సివిల్ గొడవలు: ఎసిపి సీతారాంపై సస్పెన్షన్ వేటు
హైదరాబాద్: సైబరాబాద్ కమిషనరేట్ పరిధిలోని ఎల్బీనగర్ ఎసిపి పి సీతారామ్పై సస్పెన్షన్ వేటు పడింది. ఈ మేరకు తెలంగాణ డిజిపి అనురాగ్ శర్మ మంగళవారం ఉత్తర్వులు జారీ చేశారు.
ఎపిసి సీతారామ్పై భూ వివాదాల్లో తలదూరుస్తూ పెద్ద మొత్తంలో వసూళ్లకు పాల్పడుతున్నారని ఆరోపణలు ఉన్నాయి.
సీతారామ్ వ్యవహారం తెలంగాణ రాష్ట్ర పోలీస్ శాఖకు మచ్చగా మారడంతో స్పందించిన డిజిపి అనురాగ్ శర్మ అతడిపై సస్పెండ్ చేశారు. సీతారామ్ గతంలో కూడా ఒకసారి భూ వివాదాల్లో తలదూర్చి సస్పెన్షన్ పాలయ్యాడు.
ఇదిలా ఉండగా హైదరాబాద్ సిటీ ఎసిపి (డిడి) ఎంఎ రహ్మాన్ను చీఫ్ ఆఫీస్కు అటాచ్ చేస్తున్నట్లు ఉత్తర్వుల్లో పేర్కొన్నారు.
అయితే, తనపై వచ్చిన ఆరోపణలను సీతారాం ఖండిస్తున్నారు. తాను ఎవరి భూమిని కూడా కబ్జా చేయలేదని, ప్లాట్ యజమానులను బెదిరించలేదని ఆయన అన్నారు. చట్టప్రకారమే తాను నడుచుకున్నట్లు తెలిపారు. కొంత మంది తనపై కక్ష కట్టి ఉన్నతాధికారులను తప్పుదోవ పట్టించారని అన్నారు. తన బంధువు పేరుపై భూమిని రిజిస్ట్రేషన్ చేయించినట్లు వచ్చిన ఆరోపణల్లో నిజం లేదని అన్నారు.