కోతల ప్రచారం నమ్మొద్దు: విపక్షాలపై కెటిఆర్
కరీంనగర్: అర్హులందరికీ పింఛన్లు ఇస్తామని మంత్రి కె తారక రామారావు అన్నారు. శనివారం ఆయన కరీంనగర్లో ఆసరా పథకం సందర్భంగా మీడియాతో మాట్లాడారు. ఆధార్ లేకున్నా అర్హత ఉన్న ప్రతీ ఒక్కరికి పింఛను అందజేస్తామని చెప్పారు. పింఛన్లలో కోత పెడుతున్నారన్న విపక్షాల ప్రచారాన్ని నమ్మొద్దని అన్నారు.
విద్యుత్ సమస్యలు, రైతుల ఆత్మహత్యలపై టిడిపి అనవసరంగా ఆందోళన చేస్తుందని కోపం అయ్యారు. తెలంగాణ టిడిపి నేతలు ఏపి సిఎం చంద్రబాబు కనుసైగల్లో పని చేస్తున్నారన్నారు. తెలంగాణలో ధర్నాలు, బస్సు యాత్రలు చేసే నైతిక హక్కు టీ టీడీపీ నేతలకు లేదని చెప్పారు.
నాలుగేళ్లలో వాటర్ గ్రిడ్ పూర్తి చేస్తామని చెప్పారు. నీరు, బొగ్గు ఉన్నా విద్యుత్ కొరతకు టిడిపి, కాంగ్రెస్ పార్టీలే కారణమని దుయ్యబట్టారు. సీఎం కేసీఆర్తోనే బంగారు తెలంగాణ సాధ్యమని ప్రజలు తమకు ఓట్లేశారని పేర్కొన్నారు. తమది పేదల ప్రభుత్వమని మరోసారి పునరుద్ఘాటించారు.
పింఛన్లను పెంచిన ఘనత మాదే : నాయిని
హైదరాబాద్: పింఛన్లను రూ. 200 నుంచి రూ. 1000కి పెంచిన ఘనత తమ ప్రభుత్వానిదే అని హోంమంత్రి నాయిని నర్సింహారెడ్డి పేర్కొన్నారు. ముషీరాబాద్ తహసీల్దార్ కార్యాలయంలో నాయిని ఆసరా పథకాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా నాయిని మాట్లాడుతూ.. రెండు నెలల్లో పింఛన్లు బ్యాంక్ ఖాతాల్లోనే జమ అయ్యేలా చూస్తామన్నారు. పింఛన్ల కోసం దళారులను ఆశ్రయించొద్దని సూచించారు.
పేదలకు అండగా ఉంటాం : హరీష్రావు
మెదక్: టీఆర్ఎస్ ప్రభుత్వం పేదలకు అండగా ఉంటుందని నీటి పారుదల శాఖ మంత్రి హరీష్రావు స్పష్టం చేశారు. అర్హులైన ప్రతి ఒక్కరికీ పెన్షన్ ఇస్తున్నామని పేర్కొన్నారు. త్వరలోనే ఆహార భద్రత కార్డులు జారీ చేస్తామన్నారు. లబ్ధిదారుల ఎంపిక పారదర్శకంగా జరుగుతుందన్నారు. డిసెంబర్ 6 నుంచి రేషన్ బియ్యం కోటా పెంచి పంపిణీ చేస్తామన్నారు.
ప్రజల సంక్షేమమే ధ్యేయం : రాజయ్య
వరంగల్: తెలంగాణ ప్రజల సంక్షేమమే తమ ధ్యేయమని డిప్యూటీ సీఎం రాజయ్య స్పష్టం చేశారు. తెలంగాణ వస్తే ఏం చేస్తారని గతంలో కొందరు తెలివి లేని నాయకులు ప్రశ్నించారని గుర్తు ఆయన చేశారు. బడుగు, బలహీన వర్గాల వారి కోసం సంక్షేమ పథకాలు ప్రవేశపెడుతున్నామని చెప్పారు. ఎంత ఖర్చు అయినా సరే అర్హులకు పెన్షన్లు అందజేస్తామని రాజయ్య స్పష్టం చేశారు. పెన్షన్లు రాని వారు మరోసారి దరఖాస్తు చేసుకోవచ్చని తెలిపారు.