టీఆర్ఎస్ ను తరిమికొడదాం.! తీన్మార్ మల్లన్నలాంటి చేతులు ఏకం కావాలన్న బండి సంజయ్.!
ఢిల్లీ/హైదరాబాద్ : తెలంగాణలో ప్రశ్నించే గొంతుక తీన్మార్ మల్లన్న అని, ప్రజల ఆధరాభిమానాలు చూరగొన్న వ్యక్తి అని, అలాంటి వ్యక్తి బీజేపీలో చేరడం సంతోషంగా ఉందని, హ్రుదయపూర్వకంగా బీజేపీలోకి స్వాగతం పలుకుతున్నానని, మల్లన్న నిఖార్సయిన తెలంగాణ వాది, ఉద్యమకారుడని తెలంగాణ రాష్ట్ర అధ్యక్షులు, ఎంపీ బండి సంజయ్ కుమార్ పేర్కొన్నారు.
రాజకీయ స్వార్థంతో మల్లన్న బీజేపీలో చేరడం లేదని, ప్రధాని నరేంద్ర మోదీ ప్రభుత్వం అవినీతి రహితంగా ఉంటూ పేదల కోసం పాలిస్తుంటే, తెలంగాణలో అందుకు భిన్నంగా అవినీతి, రాక్షస, కుటుంబం పాలన కొనసాగిస్తున్న చంద్రవేఖర్ రావు ప్రభుత్వంపై వ్యతిరేకంగా పోరాడుతున్న వ్యక్తి మల్లన్న అని బండి సంజయ్ తెలిపారు.
బీజేపీలో చేరిన తీన్మార్ మల్లన్న..
ప్రముఖ జర్నలిస్టు తీన్మార్ మల్లన్న అలియాస్ చింతపండు నవీన్ కుమార్ బీజేపీలో చేరారు. ఢిల్లీలోని బీజేపీ జాతీయ కార్యాలయంలో జరిగిన కార్యక్రమంలో పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి, తెలంగాణ ఇంఛార్జ్ తరుణ్ చుగ్, రాష్ట్ర అధ్యక్షులు, ఎంపీ బండి సంజయ్ కుమార్, నిజామాబాద్ ఎంపీ ధర్మపురి అరవింద్, పార్లమెంటరీ పార్టీ కార్యాలయ కార్యదర్శి కామర్సు బాలసుబ్రమణ్యం, మాజీ ఎమ్మెల్సీ డాక్టర్ రామచంద్రరావు, అధికార ప్రతినిధి రాకేశ్ రెడ్డి, రాష్ట్ర నాయకులు జె.సంగప్ప, నూనె బాలరాజ్ గౌడ్ తదితరుల సమక్షంలో పార్టీ కండువా కప్పుకున్నారు. ఈ సందర్భంగా తరుణ్ చుగ్ మల్లన్నకు సభ్యత్వమిచ్చి పార్టీలోకి సాదరంగా ఆహ్వానించారు.
అన్నీ అక్రమ కేసులే..
అంతే కాకుండా మల్లన్న తన కలంతో గళమెత్తుతుంటే జీర్ణించుకోలేని ముఖ్యమంత్రి చంద్రశేఖర్ రావు అక్రమ పోలీసు కేసులు బనాయించి, అనేక విధాలుగా భయభ్రాంతులకు గురిచేస్తున్నారని బండి సంజయ్ మండి పడ్డారు. మలన్నకు అండగా నిలబడ్డామని, తెలంగాణలోని దుర్మార్గమైన పాలనను అంతమొందించాలంటే అది బీజేపీతోనే సాధ్యమని తెలంగాణ ఉద్యమకారులు భావిస్తున్నారని బండి సంజయ్ తెలిపారు.
విఠల్, మల్లన్న వంటి నేతలకు రాజకీయ స్వార్థం లేదని, తెలంగాణలో టీఆర్ఎస్ కుటుంబ, అవినీతి, నియంత ప్రభుత్వాన్ని తరిమితరిమి కొట్టాలని,చంద్రశేఖర్ రావు రాక్షస పాలనకు చరమగీతం పాడాలని, బీజేపీ చేపడుతున్న ఈ మహోద్యమానికి మద్దతు పలకాలని రాష్ట్రంలోని తెలంగాణ ఉద్యమకారులను కోరుతున్నానని బండి సంజయ్ స్పష్టం చేసారు.
కలంతో కవాతు చేస్తున్న వ్యక్తి తీన్మార్ మల్లన్న
బీజేపీలోకి జర్నలిస్టు తీన్మార్ మల్లన్న రాకను స్వాగతిస్తున్నామని, చంద్రశేఖర్ రావు ఆధ్వర్యంలోని టీఆర్ఎస్ ప్రభుత్వ అవినీతి, అరాచకాలు కుటుంబ పాలనకు వ్యతిరేకంగా కలంతో కవాతు చేస్తున్న వ్యక్తి తీన్మార్ మల్లన్న అని తెలంగాణ ఇంఛార్జ్ తరుణ్ చుగ్ స్పష్టం చేసారు. లక్షలాది మంది యువత తీన్మార్ మల్లన్న యూ ట్యూబ్ ఛానల్ ను ఫాలో అవుతున్నారని, కలంతో గళం ఎత్తితే సహించలేని చంద్రశేఖర్ రావు సర్కార్ మల్లన్నపై అనేక కేసులు పెట్టి జైలుకు పంపిందని ఆవేదన వ్యక్తం చేసారు.
చంద్రశేఖర్ రావు నియంత, అవినీతి, కుటుంబ పాలనను అంతమొందించేందుకు బండి సంజయ్ చేపట్టిన ప్రజా సంగ్రామ యాత్రతో చంద్రవేకర్ రావు సర్కార్ పీఠం కదులుతోందని తరుణ్ చుగ్ అన్నారు.
తీన్మార్ మల్లన్న ప్రజాభిమానం ఉన్న వ్యక్తి..
తీన్మార్ మల్లన్న తెలంగాణలో ప్రజాభిమానం చూరగొన్న వ్యక్తి అని నిజామాబాద్ ఎంపి ధర్మపురి అరవింద్ తెలిపారు. ఇండిపెండెంట్ గా గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీగా పోటీ చేస్తే 1.40 లక్షల ఓట్లకుపైగా సాధించి రెండో స్థానంలో నిలిచారని అన్నారు. మల్లన్నను ఓడించడానికి 100 కోట్లకుపైగా చంద్రశేఖర్ రావు ఖర్చు చేశారని, చంద్రశేఖర్ రావు నియంత, అవినీతి పాలనపై పోరాడుతున్న మల్లన్న బీజేపీలో చేరడాన్ని మనస్పూర్తిగా స్వాగతిస్తున్నానని అరవింద్ స్పష్టం చేసారు.