క్షుద్రపూజ: స్త్రీల దుస్తులిప్పేసి స్వామీజీ ఏమేమో చేస్తాడు
వరంగల్: మహిళలకు క్షుద్రపూజలు చేసే ముఠా గుట్టు రట్టు చేసేందుకు వరంగల్ జిల్లా మానుకోట పోలీసులు ప్రయత్నిస్తున్నారు. మానుకోట ప్రాంతానికి చెందిన పలువురు మహిళలు ముఠా వలలో ఎలా చిక్కుకున్నారనే విషయంపై పోలీసులు ఆరా తీస్తున్నారు. ఇప్పటికే ఈ వ్యవహరంలో ఆరుగురిపై టౌన్ పోలీసులు కేసు నమోదు చేయగా తాజాగా మరో ఇద్దరిని అదుపులోకి తీసుకుని ప్రశ్నిస్తున్నారు.
ఆదిలాబాద్ జిల్లా మంచిర్యాల కేంద్రంగా ఓ స్వామిజీ ఈ ముఠాను నడిపిస్తున్నాడని, అతను మహారాష్ట్రకు చెందినవాడని పోలీసుల దర్యాప్తులో తేలినట్లు తెలిసింది. ఇక్కడి నుంచి ఎంతమంది మహిళలను స్వామిజీ వద్దకు తీసుకెళ్లారనే విషయాన్ని తమ అదుపులో ఉన్న మహిళలు, ఇతరుల నుంచి పోలీసులు వివరాలు సేకరిస్తున్నారు.
గిరిప్రసాద్నగర్కు చెందిన మహబూబీ అనే మహిళ నేతృత్వం వహిస్తూ పలువురు మహిళలను మభ్యపెట్టేందుకు ప్రయత్నించినట్లు సమాచారం. మహబూబీ అనే మహిళ సోదరి ఒకరూ మంచిర్యాలలో ఉంటుందని, ఆమె అక్కడి స్వామిజీ ముఠాలో సభ్యురాలిగా వ్యవహరిస్తున్నట్లు తెలిసింది.

ఆమెతోనే మహబూబీ అదే కాలనీకి చెందిన సుల్తానాబీ, రహీమున్నీసా, గూడూరు మండలం అప్పరాజుపల్లి గ్రామానికి చెందిన ఇమాంపాషా, శ్రీరాములు కలసి ఇక్కడి మహిళలను మభ్యపెడుతున్నట్లు సమాచారం. ముఖ్యంగా పొడువైన జుట్టు, అందంగా, ఎత్తుగా ఉన్న వారిని టార్గెట్ చేస్తున్నారు. వారికి ఆర్థిక, అనారోగ్య, కుటుంబ సమస్యలు ఉంటే వారినే తేలిగ్గా ట్రాప్ చేస్తున్నారు.
వారి అరచేతులను చూసి అరచేతి రేఖల్లో లక్ష్మి తాండవిస్తుందని, లక్ష్మి దేవికి పూజలు చేస్తే మీ సమస్యలన్నీ తీరుతాయని, లక్ష్మీదేవి ధనరూపంలో తలపై కురుస్తుందని, అలా కురిసిన ధనంలో తమకు సగం వాటా ఇవ్వాల్సి ఉంటుందని మారు నమ్మబలుకుతున్నారు.
వారిని నమ్మించి మంచిర్యాల వరకు తీసుకువెళ్లిన వారిని వివస్త్రలుగా చేసి స్వామిజీనే ఒళ్లంతా నూనె, పసుపు రాసి వారిని మాట్లాడనివ్వకుండా ఏవో నీళ్లు చల్లుతాడంటూ ఓ బాధితురాలు వివరించినట్లు మీడియాలో వార్తలు వచ్చాయి. ఆతర్వాత వారి చుట్టూ తిరుగుతూ క్షుద్రపూజలు చేస్తుంటాడని వివరించింది. అయితే అదృష్టవశాత్తు అక్కడి నుంచి తప్పించుకుని వచ్చానని.. లేకుంటే తన ప్రాణాలు తీసేవాడని పేర్కొంది.
ఆదిలాబాద్ జిల్లా మంచిర్యాల ప్రాంతంలో మానుకోటకు గిరిప్రసాద్ నగర్ కాలనీకి చెందిన మహిళను తీసుకెళ్లి అక్కడ క్షుద్రపూజలు నిర్వహించిన ఘటనపై బాధిత మహిళ అక్కడి పోలీసులకు ఫిర్యాదు చేయడంతో అక్కడి పోలీసులు కూడా కేసులు నమోదు చేసేందుకు రంగం సిద్ధమైనట్లు తెలిసింది.
అంతేకాక ఇక్కడ మరో బాధిత మహిళ ఇచ్చిన ఫిర్యాదుతో మానుకోట టౌన్ పోలీసు స్టేషన్లో ఆరుగురిపై కేసులు నమోదు అయ్యాయి. వారిలో ముగ్గురు మహిళలను ఇప్పటికే అదుపులోకి తీసుకోగా మరో ఇద్దరు పురుషులను కూడా అదుపులోకి తీసుకుని ప్రశ్నిస్తున్నారు.
కాగా, ఈ కేసును ఛేదించేందుకు టౌన్ ఎస్సై ప్రసాదరావు నేతృత్వంలో ప్రత్యేక పోలీసు బృందం మంచిర్యాలకు బయలుదేరనుంది. ఈ కేసులో పూర్తి వివరాలను రాబట్టాలంటే స్వామిజీని విచారిస్తేనే తెలిసే అవకాశం ఉంది. మొత్తం మీద కొత్త తరహాలో మహిళలను మోసగిస్తున్న ముఠా గుట్టు విప్పేందుకు పోలీసులు ప్రతిష్టాత్మకంగా తీసుకుని దర్యాప్తును వేగవంతం చేస్తున్నారు.












Click it and Unblock the Notifications