మణిశంకర్ను లాగిన కేటీఆర్, రేవంత్ దిమ్మతిరిగే కౌంటర్: 'యూట్యూబ్ వీడియోలు వెర్రితనం'
Recommended Video
హైదరాబాద్/మహబూబ్ నగర్: మంత్రి లక్ష్మారెడ్డి, కాంగ్రెస్ నేత, కొడంగల్ ఎమ్మెల్యే రేవంత్ రెడ్డి మధ్య వివాదం ముదురుతోంది. ఈ అంశంపై కాంగ్రెస్, టీఆర్ఎస్ నేతల మధ్య వాగ్యుద్ధం నడుస్తోంది. తాజాగా సోమవారం మంత్రి కేటీఆర్ స్పందించగా, రేవంత్ గట్టి కౌంటర్ ఇచ్చారు.
చదవండి: రాజ్భవన్లో కేసీఆర్-పవన్ కళ్యాణ్ ఏకాంత చర్చ: బాబుతో ఆత్మీయంగా, సీఎంలతో చిరంజీవి ఇలా (ఫోటోలు)
టిడిపి నుంచి కాంగ్రెస్లోకి వచ్చిన రేవంత్ ఎన్నికల్లో పోటీ చేస్తే ఓడిపోతాననే భయంతో రాజీనామా చేయకుండా తప్పించుకొని తిరుగుతున్నారని, అందరి దృష్టి మళ్లించేందుకు మంత్రులు, నేతలపై అనుచిత వ్యాఖ్యలు చేస్తున్నారని టీఆర్ఎస్ ఎమ్మెల్యేలు గువ్వల బాలరాజు, ఆల వెంకటేశ్వర రెడ్డి మండిపడ్డారు.
చదవండి: రాయలేని విధంగా, మంత్రిపై అలాంటి వ్యాఖ్యలా?: రేవంత్ రెడ్డికి షాక్, కేసు నమోదు
కాంగ్రెస్ పెద్దలను లాగిన తెరాస
తాను రాజీనామాకు సిద్ధమని, రేవంత్ కూడా సిద్ధామా అని, అప్పుడు ఎవరి సత్తా ఏమో తెలుస్తుందని బాలరాజు సవాల్ చేశారు. రేవంత్ అందరిని అవమానించేలా మాట్లాడుతుంటే కాంగ్రెస్ పెద్దలు చోద్యం చూస్తున్నారా అని నిలదీశారు. ఆ పార్టీకి నైతిక విలువలు ఉంటే ఆయనపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.
ఫేస్బుక్, యూట్యూబ్లలో వీడియోలు రేవంత్ వెర్రితనం
రేవంత్ రెడ్డి జడ్చర్లలో నిర్వహించిన సభలో నోటీకి వచ్చినట్లు మాట్లాడారని, తిక్క తిక్కగా మాట్లాడటం సరికాదని ఎమ్మెల్సీ నరేందర్ రెడ్డి మండిపడ్డారు. రేవంత్ రాజకీయ ఉనికిని మరిచి పోయి వ్యక్తిగత విషయాలు మాట్లాడటం తగదన్నారు. మహిళల్ని కించపరిచేలా మాట్లాడారని, దానికి క్షమాపణ చెప్పాలన్నారు. తాను మాట్లాడిన వీడియోలను ఫేస్బుక్, యూట్యూబ్లలో పెట్టి యువతను ఆకర్షించాలనుకోవడం రేవంత్ వెర్రితనం అన్నారు. ఇమేజ్ కోసం కేసీఆర్, కేటీఆర్, మంత్రులను విమర్శిస్తున్నారన్నారు. కేసీఆర్ కుటుంబాన్ని విమర్శిస్తే చూస్తూ ఊరుకునేది లేదన్నారు. రేవంత్ మాట్లాడిన తీరుపై డీకే అరుణ స్పందించాలని డిమాండ్ చేశారు.
నెటిజన్ అడగడంతో స్పందించిన కేటీఆర్
ఓ వైపు, నేతల మధ్య వాగ్యుద్దం నడుస్తుండగా కేటీఆర్ సామాజిక అనుసంధాన వేదిక ట్విట్టర్ ద్వారా స్పందించారు. లక్ష్మారెడ్డిపై రేవంత్ చేసిన వ్యాఖ్యలను దృష్టిలో పెట్టుకొని ఓ నెటిజన్.. కేటీఆర్కు ట్వీట్ చేశారు. కేటీఆర్ సార్.. దయచేసి స్పందించండి, ఒక నేత ఇలా మాట్లాడటం సమంజసమా అని పేర్కొన్నారు. దానిపై కేటీఆర్ స్పందించారు.
గుజరాత్ ఎన్నికలకే పరిమితం చేశారేమో చూద్దాం
గౌరవప్రదమైన తెలంగాణ కేబినెట్ మంత్రి లక్ష్మారెడ్డిపై చవకబారు వ్యాఖ్యలు చేసిన రేవంత్ విషయమై రాహుల్ గాంధీ లేదా ఉత్తమ్ కుమార్ రెడ్డిలు స్పందించాలని, మణిశంకర్ అయ్యర్ చేసిన వ్యాఖ్యలపై వెంటనే స్పందించి చర్యలు చేపట్టారని, ఇలాంటి చర్యలను కేవలం గుజరాత్ ఎన్నికలకే పరిమితం చేశారేమో చూద్దామని వ్యాఖ్యానించారు.
ఆ తర్వాత నా గురించి మాట్లాడు
కేటీఆర్ వ్యాఖ్యలపై రేవంత్ కూడా ఘాటుగానే స్పందించారు. ఆయన వ్యాఖ్యలుగురివింద సామెతను గుర్తు చేస్తున్నాయని, తనపై మాట్లాడే ముందు లక్ష్మారెడ్డి ఏం మాట్లాడారో కేటీఆర్, కేసీఆర్ తెలుసుకోవాలని, తనపై లక్ష్మారెడ్డి చేసిన వ్యాఖ్యలను కేటీఆర్ సమర్థిస్తున్నారా, లక్ష్మారెడ్డిపై చర్యలు తీసుకొని ఆ తర్వాత నా గురించి మాట్లాడాలని దిమ్మతిరిగే కౌంటర్ ఇచ్చారు.
మణిశంకర్ అయ్యర్పై చర్యలు, రేవంత్ పైనా తీసుకోవాలి
అంతకుముందు మంత్రి లక్ష్మారెడ్డి మాట్లాడుతూ.. దౌర్భాగ్యుల రాకతో రాజకీయాలు భ్రష్టు పడుతున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. మోడీని నీచ్ అన్నందుకు మణిశంకర్ పైన వేటు వేశారని, ఇక్కడ రేవంత్ పైనా చర్యలు తీసుకోవాలని తెరాస డిమాండ్ చేసింది. అయితే తెరాస నేతలు దిగజారుడు రాజకీయాలు మానుకోవాలని, రేవంత్ పైన విమర్శలు సరికాదని కాంగ్రెస్ నేతలు కూచుకుళ్ల దామోదర రెడ్డి, వంశీకృష్ణలు అంతకుముందు మండిపడ్డారు.