వర్గీకరణ సభలో మాల-మాదిగ ఫైట్! గద్దర్ ను సైతం.. (ఫోటోలు)
హైదరాబాద్ : ఏళ్లుగా చర్చల్లోనే నానుతూ.. తుది పరిష్కారానికి నోచుకోకుండా సాగుతున్న ఎస్సీ వర్గీకరణ అంశం ఘర్షణాత్మకంగా మారుతున్న వైఖరి కలవరపెడుతోంది. ఓవైపు ఢిల్లీలో మందకృష్ణ ఆందోళనలు.. మరోవైపు రాష్ట్రంలో అందుకు అనుగుణంగా.. మేధావులు, నిపుణుల చర్చలు సాగుతూ వస్తున్నాయి.
ఈ నేపథ్యంలోనే శుక్రవారం నాడు నిజాం కాలేజీ వేదికగా.. ఎస్సీ వర్గీకరణ సభ సమావేశం జరగడం.. సభలోకి చొచ్చుకొచ్చిన మాల నాయకులు దాడులకు పాల్పడడం.. ప్రస్తుతం అటు రాజకీయ వర్గాల్లోను ఇటు సామాజిక పరంగాను తీవ్ర చర్చనీయాంశంగా మారింది. ఒకే అస్థిత్వ మూలాలున్న రెండు వర్గాల మధ్య రిజర్వేషన్ల వర్గీకరణ అనేది సమన్యాయాన్ని ప్రతిబింబిస్తుందంటూ రౌండ్ టేబుల్ సమావేశాన్ని ఏర్పాటు చేశారు.
సమావేశంలో ప్రజా యుద్దనౌక గద్దర్ తో పాటు ప్రొఫెసర్ గాలి వినోద్ కుమార్, ప్రొఫెసర్ కోదండరామ్, బిసి ఉద్యమ నేత సాంబశివరావు సహా పలువురు మేధావులు పాల్గొన్నారు. సమావేశంలో భాగంగా.. తన ప్రసంగాన్ని ముగించుకుని కోదండరామ్ బయటకు నడుస్తుండగా.. మాల సంఘం నాయకులు ఆయన్ను అడ్డుకునే ప్రయత్నం చేశారు. అయితే తనకు అందరూ ఒకటేనని, మాలలు సమావేశం నిర్వహించినా తాను హాజరవుతానని చెప్పుకుంటూ అక్కడినుంచి వెళ్లిపోయారు కోదంరామ్.
అనంతరం సమావేశం జరుగుతున్న హాల్ లోకి చొచ్చుకొచ్చిన మాల సంఘం నాయకులు.. ఫర్నీచర్ ధ్వంసం చేయడంతో పాటు ప్రొఫెసర్ గాలి వినోద్ కుమార్ పైన దాడి చేశారు. ఘటనలో గద్దర్ కూడా కొంత ఇబ్బంది ఎదుర్కొన్నట్లు తెలుస్తోంది. ఇరు వర్గాల మధ్య గొడవ ఉద్రిక్తలకు దారి తీయడంతో.. సమావేశం రసాభాస గా మారింది.
ఎస్సీ వర్గీకరణ సమావేశంపై మాల నాయకుల దాడిని యత్నించడం పట్ల సర్వత్రా విమర్శలు వ్యక్తమవుతున్నాయి. దీనిపై పలువరు నాయకుల స్పందన స్లైడ్స్ లో..
వినోద్ కుమార్ కు గాయం :
మాల నేతల దాడిలో పీజీ న్యాయ కళాశాల ప్రిన్సిపల్ గాలి వినోద్ కుమార్ తలకు గాయమైంది. గద్దర్, వినోద్ కుమార్ ఎంతగా వారించే ప్రయత్నం చేసినా.. గొడవ సర్దమణగలేదు.
వర్గీకరణ న్యాయబద్దమే :
సమావేశంలో భాగంగా ప్రసంగించిన కోదండరామ్.. వర్గీకరణ న్యాయబద్దమేనని స్పష్టం చేశారు. అయితే అసమానతలకు మాలలనే బాధ్యులన్న రీతిలో నింద వేయడం సరికాదన్నారు.
ప్రజాస్వామ్యంపై దాడి :
ఎస్సీ వర్గీకరణ లాంటి ప్రజాస్వామిక కాంక్షల పట్ల దాడులు జరగడాన్ని ప్రజాస్వామ్యంపై దాడిగా అభిర్ణించారు ఎంఎస్ఎఫ్ జాతీయ అధ్యక్షుడు లింగుస్వామి. పద్దతి మార్చుకోకపోతే గట్టి ప్రతిఘటనను ఎదుర్కోక తప్పదని హెచ్చరించారాయన.
కేసీఆర్ తీర్మానం చేశారు, చంద్రబాబే.. :
ఏళ్ల తరబడి ఎస్సీ వర్గీకరణ అంశాన్ని ఎటూ తేల్చకపోవడం సరికాదని, ఆరు నెలల్లోగా విషయాన్ని తేల్చాలని డిమాండ్ చేశారు గద్దర్. వర్గీకరణపై తెలంగాణ సీఎం కేసీఆర్ అసెంబ్లీలో ఇప్పటికే తీర్మానం చేశారని, చంద్రబాబు మాత్రం ఎందుకు నోరు మెదపడం లేదని ప్రశ్నించారు గద్దర్.
గద్దర్ జోక్యం చేసుకోవద్దు : మాల చైర్మన్
ఎస్సీ వర్గీకరణ లాంటి అంశాల్లో గద్దర్ జోక్యం చేసుకోవద్దన్నారు టీ మాలల చెర్మన్ దీపక్ కుమార్. గద్దర్ దళితుల ఐక్యతకు పాటు పడితే బాగుంటుందని సూచించారాయన.