కెటిఆర్ విడుదల చేసిన సెల్కాన్ కొత్త సిరీస్ స్నాప్డీల్లోనే, 'ఏరోస్పేస్పై కెసిఆర్ ఆసక్తి'
హైదరాబాద్: తెలంగాణ రాష్ట్ర ఐటీ, పంచాయతీరాజ్ శాఖ మంత్రి కల్వకుంట్ల తారక రామారావు మంగళవారం నాడు సెల్కాన్ కంపెనీ మేడ్చల్ ప్లాంటులో తయారు చేసిన సీటీ722 ట్యాబ్లెట్ను విడుదలచేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు.
మొబైల్ మ్యానుఫ్యాక్చరింగ్ హబ్గా తెలంగాణను తీర్చిదిద్దేందుకు రాష్ట్ర ప్రభుత్వం చిత్తశుద్ధితో కృషి చేస్తోందన్నారు. తెలంగాణ పెట్టుబడుల కేంద్రంగా విలసిల్లుతున్నదని, పారిశ్రామికవేత్తలకు ఇదే మంచి తరుణమన్నారు.
భారతదేశంలో అత్యున్నత టెక్నాలజీ ఉత్పత్తులు చేయగలమా అనే సందేహాలను పటాపంచలు చేసేలా 'మేడిన్ తెలంగాణ' ట్యాబ్లెట్ మార్కెట్లోకి రావడం సంతోషకరమన్నారు. అతి తక్కువ కాలంలోనే పదిలక్షల ఫోన్లు అమ్మడం సెల్కాన్ సత్తాకు నిదర్శనమన్నారు.
తెలంగాణలోనే ఆర్ అండ్ డీ కేంద్రాన్ని ఏర్పాటు చేయాలనే నిర్ణయాన్ని స్వాగతిస్తున్నట్లు చెప్పారు. ఉత్పత్తితోపాటు పరిశోధన, అభివృద్ధి కేంద్రం ఉన్నపుడే మార్కెట్ లీడర్గా ఎదగగలమన్నారు. అత్యున్నతమైన ప్రాసెసర్, అందుబాటులో ఉండే ధరలతో మార్కెట్లోకి తీసుకురావడం హర్షనీయమన్నారు.
తెలంగాణ సెల్ఫోన్ల తయారీ కేంద్రంగా మారటంలో వేగంగా ముందుకువెళ్తున్నదన్నారు. ఇప్పటికే సెల్కాన్, మైక్రోమ్యాక్స్ కంపెనీలు తమ తయారీ కేంద్రాన్ని ఏర్పాటు చేశాయని, తెలంగాణలో ప్రస్తుతం బూమ్ ప్రారంభమయిందన్నారు.
కొద్దికాలం తర్వాత ఇప్పటి ధరలలో భూములు అందుబాటులో ఉండటం కష్టం కాబట్టి పారిశ్రామికవేత్తల పెట్టుబడులకు ఇదే సరైన సమయమన్నారు. అమెజాన్, ఫ్లిప్కార్ట్ వంటి సంస్థల ఫుల్ఫిల్మెంట్ కేంద్రాలు ఇక్కడే ఉన్నాయని, అన్నిరంగాల్లో వృద్ధికి తెలంగాణలో అవకాశాలున్నాయన్నారు.
సెల్కాన్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ మురళి రేతినేని మాట్లాడుతూ... మేడ్చల్లోని కేంద్రంలోనే డిజైన్తోపాటు ఉత్పత్తి చేసినట్టు తెలిపారు. మంత్రి కేటీఆర్తో కలిసి తాము వేసిన ప్రతి అడుగు విజయవంతంగా సాగుతోందని సంతోషం వ్యక్తం చేశారు.
మేడ్చల్ కేంద్రంలో ఉత్పత్తి అయిన ఫోన్లను 12 దేశాలకు ఎగుమతి చేసేందుకు ప్రణాళికలు సిద్ధంగా ఉన్నట్లు ప్రకటించారు. ప్రస్తుతం విడుదల చేస్తున్న ట్యాబ్ ప్రత్యేకంగా స్నాప్డీల్లో మాత్రమే అందుబాటులో ఉన్నట్లు తెలిపారు. స్నాప్డీల్ ప్రతినిధి కరణ్ఖారా మాట్లాడుతూ.. మేడిన్ తెలంగాణ ట్యాబ్లెట్ మార్కెట్లోకి రావడం హర్షనీయమన్నారు.
తెలంగాణలో పెట్టుబడులకు అవకాశాలు: కెటిఆర్
తెలంగాణలో పెట్టుబడులకు చాలా అవకాశాలున్నాయని కెటిఆర్ బుధవారం అన్నారు. గ్లోబల్ సమ్మిట్లో కెటిఆర్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాట్లాడారు. ఏరోస్పేస్, డిఫెన్స్ రంగాలకు రాష్ట్రాన్ని అడ్డాగా మారుస్తామని చెప్పారు. ఏరోస్పేస్ పైన ముఖ్యమంత్రి కెసిఆర్ ఆసక్తిగా ఉన్నారని చెప్పారు.