11 గంటలుగా చిరుత కోసం గాలింపు, బుద్వేల్ ఫాం హౌస్ సమీపంలో హై టెన్షన్, ఎరగా మేకలు..
హైదరాబాద్ శివారులోని ప్రజలను చిరుతపులి భయాందోళనకు గురిచేస్తోంది. ఉదయం రోడ్డుపైకి వచ్చిన చిరుత.. ఫారెస్ట్లోకి వెళ్లింది. 11 గంటలు గడిచినా.. దాని ఆఛూకీ తెలియకపోవడంతో ప్రజలు బిక్కుబిక్కుమంటున్నారు. రాత్రి వచ్చి దాడి చేస్తుందేమోనని భయపడుతున్నారు. జీహెచ్ఎంసీ, పోలీసులతో సమన్వయం చేసుకొని అటవీశాఖ అధికారులు చిరుతపులిని పట్టుకొనేందుకు విశ్వ ప్రయత్నాలు చేస్తున్నారు. 50 ఎకరాల విస్తీర్ణంలో గల ఫాం హౌస్లోకి వెళ్లలేమని... అది బయటకు వస్తే మాత్ర అనస్థిషీయా ఇస్తామని చెబుతన్నారు.

డ్రోన్ కెమెరాలతో..
బుద్వేల్.. రైల్వేస్టేషన్ వద్ద ఉదయం చిరుతపులి సంచరించింది. రోడ్డుపై కొద్దిసేపు ఉన్నా తర్వాత.. సమీపంలో ఉన్న ఫాం హౌస్లోకి వెళ్లింది. అందులోకి వెళ్లడాన్ని ప్రత్యక్ష సాక్షులు చూశారు. అటవీ అధికారులకు సమాచారం ఇవ్వడంతో రంగంలోకి దిగి.. సహాయక చర్యలు చేపట్టారు. ఎక్కడ చిరుత ఉందోనని డ్రోన్ కెమెరాలతో గాలించారు. చిరుత బయటకొచ్చేందుకు రెండు మేకలను కూడా ఏర్పాటు చేశారు. బోనులోకి వస్తే.. ఇరుక్కొనే ఏర్పాట్లు కూడా చేశారు. బల్దియా సిబ్బంది 10 శునకాలను కూడా రంగంలోకి దించాయి.

20 వేల మంది..
ఫాం హౌస్ మరోవైపు బుద్వేల్, శ్రీరాంనగర్, వెంటకేశ్వర కాలనీ, నేతాజీనగర్, దుర్గా కాలనీ ఉన్నాయి. ఇక్కడ దాదాపు 20 వేల మంది ఉంటున్నారు. చిరుతపులి సంచరించిందనే వార్త తెలిసి భయపడుతున్నారు. కానీ పోలీసులు మాత్రం వారికి భరోసానిస్తున్నారు. రాత్రిపూట బయటకు రావొద్దని.. కుక్కలు అరిచినట్టు అనిపిస్తే డయల్ 100కి కాల్ చేయాలని కోరుతున్నారు.
Recommended Video

నీటి కోసం
చిరుత ఆహారం కోసం కాకున్నా.. నీటి కోసమైనా బయటకొస్తుందని అటవీ అధికారులు చెబుతున్నారు. కానీ ఇంతవరకు చిరుతను పట్టుకోకపోవడంపై చుట్టుపక్కల వారు మాత్రం ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఉదయం గంట నుంచి గంటన్నర పాటు రోడ్డుపైనే చిరుత ఉంది అని.. ఆ సమయంలో అధికారులు వస్తే.. బాగుండేదని స్థానికులు చెబుతున్నారు. మరికొందరు ప్లడ్ లైట్లు ఏర్పాటు చేయాలని సూచిస్తున్నారు. చిరుతపులి బారినుంచి తమను కాపాడాలని వేడుకుంటున్నారు.












Click it and Unblock the Notifications