గోడలపై రాస్తే.. కఠిన చర్యలు తప్పవు, సొంత పార్టీ నేతలైనా సరే : కేటీఆర్
హైదరాబాద్ : నగరంలో గోడలపై రాతలు రాసేవారి మీద కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు తెలంగాణ ఐటీ మంత్రి కేటీఆర్. ఈ విషయంలో సొంత పార్టీ నేతలనైనా ఉపేక్షించేది లేదని కేటీఆర్ స్పష్టం చేశారు. అవసరమైతే ఇందుకోసం పోలీసుల సహాయం తీసుకోవాలని ప్రజలకు సూచించారు. గోడలపై రాతలు రాసి వాటిని పాడుచేస్తే చర్యలు తప్పవన్నారు.
నెక్లెస్ రోడ్డులోని పీపుల్స్ ప్లాజాలో శనివారం నాడు జరిగిన తెలంగాణ కళాకారుల మేళ కార్యక్రమంలో కేటీఆర్ పాల్గొన్నారు. ఈ సందర్బంగా పలు అంశాలపై ఆయన మాట్లాడారు. హైదరాబాద్ అందమైన నగరమని, ఐటీకి కేంద్రంగా హైదరాబాద్ కొనసాగుతుందని చెప్పారు. రాష్ట్రంలో కళాకారులను ప్రోత్సహించాల్సిన అవసరముందని గుర్తు చేశారు.
హైదరాబాద్ స్వరూపాన్ని కళాకారులు మార్చేస్తుంటే.. వారికి ఆటంకాలు కలిగించడం సబబు కాదన్నారు. అభివృద్ధిలో హైదరాబాద్ నగరం దూసుకుపోతుందని, ప్రపంచ ప్రసిద్ది చెందిన ఐదు మేటి కంపెనీలు ఇక్కడ కొలువయ్యాయని తెలిపారు.