వచ్చే ఎన్నికల్లో ఒంటరిపోరే, అధికారమే లక్ష్యం: లక్ష్మణ్, బట్జెట్కు కితాబు
న్యూఢిల్లీ: వచ్చే ఎన్నికల్లో అధికారమే లక్ష్యంగా పనిచేస్తామని భారతీయ జనతా పార్టీ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు లక్ష్మణ్ అన్నారు. ఎన్నికలు ఎప్పుడు వచ్చినా రాష్ట్రంలో తాము ఒంటరిగానే పోటీచేస్తామని స్పష్టంచేశారు.
బీజేపీ కేంద్ర కార్యాలయంలో తెలంగాణ, ఆంధ్రప్రదేశ్కు చెందిన బీజేపీ నేతలు గురువారం సమావేశమయ్యారు. ఇరు రాష్ట్రాల్లో తాజా పరిణామాలు, పరిస్థితులపై చర్చించారు. అనంతరం లక్ష్మణ్ మీడియాతో మాట్లాడుతూ.. రాష్ట్ర పార్టీ పనితీరుపై అమిత్ షా సంతృప్తి వ్యక్తం చేశారని చెప్పారు.
రాష్ట్ర వ్యాప్తంగా పోటీ
వచ్చే ఎన్నికల్లో 119 అసెంబ్లీ నియోజకవర్గాలు, 17పార్లమెంటరీ నియోజకవర్గాల్లో బీజేపీ ఒంటరిగానే పోటీ చేస్తుందని తెలిపారు. అన్ని వర్గాల సమస్యలపై పోరాటాలు చేయాలని అమిత్ షా సూచించారని లక్ష్మణ్ చెప్పారు. టీఆర్ఎస్ ప్రభుత్వ ప్రజా వ్యతిరేక విధానాలకు వ్యతిరేకంగా ప్రచారం చేసేందుకు రోడ్ మ్యాప్ చేస్తున్నామని చెప్పారు.
అధికారమే లక్ష్యంగా..
వచ్చే ఎన్నికల్లో అధికారమే లక్ష్యంగా పనిచేయాలని అమిత్ షా సూచించారని లక్ష్మణ్ తెలిపారు. ఈ భేటీలో అసెంబ్లీ సీట్ల పెంపుపై చర్చ జరగలేదని ఆయన తెలిపారు.
సంక్షేమ బడ్జెట్
కాగా, కేంద్ర బడ్జెట్లో సంస్కరణలు, సంక్షేమానికే పెద్దపీట వేశారని అన్నారు. అన్ని వర్గాలను సంతృప్తి పరిచేలా ఈ బడ్జెట్ను రూపొందించినట్టు చెప్పారు. వ్యవసాయ రంగం, పేదల సంక్షేమానికి పెద్దపీట పడిందన్నారు. సామాన్యులు, వయో వృద్ధులకు అనేక రాయితీలు కల్పించారని ప్రశంసించారు. రూ.330లకే రూ.5లక్షల బీమా కల్పించడం విశేషమన్నారు. గ్రామీణాభివృద్ధికి మోదీ ప్రభుత్వం కట్టుబడి ఉందని నిరూపించిందన్నారు.
నిధులిచ్చారు కానీ..
తెలంగాణలో ట్రిపుల్ ఐటీకి రూ.75 కోట్లు, సింగరేణికి రూ.2వేల కోట్లు ఇచ్చారని, గిరిజన విశ్వవిద్యాలయానికి రూ.10 కోట్లు ఇచ్చారని చెప్పారు. కేంద్రం ఇచ్చిన నిధులను రాష్ట్ర ప్రభుత్వం సరిగా వినియోగించడంలేదని విమర్శించారు. ఎంఎంటీఎస్ రెండో దశకు నిధులు ఇచ్చినా.. రాష్ట్రం ఇంతవరకు పనులు ప్రారంభించలేదని లక్ష్మణ్ అన్నారు.