదర్శకాలు..!! -
మూడు పండుగలకు రెగ్యులర్ గా మూడు ఉచిత సిలిండర్ల పంపిణీ + రూ.2,000












Click it and Unblock the Notifications