మా తల్లిదండ్రులూ నిర్వాసితులే: బాధ తెలుసని కెటిఆర్, ‘మా తల్లి త్యాగం చేశారు’
కరీంనగర్: తమ తల్లిదండ్రులు కూడా భూములు కోల్పోయిన నిర్వాసితులేనని, నిర్వాసితుల బాధలు ఎలా ఉంటాయో తమ కుటుంబానికి తెలుసని ఐటి, పురపాలకశాఖ మంత్రి కెటి రామారావు చెప్పారు. తమ కంటే కష్టాలు అనుభవించిన నిర్వాసితులు ఉండకపోవచ్చని అన్నారు. గురువారం ఆయన కరీంనగర్ జిల్లా ఎల్లారెడ్డిపేట మండలం రాచర్ల బొప్పాపూర్లో వ్యవసాయ మార్కెట్ కమిటీ కార్యవర్గం ప్రమాణ స్వీకారానికి ముఖ్య అతిథిగా హాజరయ్యారు.
ఈ సందర్భంగా జరిగిన సమావేశంలో మాట్లాడుతూ.. 'నిజామాబాద్ జిల్లా దోమకొండ మండలం పోసానిపల్లెలో ఎగువమానేరు నిర్మాణంలో భూములు కోల్పోయిన ముఖ్యమంత్రి కేసీఆర్ మెదక్ జిల్లా చింతమడకలో స్థిరపడ్డారని, మధ్య మానేరు జలాశయం నిర్మాణంలో భాగంగా ఆయన సతీమణి శోభ కొదురుపాకలో భూములు త్యాగం చేశారని గుర్తు చేశారు. ఒక నిర్వాసితునిగా ముఖ్యమంత్రికి ఆ ఆవేదన తెలుసన్న మంత్రి.. శాశ్వత కరవు నివారణకు ప్రాజెక్టుల నిర్మాణమే ఏకైక మార్గమని పునరుద్ఘాటించారు.
భూ నిర్వాసితులకు న్యాయం చేయాలని అడిగే హక్కు ప్రతిపక్షాలకు ఉందని, అదే తరణంలో 1200 టీఎంసీల నీటి వాటా కోసం ప్రభుత్వం పోరాడుతుంటే సహకరించాల్సింది పోయి ప్రాజెక్టుల నిర్మాణాలను అడ్డుకునే ప్రయత్నం చేయడం ఏంటని ప్రశ్నించారు. భూములు పోవడం వల్ల వెయ్యిమందికి నష్టం జరిగితే ప్రాజెక్టుల నిర్మాణాలతో లక్షల మందికి లబ్ధి చేకూరుతుందని అన్నారు.

తమ ప్రభుత్వం తెలంగాణలో కోటి ఎకరాలకు సాగునీరు అందించాలనే లక్ష్యంతో ముందుకు పోతుందన్నారు. సాగునీరు, ఇంటింటికి నల్లానీటిని అందించడానికి చిత్తశుద్ధితో పనిచేస్తున్నామని చెప్పారు. తెలంగాణకు నీళ్ల పంపకంలో ద్రోహం చే సే విధంగా చంద్రబాబునాయుడు కుట్రలు చేస్తుంటే నోరు మెదపని ప్రతిపక్షాలు కాళ్లల్లో కట్టెలు పెడుతున్నట్లుగా రైతులను రెచ్చగొడుతూ తమ ప్రభుత్వంపై నిందలేయడం సిగ్గుచేటన్నారు
అరవై ఏళ్లపాటు రాష్ట్రాన్ని పరిపాలించిన కాంగ్రెస్, టిడిపి నేతలు ఏనాడూ ప్రజలను పట్టించుకున్న పాపానపోలేదన్నారు. ఇప్పుడు అభివృద్ధికి అడ్డుపడుతున్నారని మండిపడ్డారు. గ్రామాలు ముంపునకు గురికాకుండా, నిర్వాసితులు లేకుండా ప్రాజెక్టుల నిర్మాణం ఎలా కొనసాగుతుందని ప్రశ్నించారు. ప్రతిపక్షాలు రైతులను అడ్డుపెట్టుకుని అనవసర రాజకీయాలు చేస్తున్నాయని మంత్రి తారకరామారావు ధ్వజమెత్తారు.
జలాశయాల నిర్మాణాల్లో భాగంగా భూములు కోల్పోయే రైతులకు ప్రభుత్వం న్యాయం చేస్తుందని, 18 నెలల్లో ఎగువ మానేరు ఎత్తిపోతల పథకాన్ని పూర్తి చేసి సిరిసిల్ల నియోజకవర్గాన్ని సస్యశ్యామలం చేస్తానని హామీ ఇచ్చారు. కాగా, సిరిసిల్లా నియోజకవర్గ ప్రగతి పథం నివేదికను ఆవిష్కరించారు కెటిఆర్. ఎంపీ వినోద్కుమార్, డీసీసీబీ అధ్యక్షుడు రవీందర్రావు, ఎమ్మెల్సీ నారదాసు లక్ష్మణ్రావు, తెరాస జిల్లా అధ్యక్షుడు ఈద శంకర్రెడ్డి, పాల్గొన్నారు.












Click it and Unblock the Notifications