అద్దంకి కాదు! మహేష్, వెంకట్: కాంగ్రెస్ అధికారిక ప్రకటన
తెలంగాణలో కాంగ్రెస్ ఎమ్మెల్సీ అభ్యర్ధుల ఎంపికపై కొనసాగుతున్న ఉత్కంఠ తెరపడింది. కాంగ్రెస్ అధిష్ఠానం రెండు ఎమ్మెల్సీ స్థానాలకు అభ్యర్ధులను ఎట్టకేలకు ప్రకటించింది. టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ మహేష్ కుమార్ గౌడ్, ఎన్ఎస్యుఐ రాష్ట్ర అధ్యక్షుడు బల్మూరి వెంకట్లను ఎమ్మెల్సీ అభ్యర్థులుగా ఎంపిక చేస్తూ అధికారకంగా కాంగ్రెస్ ప్రకటించింది. దీంతో వీరు నామినేషన్ వేయనున్నారు.
కాగా, టీపీసీసీ అధికార ప్రతినిధి అద్దంకి దయాకర్, బల్మూరి వెంకట్, మహేశ్ కుమార్ గౌడ్.. వీరిలో ఇద్దరిని ఎమ్మెల్సీ అభ్యర్థులుగా ఎంపిక చేసేందుకు కాంగ్రెస్ తీవ్ర చర్చలే జరిపింది. దావోస్ పర్యటనలో ఉన్న సీఎం రేవంత్ రెడ్డితో కూడా ఈ విషయమై చర్చిస్తున్నట్లు తెలిసింది. మంగళవారం రాష్ట్ర వ్యవహారాల ఇంఛార్జి దీపాదాస్ మున్షీ అద్దంకి దయాకర్కు, బలమూరి వెంకట్లకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చారని నామినేషన్లు దాఖలు చేసేందుకు సిద్దం కావాలని సూచించారని పార్టీ వర్గాలు తెలిపాయి. దీంతో ఆ ఇద్దరు నామినేషన్లు వేసేందుకు అన్ని ఏర్పాట్లు చేసుకున్నారు.

అయితే, ఎలాంటి అధికారిక ప్రకటన ఇవ్వలేదు. ఆశావాహుల్లో మరికొందరు ఉన్నట్లు సంకేతాలు వచ్చాయి. ఫలితంగా అభ్యర్ధుల ఎంపికపై ప్రకటన ఇవ్వలేదు. బుధవారం పార్టీ అధిష్ఠానం అభ్యర్థులతో చర్చించి తుది నిర్ణయం తీసుకుని అధికారక ప్రకటన వెల్లడించింది . ఈ జాబితాలోకి ఎన్ఎస్యుఐ రాష్ట్ర అధ్యక్షుడు బల్మూరి వెంకట్, మహేష్ కుమార్ గౌడ్లను ఖరారు చేస్తూ ఆదేశాలు జారీ చేసింది.
ఎమ్మెల్యే కోటా కింద ఎన్నికైన పాడి కౌశిక్ రెడ్డి, కడియం శ్రీహరిలు ఇటీవల జరిగిన ఎన్నికల్లో ఎమ్మెల్యేలుగా విజయం సాధించారు. ఈ క్రమంలో డిసెంబర్ 9వ తేదీన రాజీనామా చేశారు. దీంతో ఆ రెండు ఖాళీలను ఉప ఎన్నికల ద్వారా భర్తీ చేసేందుకు కేంద్ర ఎన్నికల సంఘం నోటిఫికేషన్ కూడా ఇచ్చింది. నామినేషన్లు వేసేందుకు గురువారంతో గడువు ముగియనుంది. కేంద్ర ఎన్నికల సంఘం ఇచ్చిన నోటిఫికేషన్ ప్రకారం ఎమ్మెల్యేలు ఎక్కువ సంఖ్యలో ఉన్న కాంగ్రెస్ రెండు ఎమ్మెల్సీ స్థానాలను గెలిచేందుకు ఎక్కువ అవకాశాలు ఉన్నాయని రాజకీయ వర్గాలు పేర్కొంటున్నాయి.












Click it and Unblock the Notifications