ఇప్పుడే చెడ్డవాళ్లమయ్యామా?: కొండాకు కేటీఆర్ కౌంటర్, మహా కూటమిపై హరీశ్ ఫైర్
Recommended Video

సిరిసిల్ల: టీఆర్ఎస్ పార్టీపై తీవ్ర విమర్శల దాడికి దిగిన కొండా సురేఖ దంపతులపై మంత్రి కేటీఆర్ అదే స్థాయిలో విమర్శలు చేశారు. టీఆర్ఎస్లో ఉన్నంత కాలం కొండా దంపతులకు తాము మంచి వాళ్లమని, పార్టీ నుంచి వెళ్లిపోయే ముందు విమర్శలు చేస్తున్నారని మండిపడ్డారు.

కొండా దంపతుల ఆరాటం అదే
మంగళవారం సిరిసిల్లలో కేటీఆర్ మీడియాతో మాట్లాడుతూ... టీఆర్ఎస్పై విమర్శలు చేసి అవతలి పార్టీ మెప్పు పొందాలని కొండా దంపతులు చూస్తున్నారని విమర్శించారు. టీఆర్ఎస్, కాంగ్రెస్ల ప్రజా బలమెంతో ఎన్నికల్లో ప్రజలే తేలుస్తారన్నారు. ఒకరికి వ్యతిరేకంగా పుట్టిన పార్టీ, మరో పార్టీ నిస్సిగ్గుగా ఏకం అవుతున్నాయని ఎద్దేవా చేశారు. విలువలకు తిలోదకాలు ఇచ్చి అధికారం కోసం కూటమి కడుతున్నారని మండిపడ్డారు.

మన స్వాభిమానం వాళ్ల కాళ్ల దగ్గరా?
‘ఢిల్లీ బాసులకు.. అమరావతి నేతలకు గులాంలు అవుతామా? తెలంగాణ స్వాభిమానాన్ని వాళ్ల కాళ్ల దగ్గర పెడదామా? నిర్ణయాధికారం మన చేతుల్లోనే ఉంచుకుని ఆత్మగౌరవంతో ముందుకు వెళ్దామా?' అని కేటీఆర్ ప్రశ్నించారు.
కోదండరామ్ ఆత్మవంచన చేసుకోవడం మానేయాలన్నారు కేటీఆర్. ప్రజాభిమానంతో 119 స్థానాల్లో పోటీ చేస్తామని అన్నారు. ఇవాళ ముష్టి 3 సీట్ల కోసం కాంగ్రెస్ చుట్టూ తిరుగుతూ పొర్లు దండాలు పెడుతున్నారు. ఇది ఏ రకమైన ప్రజాభిమానమో కోదండరామ్ ఆలోచించుకోవాలి. ఏ ఆలోచనతో పొత్తు పెట్టుకుంటున్నాయో కాంగ్రెస్, టీడీపీ ప్రజలకు చెప్పాలి' అని కేటీఆర్ డిమాండ్ చేశారు.

టీఆర్ఎస్ను ఎదుర్కొనే దమ్ములేకే..
ఇది ఇలా ఉంటే, మంత్రి హరీశ్ రావు కూడా ప్రతిపక్ష పార్టీలపై విమర్శల దాడి చేశారు. టీఆర్ఎస్ను ఎదుర్కొనే దమ్ములేక కూటమిగా ఏర్పడ్డ కాంగ్రెస్, టీడీపీ, టీజేఎస్, సీపీఐ పార్టీలకు ఒక్క ఓటుతో బుద్ధి చెప్పాలని పిలుపునిచ్చారు. జిల్లాలోని ములుగు, మార్కుక్ మండలంలో మంగళవారం జరిగిన టీఆర్ఎస్ కార్యకర్తల విస్తృతస్థాయి సమావేశంలో హరీష్ మాట్లాడుతూ.. కాంగ్రెస్ నాయకులు కోమటిరెడ్డి వెంకటరెడ్డి, ఉత్తమ్ కుమార్రెడ్డిలకు కుర్చీల కోసం కొట్లాట తప్ప ప్రజా సమస్యలు పట్టవన్నారు. తెలంగాణలో 60 ఏళ్లలో జరగని అభివృద్ధి టీఆర్ఎస్ ప్రభుత్వం నాలుగేళ్లలో చేసి చూపిందని వెల్లడించారు.

కోదండరాం గురించి మాట్లాడటం..
గతంలో మంత్రులు, అధికారులు గ్రామాల్లోకి వస్తే.. నీటికి కటకట ఉందని ప్రజలు ఖాళీ బిందెలతో నిరసనలు తెలిపేవారని గుర్తు చేశారు. కానీ, ఇప్పుడు ప్రతీ ఇంటికి తాగునీరు అందిస్తున్నామని ఆనందం వ్యక్తం చేశారు. టీఆర్ఎస్ పార్టీకే ఓటేస్తామని గుంటిపల్లె ప్రజలంతా తీర్మానం చేశారనీ.. అదే స్ఫూర్తితో యావత్ తెలంగాణ ప్రజానీకం టీఆర్ఎస్ పార్టీకి అండగా నిలవాలని కోరారు. కోదండరామ్ పార్టీ గురించి మాట్లాడడమంటే సమయం వృధా చేసుకోవడమేనని వ్యాఖ్యానించారు. కొండపోచమ్మ ప్రాజెక్టును అడ్డుకోవడానికి కోదండరామ్ తీవ్రంగా యత్నించాడని ఆరోపించారు. ప్రభుత్వ కృతనిశ్చయంతో నేడు కొండపోచమ్మ ప్రాజెక్టు పనులు దేశంలో ఎక్కడా లేనంత వేగంగా సాగుతున్నాయని తెలిపారు. మహా కూటమిగా వచ్చే పార్టీలకు ప్రజలే తగిన గుణపాఠం చెప్పాలన్నారు.












Click it and Unblock the Notifications