తెలంగాణ రాజకీయాల్లో కేవీపీది కీలక పాత్ర..
ఆయన తల నుంచి పాదం వరకు సమైక్యవాది. రాష్ట్ర విభజన సమయంలో తెలంగాణకు వ్యతిరేకంగా పార్లమెంట్ సాక్షిగా గళం వినిపించారు. తెలంగాణ అన్నది చరిత్రలో ఎన్నడూ అస్థిత్వంలో లేదని సభసాక్షిగా బల్లగుద్ది చెప్పారు. తాను మనసా,వాచా, కర్మేణ రాష్ట్రం కలిసుండాలని బలంగా కోరుకుంటున్నట్టు చెప్పారు.
ముందు ఆయన సమైఖ్య వాది.. రాష్ట్రం విడిపోయాక తెలంగాణ వాది..
సరే, ఆయన వాదన ఎలా ఉన్నా... రాష్ట్ర విభజన జరిగిపోయింది. ఏపీలో టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి కాగా... తెలంగాణలో టీఆర్ఎస్ అధినేత కేసీఆర్ ముఖ్యమంత్రి అయ్యారు. సీన్ కట్ చేస్తే... ఫక్తు సమైక్యవాది అయిన సదరు నేత పక్కా తెలంగాణవాది అయిన కేసీఆర్ తో స్నేహం మొదలు పెట్టారు. ఆయనే కేవీపీ రామచందర్ రావు. ఈ సీనియర్ కాంగ్రెస్ నేత గడచిన నాలుగేళ్లలో తెలంగాణ ప్రభుత్వ పెద్దలకు బాగా సన్నిహితుడుగా మారారన్నది తెలిసిన విషయమే. కేసీఆర్ కీలక నిర్ణయాల్లో కేవీపీ కూడా ఉంటారన్న స్థాయిలో రాజకీయవర్గాల్లో ప్రచారం జరుగుతోంది.
తెలంగాణ కాంట్రాక్టుల్లో కీలక భాగస్వామ్యం..
వీరిద్దరి స్నేహం ఏ స్థాయిలో వెల్లివిరుస్తోందో ఓ పత్రికలు గతంలో ఫోటోలతో సహా ప్రచురించింది. కేవీపీకి సన్నిహితులైన కొందర కాంట్రాక్టర్లకు తెలంగాణ ప్రభుత్వంలో భారీ పనులు కూడా దక్కాయని చెబుతారు. మిషన్ భగీరథ, ఇరిగేషన్ వర్కులలో సింహభాగం ఆయన సన్నిహిత కంపెనీలకే దక్కాయన్న ప్రచారం కూడా ఉంది. అయితే ఏంటి అన్నది ఇక్కడ ప్రశ్న. ఈ ప్రశ్నకు సమాధానం దొరకాలంటే మళ్లీ సీన్ కట్ చేద్దాం... కేవీపీ రామచందర్ రావు ఇటీవల ఆంధ్ర ప్రదేశ్ రాజకీయాల కంటే తెలంగాణ రాజకీయాల పై ఎక్కువగా ప్రేమ పెంచుకుంటున్నారు. ఏ ఏపీ కాంగ్రెస్ నేతా చూపనంత ఆసక్తి టీ కాంగ్రెస్ వ్యవహారాల పై కేవీపీ చూపుతున్నారు. తరచుగా టీ కాంగ్రెస్ కార్యక్రమాల్లో పాల్గొంటున్నారు. తాజాగా సీటీ కాంగ్రెస్ అధ్యక్షుడుగా అంజన్ కుమార్ యాదవ్ బాధ్యతల స్వీకార కార్యక్రమంలో సైతం కేవీపీ ప్రత్యక్షమయ్యారు.
ఆంధ్ర వద్దు..తెలంగాణే ముద్దు..
ఏపీలో రాజకీయాలు చేయాల్సిన కేవీపీ తెలంగాణ రాజకీయాల్లో ప్రత్యక్షం కావడమే ఇప్పుడు టీ కాంగ్రెస్ లో చర్చనీయాంశమైంది. కేసీఆర్ కు అత్యంత సన్నిహితంగా ఉండే కేవీపీ ఇప్పుడు టీ కాంగ్రెస్ వ్యవహారాల్లో తలదూర్చి పార్టీని ఏ దరికి చేర్చబోతున్నారు అన్నదే ఇక్కడ సందేహం. 2014 ఎన్నికల్లో సైతం కేవీపీ తెలంగాణ రాజకీయాల్లో తనదైన పాత్ర పోషించారు. అప్పట్లో పొన్నాల లక్ష్మయ్యను పీసీసీ అధ్యక్షుడుని చేయడంలో కేవీపీ పాత్ర ఉందంటారు. ఆ నిర్ణయం కేసీఆర్ కు బాగానే ఉపయోగపడింది. తాజాగా ఎన్నికలు సమీపిస్తోన్న తరుణంలో ఆయన మరోసారి టీ కాంగ్రెస్ ఇష్యూల్లో తలదూర్చుతుండటం పార్టీ శ్రేణులను ఆందోళన పరుస్తోందట. పోనీ, విభజన సమయంలో ఆయనేమైనా బొత్సా సత్యనారాయణ మాదిరిగా తెలంగాణకు జై కొట్టారా అంటే అదీ లేదు. తాజాగా టీ కాంగ్రెస్ రాజకీయాల్లో కేవీపీ పాత్ర పై పార్టీలో చర్చ మొదలైంది.
కేసీఆర్-కేవీపి చెలిమి తెలంగాణ కాంగ్రేస్ కి ముప్పే..
కేసీఆర్ కు సన్నిహితంగా ఉండే కేవీపీ నిర్ణయాలు పార్టీ పై ఎలాంటి ప్రభావం చూపుతాయన్నది ఇప్పుడు చర్చ. రాజీవ్ స్వగృహ స్కాం కేసుకు సంబంధించి ఇటీవల టీ కాంగ్రెస్ కీలక నేత ఒకరికి ఉచ్చు బిగుసుకోబోతోందన్న వార్తలు వస్తున్నాయి. ఈ నేపథ్యంలో సదరు నేత ఏమైనా కేవీపీ శరణుజొచ్చారా ? కేసీఆర్ తో రాజీ కోసం కేవీపీ ద్వారా ఏమైనా ప్రయత్నిస్తున్నారా ? అన్న సందేహాలు పార్టీలో వినిపిస్తున్నాయి. అదే నిజమైతే... ఎన్నికల కంటే ముందే టీ కాంగ్రెస్ అస్త్ర సన్యాసం చేసినట్టే. అటు కేసీఆర్ కు సన్నిహితంగా ఉంటూ... ఇటు టీ కాంగ్రెస్ లో కీలక పాత్ర పోషించే పని కేవీపీ చేతిలోకి వెళితే ఇక పార్టీ ఆశలు ఆవిరికావడం ఖాయం అంటున్నారు కొందరు టీ కాంగ్రెస్ నేతలు. ఎన్నికల వేళ ఇలాంటి చర్యలతో పార్టీ భవిష్యత్ ఏం కాబోతోందో అర్థం కాని పరిస్థితుల్లో కాంగ్రెస్ నేతలు, శ్రేణులు తికమకపడుతున్నాయి.