అమరరాజా వెళ్ళిపోతే జరిగేదిదే: రేవంత్ కు కేటీఆర్ హెచ్చరిక!!
తెలంగాణ రాష్ట్రంలో అమర రాజా బ్యాటరీస్ కంపెనీ చైర్మన్ గల్లా జయదేవ్ రేవంత్ రెడ్డి సర్కార్ పై చేసిన వ్యాఖ్యలతో మాజీ మంత్రి కేటీఆర్ స్పందించారు. తెలంగాణ రాష్ట్రంలో అమరరాజా బ్యాటరీ 9500 కోట్లు పెట్టుబడులు పెట్టేందుకు ఒప్పించడానికి తాము చాలా కష్టపడ్డామని మాజీ మంత్రి కేటీఆర్ వెల్లడించారు.
తెలంగాణా నుండి అమరరాజా వెళ్ళిపోతే తీవ్ర నష్టం
తెలంగాణ నుంచి అమర రాజా వెళ్లిపోతే తీవ్ర నష్టం జరుగుతుందని కేటీఆర్ హెచ్చరించారు. తెలంగాణ రాష్ట్రంలో పెట్టుబడుల కోసం విదేశాలు తిరుగుతున్న రేవంత్ రెడ్డి ఇప్పటికే తెలంగాణ రాష్ట్రానికి వచ్చిన పెట్టుబడుల విషయంలో నిర్లక్ష్యం వహించడం మంచిది కాదని హితవు పలికారు. ప్రభుత్వమనేది పాలసీ కొనసాగింపును నిర్ధారించాల్సిన సంస్థగా వ్యవహరించాలని ఈ సందర్భంగా కేటీఆర్ సూచించారు .

మన రాజకీయ విభేదాల వల్ల తెలంగాణ రాష్ట్రం బాధపడకూడదు
గతంలో తమకు ఇచ్చిన హామీలను ప్రస్తుత ప్రభుత్వం నిలబెట్టుకోకపోతే తెలంగాణ నుంచి వెళ్ళిపోతామని అమర రాజా కంపెనీ చైర్మన్ గల్లా జయదేవ్ చేసిన వ్యాఖ్యల వార్తలపై ట్విట్టర్ వేదికగా స్పందించిన కేటీఆర్ మన రాజకీయ విభేదాల వల్ల తెలంగాణ రాష్ట్రం బాధపడకూడదు అన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం తెలంగాణ రాష్ట్రంలోని పెట్టుబడిదారులందరినీ గౌరవిస్తుందని తాను ఆశిస్తున్నట్టుగా వెల్లడించారు.
సీఎం ఆ వ్యాఖ్యలు మానుకోవాలి
భారతదేశంలోనే అత్యధిక తలసరి ఆదాయం కలిగిన శక్తివంతమైన రెవెన్యూ మిగులు రాష్ట్రంగా ఉన్న తెలంగాణ అప్పుల ఊబిలో కూరుకుపోయిందని, క్యాన్సర్ వ్యాధిగ్రస్తులతో సమానం అంటూ సీఎం రేవంత్ రెడ్డి ప్రకటనలు చేయడం మానుకోవాలని కేటీఆర్ హితవు పలికారు. సీఎం వ్యాఖ్యల వలన తెలంగాణాకు నష్టం జరుగుతుందన్నారు. ఇప్పటికే కేన్స్ టెక్నాలజీ తెలంగాణ రాష్ట్రం నుంచి గుజరాత్ కు వెళ్లిపోవడం జరిగిందని, కార్నింగు ప్లాంటును చెన్నైకి పోగొట్టుకోవడం చూసామని కేటీఆర్ పేర్కొన్నారు.
తెలంగాణా బ్రాండ్ కు తీరని నష్టం.. రేవంత్ కు కేటీఆర్ సూచన
ఇప్పుడు అమరరాజా కూడా వెళ్ళిపోతే అది విపత్తుతో సమానం అంటూ కేటీఆర్ రేవంత్ రెడ్డికి హెచ్చరికలు జారీ చేశారు. ఇప్పటికైనా ప్రభుత్వం మేల్కొనాలని, లేదంటే మరిన్ని సంస్థలు రాష్ట్రాన్ని వదిలి వెళ్తాయ,ని తెలంగాణ బ్రాండ్ కు ఇది తీరని నష్టాన్ని చేస్తుందని కేటీఆర్ వెల్లడించారు. రాజకీయ ప్రయోజనాల కోసం రాష్ట్ర ప్రయోజనాలను తాకట్టు పెట్టడం ఏమాత్రం మంచిది కాదని ప్రభుత్వానికి హితవు పలికారు. గత ప్రభుత్వం పెట్టుబడిదారులకు ఇచ్చిన హామీలను కొనసాగించాలని కేటీఆర్ రేవంత్ రెడ్డికి సూచించారు.












Click it and Unblock the Notifications