అంతర్జాతీయ సదస్సుకు మహేందర్, పురంధేశ్వరికి ఆస్ట్రేలియా ఆహ్వానం
హైదరాబాద్: దేశ రాజధాని ఢిల్లీలో గురువారం, శుక్రవారం జరగనున్న అంతర్జాతీయ రవాణా సదస్సుకు తెలంగాణ రాష్ట్ర రవాణా శాఖ మంత్రి మహేందర్ రెడ్డి హాజరు కానున్నారు.
ఇన్నోవేటివ్ ట్రాన్సుపోర్టేషన్ ఇన్ పబ్లిక్ సెక్టార్ అండర్ టేకింగ్ పేరిట నిర్వహించే ఈ సదస్సులో దేశంలోని అన్ని రాష్ట్రాల రవాణా శాఖ మంత్రులు, అధికారులు పాల్గొంటారు. శుక్రవారం సదస్సులో పాల్గొన్న అనంతరం మహేందర్ రెడ్డి ఆర్టీసి విభజన పైన కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీతో భేటీ అవుతారు.
ఆస్ట్రేలియా అంతర్జాతీయ సదస్సుకు పురంధేశ్వరికి ఆహ్వానం
అంతర్జాతీయ సదస్సులో పాల్గొనాలంటూ కేంద్ర మాజీ మంత్రి, భారతీయ జనతా పార్టీ మహిళా మోర్చా ఇంఛార్జి దగ్గుబాటి పురందేశ్వరికి ఆస్ట్రేలియా నుంచి ఆహ్వానం అందింది. ఈ నెల 14 నుంచి 16 వరకు అడిలైడ్లో సదస్సు జరగనుంది.
ఈ నేపథ్యంలో లిబరల్ పార్టీ ఆఫ్ ఆస్ట్రేలియా భారత్ నుంచి పురందేశ్వరికి ఆహ్వాన పత్రం పంపింది. ముందుగా మహిళల సమాఖ్య కమిటీ సదస్సులో ఆమె పాల్గొంటారు.
అనంతరం దక్షిణ ఆస్ట్రేలియా లిబరల్ పార్టీ వార్షిక సమావేశాలకు పరిశీలకురాలిగా కూడా వ్యవహరిస్తారు. వివిధ దేశాలకు చెందిన రాజకీయ పార్టీల నేతలను సదస్సుకు ఆహ్వానించారు. మన దేశం నుంచి కేవలం పురందేశ్వరికే అవకాశం లభించడం విశేషం.