కామారెడ్డిలో చెల్లుతావా?: రేవంత్ రెడ్డిపై కేటీఆర్ సెటైర్లు
కామారెడ్డి: కొడంగల్లో నరేందర్ రెడ్డిపై ఓడిన టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి.. సీఎం కేసీఆర్పై కామారెడ్డిలో గెలుస్తారా? అని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మంత్రి కేటీఆర్ ఎద్దేవా చేశారు. మాచారెడ్డి, రామారెడ్డి మండలాల బీఆర్ఎస్ కార్యకర్తలతో ఆయన సమావేశమయ్యారు. ఎన్నికల ప్రచారంపై పార్టీ శ్రేణులకు దిశానిర్దేశం చేశారు. ఈ సందర్భంగా కేటీఆర్ మాట్లాడారు.
'కొడంగల్లో చెల్లని నువ్వు కామారెడ్డిలో చెల్లుతవా..?' అని రేవంత్ రెడ్డిని కేటీఆర్ ప్రశ్నించారు. 'సీఎం కేసీఆర్ కామారెడ్డి నుంచి పోటీ చేస్తానని చెప్పడంతో ప్రతిపక్షాల ఫ్యూస్లు ఎగిరిపోయాయి. కామారెడ్డి రాష్ట్రంలోనే మొదటి స్థానంలో నిలుస్తుంది. రాష్ట్రం మొత్తం కామారెడ్డి వైపు చూస్తున్నది. గంప గోవర్ధన్ ఆహ్వానం మేరకు సీఎం కేసీఆర్ కామారెడ్డి నుంచి పోటీ చేస్తున్నారు' అని కేటీఆర్ వ్యాఖ్యానించారు.

'ఒక నాయకునికి కావల్సింది ప్రాంతం అభివృద్ది, ప్రజల సంక్షేమం. రాష్ట్రంలోని 119 నియోజిక వర్గాల ప్రజలు కేసీఆర్ని అభిమానిస్తున్నారు. కామారెడ్డి నుంచి కేసీఆర్ పోటీ చేయడం మన అదృష్టం. ప్రభుత్వం వచ్చాక వచ్చే అరు నెలల్లో మద్దిమల్ల నుంచి మాచారెడ్డికి కాళేశ్వరం ద్వారా సాగునీరు తీసుకొస్తాం' అని కేటీఆర్ తెలిపారు.
'గిరిజన బిడ్డల పోడు భూములకు పట్టాలు ఇచ్చిన ఘనత కేసీఆర్ది. రాబోయే రోజుల్లో అర్హులందరి పోడు భూములకు పట్టాలు ఇస్తాం. 3,146 తండాలను గ్రామ పంచాయతీలుగా మార్చిన నాయకుడు కేసీఆర్. కామారెడ్డి కోసం రాబోయే రోజుల్లో ముఖ్యమంత్రి ప్రత్యేక కార్యాలయం ఏర్పాటు చేసి సమస్యలు పరిష్కారం చేస్తారు. కాంగ్రెస్, బీజేపీ నాయకులకు ఓటు వేస్తే తప్పు చేసిన వాళ్లం అవుతాం' అని కేటీఆర్ వ్యాఖ్యానించారు.
'సిమెంట్, సలకా ఇచ్చే నాయకులను నమ్మవద్దు. షబ్బీర్ అలీ కామారెడ్డి నుంచి పోటీ చేయడానికే భయపడుతున్నడు. రేవంత్ రెడ్డికి దమ్ముంటే కామారెడ్డి నుంచి పోటీ చేయాలి. కొడంగల్లో చెల్లని నువ్వు కామారెడ్డిలో చెల్లుతవా' అని మంత్రి ప్రశ్నించారు. కాంగ్రెస్, బీజేపీలకు ఓటు వేస్తే చీకటి రోజులు వస్తాయన్నారు. కాబట్టి ఆలోచించి ఓటు వేయాలని మంత్రి కేటీఆర్ సూచించారు.












Click it and Unblock the Notifications