కెసిఆర్ మనవడు తింటున్న బియ్యమే పేద విద్యార్థులకు ఇస్తున్నాం: కెటిఆర్
వరంగల్: ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర రావు మనవడు తింటున్నటువంటి బియ్యమే పేద విద్యార్థులకు ఇస్తున్నామని, హాస్టళ్ల విద్యార్థులకు సన్న బియ్యం ఇస్తున్నామని తెలంగాణ ఐటి, గ్రామ పంచాయతీ మంత్రి కెటి రామారావు చెప్పారు. వరంగల్ జిల్లా బచ్చన్నపేటలో జరిగిన బహిరంగ సభలో ఆయన శనివారం సాయంత్రం మాట్లాడారు.
రైతుల మనోస్థయిర్యాన్ని దెబ్బ తీసే విధంగా ప్రతిపక్షాలు వ్యవహరిస్తున్నాయని ఆయన విమర్శించారు. రైతు ఆత్మహత్యలపై రాజకీయం వద్దు, భరోసా ఇద్దామని ఆయన విజ్ఞప్తి చేశారు. అరవై ఏళ్లలో పోని పేదరికం 15 నెలల్లో పోతుందా అని ఆయన అడిగారు. కోటి ఎకరాలకు సాగు నీరందించే బృహత్తర కార్యక్రమానికి శ్రీకారం చుడుతున్నట్లు ఆయన తెలిపారు. దమ్మున్న నాయకుడు కెసిఆర్ అని ఆయన అన్నారు.

ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణంలో కాంగ్రెసు నాయకులు అక్రమాలకు పాల్పడ్డారని ఆయన ఆరోపించారు. ఇళ్లు కట్టకుండా డబ్బులు జేబుల్లో వేసుకున్నారని విమర్శించారు. ఎండా కాలం నుంచి తొమ్మిది గంటలు కరెంట్ అందిస్తామని ఆయన హామీ ఇచ్చారు.
ఇంటింటికీ తాగు నీరు ఇవ్వకపోతే వచ్చే ఎన్నికల్లో ఓట్లు అడగబోమని కెసిఆర్ చెప్పిన విషయాన్ని ఆయన గుర్తు చేశారు. జనగాంకు సాగునీరు అందించే విషయంలో కెసిఆర్ పట్టుదలతో ఉన్నారని ఆయన చెప్పారు. సమైక్య రాష్ట్రం నుంచి కరెంట్ కష్టాలు వారసత్వంగా వచ్చాయని, కరెంట్ కష్టాలను అధిగమించామని ఆయన చెప్పారు. మనిషికి ఆరు కిలోల చొప్పున బియ్యం ఇస్తున్నామని చెప్పారు. ఉప ముఖ్యమంత్రి కడియం శ్రీహరి కూడా బహిరంగ సభలో ప్రసంగించారు.












Click it and Unblock the Notifications