ఎఫ్ఆర్ఓ శ్రీనివాసరావు హత్య కేసు: ఇద్దరు నిందితులకు జీవిత ఖైదు విధించిన కోర్టు
ఖమ్మం: ఫారెస్ట్ రేంజ్ ఆఫీసర్(FRO) శ్రీనివాస్ రావును గుత్తికొయలు హత్య కేసులో ఇద్దరు నిందితులకు భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కోర్టు జీవిత ఖైదు విధించింది. ఈ కేసులో మడకం తుల, మిడీయం నంగాలను కోర్టు దోషులుగా తేల్చింది. వారికి జీవిత ఖైదుతోపాటు రూ. 1000 జరిమానా విధించింది.
గత సంవత్సరం నవంబర్ నెలలో చండ్రగొండ మండలం బెండాళపాడు గ్రామ పంచాయతీ ఎర్రబోడు అటవీ ప్రాంతంలో ఫారెస్ట్ ప్లాంటేషన్ పనులను పరిశీలించడానికి ఫారెస్ట్ రేంజ్ ఆఫీసర్ చలమల శ్రీనివాసరావు వెళ్లారు. అయితే అక్కడ ఎర్రబోడు గ్రామానికి చెందిన గొత్తి కోయలు ఆయనపై కొడవళ్లతో దాడి చేశారు.

మడకం తుల, మిడియం నంగా అనే వ్యక్తులు అతి దారుణంగా శ్రీనివాసరావును వేట కొడవళ్ళతో గొంతు కోసి హత్య చేశారు. ఇద్దరు నిందితులకు గురువారం భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ప్రధాన న్యాయమూర్తి పాటిల్ వసంత్ జీవిత ఖైదు తో పాటు ఇద్దరికీ చెరొక వెయ్యి రూపాయలు జరిమానా విధిస్తూ తీర్పు ఇచ్చారు.
కాగా, నిందితులపై గతంలో చండ్రుగొండ పోలీస్ స్టేషన్లో కేసు నమోదు చేశారు.ఆ తర్వాత ఈ కేసులోని నిందితులు మడకం తుల, మిడియం నంగాలను పోలీసులు వెంటనే అరెస్టు చేసి కోర్టుకు తీసుకెళ్లారు. అయితే హత్య చేసిన ఇద్దరు నిందితులకు త్వరగా శిక్ష పడే విధంగా పోలీస్ అధికారులు, సిబ్బంది బాగా కృషి చేశారని భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఎస్పీ వినిత్ అన్నారు.
నేరం చేసిన వారికి కచ్చితంగా చట్టపరంగా శిక్ష పడుతుందని పేర్కొన్నారు. అయితే ఫారెస్టు అధికారి శ్రీనివాస రావు హత్య తర్వాత గొత్తి కోయలపై తీవ్ర వ్యతిరేకత వచ్చింది. అధికారిని హత్య చేయడాన్ని ఖండించారు. సీఎం కేసీఆర్ కూడా అటవీశాఖ అధికారులపై దాడులు చేసిన వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని ఘటన అనంతరం హెచ్చరించిన విషయం తెలిసింది.












Click it and Unblock the Notifications