ఇంత దిగజారాలా?: కేసీఆర్ తట్టుకోలేకపోతున్నారంటూ మల్లు భట్టి విక్రమార్క సవాల్
న్యూఢిల్లీ: తన హయాంలో కరవు కారణంగా పంట నష్టపోతే రూపాయి కూడా పరిహారం అందించని మాజీ సీఎం, బీఆర్ఎస్ అధినేత కేసీఆర్.. ఇప్పుడు రైతుల గురించి మాట్లాడటం విడ్డూరంగా ఉందన్నారు తెలంగాణ డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క (Mallu Bhatti Vikramarka). ఇరిగేషన్ సెక్టార్ను నాశనం చేసిందే కేసీఆర్ అని ఆరోపించారు. ఢిల్లీలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో భట్టి మాట్లాడుతూ.. సూర్యాపేటలో కేసీఆర్ చేసిన వ్యాఖ్యలకు కౌంటర్ ఇచ్చారు.
కేసీఆర్ తాను కట్టిన ఇల్లును తానే తగలబెట్టి పోయారని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క విమర్శించారు. ఏడు లక్షల కోట్లకు పైగా అప్పులతో రాష్ట్రప్రజలపై రుణభారం మోపారని భట్టి మండిప్డారు. బీఆర్ఎస్ నేతలు భారీగా కాంగ్రెస్లో చేరుతుంటే.. కేసీఆర్ తట్టుకోలేకపోతున్నారని ఎద్దేవా చేశారు. కేసీఆర్ మాటల్లో కొంచమైనా వాస్తవాలు లేవన్నారు.

పదేళ్లు సీఎంగా ఉన్న వ్యక్తి ఇంతగా దిగజారుతారా? అని భట్టి విక్రమార్క ప్రశ్నించారు. కట్టుకథలు చెప్పి ప్రజలను మభ్యపెట్టాలని ప్రయత్నించారని మండిపడ్డారు. మైక్ సమస్య వస్తే.. దానికి కూడా కరెంట్ కోతలు అంటూ అబద్ధం మాట్లాడారని ధ్వజమెత్తారు. ఆర్థిక క్రమశిక్షణ లేకుండా రాష్ట్రాన్ని కేసీఆర్ అప్పులపాలు చేశారన్న డిప్యూటీ సీఎం భట్టి.. పదేళ్ల పాలనలో కేసీఆర్ ఎన్ని హామీలు నెరవేర్చారో చెప్పాలని డిమాండ్ చేశారు.
బొగ్గు లభించే ప్రాంతానికి 350 కి.మీ. దూరంలో యాదాద్రి పవర్ ప్లాంట్ నిర్మించారని, అంత దూరంగా ఉండటం వల్ల థర్మల్ ప్లాంటుకు బొగ్గు సరఫరా కోసం భారీగా ఖర్చువుతోందని భట్టి విక్రమార్క తెలిపారు. పర్యావరణ అనుమతులు పొందటంలో ఆలస్యం వల్లే.. నిర్మాణ వ్యయం భారీగా పెరిగిందని తెలిపారు. రాష్ట్రానికి 4 వేల మెగావాట్ల విద్యుత్ ఇవ్వాలని విభజన చట్టంలోనే ఉందని.. విభజన చట్టం ప్రకారమే తెలంగాణకి ఎన్టీపీసీ మంజూరైందని భట్టి తెలిపారు.
సూపర్ క్రిటికల్ టెక్నాలజీతో భద్రాద్రి ప్లాంట్ నిర్మించాల్సి ఉంది కానీ, కమీషన్ల కోసం సబ్ క్రిటికల్ టెక్నాలజీతో భద్రాద్రి పవన్ ప్లాంట్ చేపట్టారని డిప్యటీ సీఎం భట్టి ఆరోపించారు. విద్యుత్ సరఫరా లేకుంటే రాష్ట్రంలో రికార్డు స్థాయిలో విద్యుత్ వినియోగం ఎలా జరుగుతుందని ప్రశ్నించారు. రాష్ట్రంలో విద్యుత్ కోతలు ఎక్కడా లేవన్నారు భట్టివిక్రమార్క. వినియోగదారులపై భారం మోపకుండా వ్యవస్థను గాడినపెట్టే చర్యలు చేపట్టామన్నారు.
కేసీఆర్.. అందరికీ డబుల్ బెడ్రూం ఇళ్లు నిర్మించి ఇచ్చారా? అని భట్టి ప్రశ్నించారు . ప్రతి మండలంలో బాలబాలికలకు ఇంగ్లీష్ మీడియం స్కూళ్లు, ప్రతి నియోజకవర్గంలో కేజీ టూ పీజీ విద్యాలయాలు నిర్మించారా అని నిలదీశారు. దళితులకు మూడెకరాల భూమి పంపిణీ మాట ఏమైందన్నారు. ప్రపంచంలోనే అత్యద్భుతం అని చెప్పిన కాళేశ్వరం ప్రాజెక్ట్ కుంగిపోయిందని భట్టి విమర్శించారు. అన్ని లెక్కలతో చర్చకు రావడానికి తాను సిద్ధమని కేసీఆర్కు సవాల్ విసిరారు డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క.












Click it and Unblock the Notifications