మూడో పెళ్లికి సిద్ధమైన నిత్య పెళ్లికొడుకు: విచారణలో వెల్లడి, అరెస్ట్
హైదరాబాద్: మూడో పెళ్లికి సిద్ధమైన ఓ నిత్య పెళ్లికొడుకును చాంద్రాయణగుట్ట పోలీసులు అరెస్ట్ చేసి రిమాండ్కు తరలించారు. దీనికి సంబంధించిన వివరాలిలా ఉన్నాయి. యాకుత్పురాకు చెందిన మహ్మద్ నజీముద్దీన్ ఇమ్రాన్(31)కు 2008వ సంవత్సరంలో మల్లేపల్లికి చెందిన నసీమా యాస్మిన్ అనే మహిళతో వివాహం జరిగింది.
వీరికి ఇద్దరు సంతానం. ఆ తర్వాత షమీమ్ బేగం అనే మహిళతో పరిచయం ఏర్పరుచుకొని మాయమాటలు చెప్పి తనకు పెళ్ళి కాలేదని 2014లో ఆమెను వివాహం చేసుకున్నాడు. మళ్లీ ఇప్పుడు మూడో పెళ్లి చేసుకునేందుకు సిద్ధపడ్డాడు. ఇందులో భాగంగా బార్కస్కు చెందిన ఫౌజియా బేగంతో పరిచయం పెంచుకుని తనకు ఇంకా పెళ్ళి కాలేదని, బ్యాచిలర్నని నోటరీ చేయించి ఇచ్చాడు.
ఇమ్రాన్ ప్రవర్తన పట్ల అనుమానం రావడంతో ఫౌజియా తన కుటుంబ సభ్యుల సహకారంతో విచారించగా తనకు ఇదివరకే రెండు పెళ్లిళ్ళు అయ్యాయని తెలుసుకొని ఆశ్చర్యానికి గురైంది. దీంతో వెంటనే ఈనెల 14న చాంద్రాయణగుట్ట పోలీసులకు ఫిర్యాదు చేశారు.
బాధితురాలి ఫిర్యాదు మేరకు చాంద్రాయణగుట్ట ఎస్సై లక్ష్మణ్ కేసు నమోదు చేసుకుని నిందితుడు ఇమ్రాన్ను అదుపులోకి తీసుకుని రిమాండ్కు తరలించారు.
షాదీముబారక్ డబ్బులు నేరుగా లబ్ధిదారుల ఖాతాల్లోకే: కలెక్టర్ రాహుల్ బొజ్జా
తెలంగాణ ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా ప్రారంభించిన షాదీముబారక్ పథకంలో అక్రమాలకు తెరదించేందుకు ప్రభుత్వం రంగం సిద్ధం చేసింది. ఇందులో భాగంగా ముస్లింలకు ప్రభుత్వం అందిస్తున్న రూ.51వేల ఆర్థిక సహాయాన్ని బ్యాంకు ఖాతాల్లో మాత్రమే జమచేస్తునట్లు రంగారెడ్డి జిల్లా కలెక్టర్ రాహుల్బొజ్జా ఒక ప్రకటనలో తెలిపారు.
జీరో బ్యాలెన్స్తో ప్రారంభించిన బ్యాంకు ఖాతాల్లో ఈ డబ్బులు జమచేయడం లేదని, లబ్ధిదారులు రూ.500 ఖాతాలో జమచేసి సేవింగ్స్ ఖాతాగా మార్చుకునేందుకు సంబంధిత బ్యాంకు మేనేజర్కు దరఖాస్తు చేసుకోవాలని సూచించారు.
బ్యాంకు ఖాతా సేవింగ్స్ అకౌంట్గా మార్చుకున్న తర్వాత అకౌంట్ జిరాక్స్ పత్రాలు, ఫొటో కాపీ జిల్లా మైనార్టీ సంక్షేమాధికారి, నాంపల్లి హజ్హౌజ్ 6వ అంతస్థులో సమర్పించాల్సి ఉంటుందని తెలిపారు. మరోవైపు కొంతమంది లబ్ధిదారులకు ఆర్థిక సహాయం సరిగా అందడం లేదంటూ జిల్లా పాలనా యంత్రాంగం దృష్టికి వచ్చిందని అన్నారు.
దీనిపై చర్యలు తీసుకుంటున్నామని చెప్పిన ఆయన, ఈ నేపథ్యంలో లబ్ధిదారులు తమ ఏటీఎం కార్డులు, పిన్ నెంబర్ను ఇతరులెవ్వరికీ ఇవ్వకుండా జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. షాదీ ముబారక్ పథకం కింద ఆర్థిక సాయం పొందేందుకు దరఖాస్తులు మీసేవా కేంద్రాల్లో నిర్ణీత రుసుము కన్నా అదనంగా చెల్లించకుండా పొందవచ్చన్నారు.
లబ్ధిదారులు మధ్య దళారులు, బ్రోకర్లను నమ్మి మోసపోవద్దని, సంబంధిత అధికారుల, సలహాలు తీసుకోవాలని ఆయన లబ్ధిదారులకు సూచించారు.