గెడ్డాలు పెంచుకుంటే సీఎం కాలేరు: ఆయనకు మంత్రి కేసీఆర్ కౌంటర్
వరంగల్: తెలంగాణ రాష్ట్ర మంత్రి కల్వకుంట్ల తారక రామారావు బుధవారం నాడు తెలంగాణ పీసీసీ అధ్యక్షులు ఉత్తమ్ కుమార్ రెడ్డికి గట్టి కౌంటర్ ఇచ్చారు. గడ్డాలు పెంచుకుంటే ముఖ్యమంత్రి కాలేరని ఎద్దేవా చేశారు.
కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చే దాకా తాను గడ్డం తీయనని ఇటీవల ఉత్తమ్ ప్రతిజ్ఞ చేసిన విషయం తెలిసిందే. దీనిపై కేటీఆర్ స్పందించారు.
అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాల అమల్లో తెలంగాణ ముందు వరుసలో నిలుస్తోందన్నారు. కొత్త రాష్ట్రం అవతరించి రెండున్నరేళ్లు కూడా గడవకుండానే ఎన్నో సవాళ్లను అధిగమించామని, రాష్ట్రాన్ని ప్రగతి బాటన పయనింపచేస్తున్నామన్నారు. కొత్త జిల్లాలను ఏర్పరచి పాలనను వికేంద్రీకరించామన్నారు.

రూ.2వేల కోట్లతో హైదరాబాద్కు దీటుగా వరంగల్ నగరాన్ని అభివృద్ధి చేస్తామని చెప్పారు. తెలంగాణ సాధన కోసం కష్టపడిన పార్టీ కార్యకర్తలందరికీ న్యాయం చేస్తామన్నారు. రాబోయే రోజుల్లో పెద్దసంఖ్యలో నామినేటెడ్ పదవులు రానున్నాయని చెప్పారు.
వరంగల్లో త్వరలో ఏర్పాటయ్యే టెక్స్టైల్ పార్క్ ద్వారా వేల మందికి ఉపాధి లభిస్తుందన్నారు. రాష్ట్రంలో జరుగుతున్న అభివృద్ధిని చూసి ఓర్వలేకే కొందరు అనవసర ఆరోపణలు చేస్తున్నారన్నారు. కాంగ్రెస్ నేతల పాలనతో విసుగు చెందిన ప్రజలు పాలనా పగ్గాలు తెరాసకు అప్పగించారన్నారు. గడ్డాలు పెంచుకుంటే ముఖ్యమంత్రి కాలేరన్నారు. దేశంలో ఏ సర్వే చేసినా కేసీఆర్ను నంబర్ వన్గా నిలుస్తున్నారన్నారు.
కాగా, వరంగల్ పట్టణాభివృద్ధి సంస్థ ఛైర్మన్గా మర్రి యాదవ రెడ్డి బాధ్యతలు స్వీకరించారు. ఈ కార్యక్రమానికి మంత్రులు కేటీఆర్, కడియం శ్రీహరి, ఈటెల రాజేందర్, వరంగల్ మేయర్ నన్నపనేని నరేందర్ తదితరులు హాజరయ్యారు.












Click it and Unblock the Notifications